'నర్సీపట్నం'లో 'టిడిపి'కి ఆధిక్యత...!

వార్డుల్లో వైకాపా...ఓట్లలో 'టిడిపి'దే పైచేయి
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా హవా కనిపించింది. దాదాపు అన్ని మున్సిపాల్టీలను వైకాపా కైవసం చేసుకుంది. అయితే ఓట్ల పరంగా అధికార వైకాపా, ప్రతిపక్ష టిడిపికి పెద్ద తేడా కనిపించడం లేదు. కేవలం 2 లేక 3 శాతం ఓట్లు వైకాపాకు ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. టిడిపికి 40శాతం ఓట్లు రాగా వైకాపా 43 శాతం వచ్చాయని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే 'విశాఖపట్నం' జిల్లా 'నర్సీపట్నం'లో వైకాపాకు 14 వార్డులు, టిడిపికి 12వార్డులు, జనసేన, ఇండిపెండెంట్కు ఒక్కో వార్డు వచ్చాయి. ఇక్కడ టిడిపి,జనసేన, ఇండిపెండెంట్ కలిస్తే వైకాపాకు సమానం అవుతాయి. ఎక్స్ అఫిషియో ఓటుతో వైకాపా కార్పొరేషన్ దక్కించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే 'నర్సీపట్నం'లో ఓట్ల పరంగా 'టిడిపి'నే ఆధిక్యత సాధించింది. మొత్తం 35,360 ఓట్లు పోల్ కాగా ప్రతిపక్ష టిడిపికి 15930 ఓట్లు, అధికార వైకాపాకు 15137 ఓట్లు వచ్చాయి. అంటే ఓట్ల పరంగా టిడిపికి 793 ఓట్లు మెజార్టీ వచ్చిందన్న మాట. అయితే వార్డుల పరంగా మాత్రం వైకాపానే ఎక్కువ గెలిచింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇక్కడ 'బిజెపి'కి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా..రాష్ట్రంలో అధికారం తమదేనని చెప్పుకుంటున్న బిజెపి 'నోటా'తో కూడా పోటీ పడలేకపోతోంది. 'జనసేన'కు కేవలం 985 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఆ ఓట్లే టిడిపి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీశాయి. మొత్తం మీద..వైకాపా చెబుతున్నట్లు ఎన్నికలు ఏకపక్షంగా ఏమీ జరగలేదు. పోటా పోటీగానే జరిగాయి.