‘జర్నలిస్టు’పై పరువు నష్టం కేసు వేసిన ఎన్టివీ ఛైర్మన్
తన పరువుకు నష్టం కలిగించారని ఆరోపిస్తూ ఓ జర్నలిస్టుపై మరో మీడియా సంస్థకు చెందిన మీడియా అధిపతి కోర్టులో పరువు నష్టం కేసును దాఖలు చేశారు. తనను కించపరుస్తూ వార్తలు రాశారని, తనకు పరువు నష్టం కలిగించారని ‘తెలుగుగేట్వే.కామ్’కు చెందిన జర్నలిస్టు ‘వాసిరెడ్డి శ్రీనివాస్’పై ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి కోర్టులో కేసు వేశారు. ఆధారాలు లేకుండా తనపై అసత్యవార్తలు రాసినందుకు రూ.50లక్షలు చెల్లించాలని ఆయన కోర్టులో సూట్ దాఖలు చేశారు. అంతే కాకుండా తనపై ‘వాసిరెడ్డి’ ఆయన కార్యాలయ సిబ్బంది పరువు నష్టం కలిగించే వార్తలు రాయకుండా మధ్యంతర ఉత్తర్వులును ఇవ్వాలని ‘చౌదరి’ కోర్టును కోరారు. దీనిపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇస్తూ కేసును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు కోర్టుకు హాజరు కావాలని ‘వాసిరెడ్డి’ని కోరింది. గతంలో ‘నరేంద్రచౌదరి’ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సొసైటీలో ఆర్ధిక అవకతవకలు జరిగాయని ‘వాసిరెడ్డి’ తన వెబ్సైట్లో వార్తను ప్రచురించారు. సొసైటీకి చెందిన స్థలంలో నిర్మాణానికి సంబంధించి దాదాపు రూ.29కోట్లు అక్రమాలు జరిగాయని ఆ కథనంలో పేర్కొన్నారు. దీనిపై ‘నరేంద్ర చౌదరి’ ‘వాసిరెడ్డి’ మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై ఇటీవల ‘వాసిరెడ్డి’ని తన పలుకుబడి ఉపయోగించి ‘చౌదరి’ అరెస్టు చేయించడానికి ప్రయత్నించారని వార్తలు వచ్చాయి.
‘ఆంధ్రప్రదేశ్’లో అధికార వైకాపాను గుడ్డిగా సమర్ధించే జర్నలిస్టుగా ‘వాసిరెడ్డి’ గుర్తింపు పొందారు. ‘జగన్’ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గెలవాలని గట్టి పట్టుదలగా పనిచేశారు. అప్పటి టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కథనాలు ప్రచురించారు. నాడు ‘చంద్రబాబు’ ఏమి చేసినా విమర్శించి, ఆయన పతనాన్ని ‘వాసిరెడ్డి’ కోరుకున్నారు. ఆయన ఆకాంక్షలు ఫలించి ‘జగన్’ అధికారంలోకి వచ్చారు. ‘జగన్’ పాలనాపగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ‘వాసిరెడ్డి’ సీనియర్ జర్నలిస్టు ‘కొమ్మినేని శ్రీనివాసరావు’ శిష్యుడనే పేరు ఉంది. కాగా..ఇప్పుడు ‘వాసిరెడ్డి’పై పరువు నష్టం దావా వేసిన ‘నరేంద్ర చౌదరి’ కూడా ‘జగన్’కు గట్టి మద్దతుదారుడే. అధికార వైకాపాను సమర్ధించే జర్నలిస్టుల మధ్య ఏ విషయంలో తేడాలు వచ్చాయో కానీ..ఇప్పుడు ఒకరిపై ఒకరు కారాలు,మిరియాలు నూరుకుంటున్నారు. ఒకప్పుడు ఎన్టివీలో పనిచేసి ‘చౌదరి’కి దగ్గరయిన ‘కొమ్మినేని’ ఇప్పుడు తన శిష్యుడైన ‘వాసిరెడ్డి’కి మద్దతు ఇస్తారా..లేక తన పాతబాస్కు మద్దతు ఇస్తారో చూడాల్సి ఉంది.