అప్పుడే అంత వ్యతిరేకత..నిజమేనా...!?
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డిఏ కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ప్రజలు భావిస్తున్నారని, తమ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చెబుతున్నారు. మూడు నెలల్లోనే ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను సర్వనాశనం చేసిందని, తాను ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన చెబుతోన్న మాటలు మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఆయనే కాకుండా ఎన్నికల ముందు వరకూ ఎన్డిఏ కూటమికి మద్దతు ఇచ్చిన మాజీ జడ్డి శ్రావణ్ కుమార్ ఎన్డిఏ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి 25 సీట్లకు మించి రావని, ఎన్డిఏ కూటమిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తారని ఆయన వైకాపా అనుకూల యూట్యూబ్ ఛానెళ్లతో వ్యాఖ్యానిస్తున్నారు. అయితే..వీరిద్దరూ చెబుతోన్న మాటలు నిజమేనా..అంటే..కాదనే చెప్పవచ్చు. మూడు నెలల్లోనే అంత వ్యతిరేకత వచ్చిందా..అంటే..ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు. ఈ మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు ఏమిటి..? గతంలో..వైకాపా చేసి పాపాలను ఇప్పటి కూటమి ప్రభుత్వం కడుగుతోంది. వైకాపా అరాచకపాలనతో విసిగిన ప్రజలు ఇప్పుడే ప్రజాస్వామ్యబద్ద పాలనను చూస్తున్నారు. కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదనే జగన్ మాట అవాస్తవం. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఫించన్ మూడు వేలు ఉన్నది నాలుగు వేలు చేశారు. అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. చెత్తపన్ను రద్దు, ఉచిత ఇసుక విధానం మళ్లీ తేవడం వంటి చర్యలను చేపట్టారు. అయితే..ఇంకా కొన్ని కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. అమ్మకు వందనం పథకాన్ని అమలుచేయలేదని వైకాపా ఒకటే ట్రోలింగ్ చేస్తోంది. మీకు 15వేలు..మీకు రూ.15వేలు..మీకు రూ.15వేలు..అనేది ప్రజల్లోకి వేగంగా వెళుతోంది. ప్రభుత్వం చేస్తోన్నమంచి పనులను ప్రచారం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది.పాలనలో చంద్రబాబు ఇంకా తన మార్కు చూపించలేకపోతున్నారనే భావన అందరిలో వ్యక్తం అవుతోంది. సామాన్యులకు కొంత మేలు చేస్తున్నా..వేగంగా చేయడం లేదనే భావన వారిలో ఉంది. అయితే..జగన్ చెబుతున్నట్లు విపరీతమైన వ్యతిరేకత అయితే మాత్రం లేదు. అయితే..జగన్ చెబుతున్నట్లు చంద్రబాబు పాలనపై ప్రజల్లోకాదు కానీ స్వంత పార్టీ కార్యకర్తల నుంచి కొంత వ్యతిరేకత ఉన్నమాట నిజమే.
టిడిపి కార్యకర్తలో అసంతృప్తి నిజమే...!
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోలేదని, వారిని మోసం చేశారనే భావన వారిలో ఉంది. తండ్రీకొడుకులు ఇద్దరూ తమను పట్టించుకోవడం లేదని, కనీసం వారిని కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదనే భావన వారిలో ఉంది. అదే విధంగా తమను వేధించిన వైకాపా నాయకులపై కనీసం కేసులు పెట్టడం లేదని, అధికారులంతా గతంలో పనిచేసిన వారినే మళ్లీ ప్రోత్సహిస్తున్నారని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడం లేదనే భావన వారిలో గట్టిగా ఉంది. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు కూడా వారికి రుచించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో చెప్పారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత..ఏమీ చేయడం లేదని వారు వాపోతున్నారు. తమ పార్టీ గెలిచినా..అధికారం మళ్లీ వైకాపా వారే అనుభవిస్తున్నారని, గతంలో తాము కొట్లాడిన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ఇది సరికాదని వారు అంటున్నారు. కూటమి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం లేదని, ఎమ్మెల్యేల, మంత్రుల అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఇది కేవలం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం. ప్రజల్లో మాత్రం జగన్ చెప్పిన అసంతృప్తి మాత్రం వాస్తవం కాదు.