రాష్ట్ర మంత్రివర్గంలోకి ‘విజసాయిరెడ్డి’..రాజ్యసభకు ‘మేకపాటి’...!?
త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో మరోసారి వైకాపా పార్లమెంటరీపార్టీ నాయకుడు ‘విజయసాయిరెడ్డి’కి రాజ్యసభ సీటు ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో వైకాపా తరుపున ‘విజయసాయిరెడ్డి’ ఎంపిక ఖరారైందని, ఇక మిగిలిన మూడు స్థానాల కోసమే అభ్యర్థులు పోటీ పడుతున్నారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కొత్తగా ‘విజయసాయిరెడ్డి’కి అవకాశం లేదనే ప్రచారం వైకాపా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘జగన్’ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడైన ‘విజయసాయిరెడ్డి’ ఢిల్లీలో వైకాపా వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆయనను ‘జగన్’ పక్కనపెట్టారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది.
‘జగన్’ ‘విజయసాయిరెడ్డి’ల మధ్య దూరం పెరిగిందని, ఇక ఢిల్లీ వ్యవహారాల నుంచి ‘విజయసాయిరెడ్డి’ని తప్పిస్తారని, ఆయనను త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా నియమిస్తారని, ఆయన స్థానంలో రాజ్యసభకు ఇటీవల మరణించిన పరిశ్రమలశాఖ మంత్రి ‘మేకపాటి గౌతమ్రెడ్డి’ తండ్రి మాజీ ఎంపి ‘మేకపాటి రాజమోహన్రెడ్డి’కి ఇస్తారని తెలుస్తోంది. ‘రాజమోహన్రెడ్డి’తో పాటు, ‘అదానీ’ సతీమణి, నెల్లూరుకు చెందిన బీసీ నేత బీద మస్తాన్రావు, కాపు కోటా కింద కాకినాడకు చెందిన ‘సునీల్’ను రాజ్యసభకు పంపిస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా ‘సజ్జల’ కూడా రాజ్యసభను ఆశిస్తున్నారు. మరి ఆయన సంగతి ఏం చేస్తారో చూడాల్సిఉంది. మొత్తం మీద ‘విజయసాయిరెడ్డి’ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే, అది వైకాపా వర్గాల్లో సంచలనమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.