లేటెస్ట్

అభిమణ్యుల్లా పోరాడిన ‘టిడిపి’ ఎమ్మెల్యేలు...!?

గత సార్వత్రిక ఎన్నికల్లో ‘టిడిపి’ ఘోరపరాజయం పాలైన తరువాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తగినంతగా రాణించలేకపోయింది. గత మూడేళ్ల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా ప్రధానప్రతిపక్షంగా ‘టిడిపి’ అధికారపార్టీని ఇరుకున పెట్టలేకపోయింది. మొదట్లో భారీ మెజార్టీతో గెలిచిన ఉత్సాహం అధికారపార్టీలో ఉండగా, ఆ పార్టీ తరుపున ఎవరు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా వ్యవహరించినా వారికి వచ్చిన భారీ మెజార్టీ ‘టిడిపి’ని నోరుమెదనీయలేదు. అయితే..రాను రాను అధికారపార్టీ అనేక తప్పులు చేసినా..వాటిని అసెంబ్లీలో ‘టిడిపి’ గట్టిగా నిలదీయలేకపోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను అంతగా వెలుగులోకి తీసుకురాలేకపోయింది. ప్రతిపక్షనాయకుడు ‘చంద్రబాబు’పై ముఖ్యమంత్రి జగన్‌తో సహా ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్రమైన భాషతో విరుచుకుపడుతుండడంతో ఆయన ఆత్మరక్షణకై ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. అధికారపార్టీ కూడా ఆయనను, ఆయన తనయుడిని టార్గెట్‌ చేయడంతో ప్రధానప్రతిపక్షం ఏమీ చేయలేకపోయింది. గత సమావేశాలలో అయితే అధికారపార్టీ బరితెగించి ‘చంద్రబాబు’ సతీమణిని దూషించింది. దీంతో ‘చంద్రబాబు’ అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్‌ చేసి, తాను మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపథం చేశారు. ‘చంద్రబాబు’ అసెంబ్లీకి రాకపోవడంతో మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆఖరు నిమిషంలో ‘చంద్రబాబు’ తప్ప మిగతా వారంతా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయం ఇప్పుడు మంచి ఫలితాలనే సాధించింది.


వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ‘టిడిపి’ బలం కేవలం 23 మంది మాత్రమే. వీరిలో నలుగురు పార్టీని ఫిరాయించారు. మరో ఇద్దరు ముగ్గురు అసలు తాము పార్టీలో ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా కాలం గడిపేస్తున్నారు. అంటే మొత్తం మీద ఒక పదిహేను మంది మాత్రమే ‘టిడిపి’ తరుపున మిగిలారు. అయితే ఈ 15మంది అసెంబ్లీలో ఒక్కొక్కరు ఒక్కో అభిమన్యుడిలా పోరాడారంటే అతిశయోక్తి కాదు. ఈ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అధికారపార్టీకి చుక్కలు చూపించింది. తొలుత 35మంది కమ్మ డిఎస్పీలకు ‘చంద్రబాబు’ ప్రమోషన్‌ ఇప్పించాడని అప్పట్లో ఆరోపించిన ‘జగన్‌’ మాటలు వట్టివేనని అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రితో ‘టిడిపి’ సభ్యులు చెప్పించారు. ఈ సమావేశాల్లో ఇదే ‘టిడిపి’ తొలిగెలుపు. ఈ సందర్భంగా టిడిపి శాసనసభాపక్ష ఉపనేత ‘నిమ్మలరామానాయుడు’ వ్యవహరించిన తీరు సమావేశాలకే హైలెట్‌.  డిఎస్పీల ప్రమోషన్‌లల్లో ‘చంద్రబాబు’ కులాన్ని చూడలేదని, ఆయన న్యాయంగానే వ్యవహరించారని హోంమంత్రి ఇచ్చిన సమాధానాన్ని వైకాపా సభ్యులు చదవనీయకుండా గోలచేస్తున్నా ‘నిమ్మల’ వారిని పట్టించుకోకుండా ప్రజల దృష్టికి తెచ్చారు.


ఇక నిరుద్యోగుల విషయంలో ఇచ్చిన వాయిదా తీర్మానం, జంగారెడ్డిగూడెంలో జరిగిన మద్యం మరణాల విషయంలో ‘టిడిపి’ ‘జగన్‌’ను తలెత్తుకోనీయకుండా చేయగలిగింది. తొలుత అవి కల్తీసారా మరణాలు కావని, సాధారణ మరణాలని, 55వేలకు పైగా జనాభా ఉన్న ఒక మున్సిపాల్టీలో ‘నాటుసారా’ ఎలా తయారు చేస్తారంటూ సిఎం జగన్‌ అమాయకంగా ప్రశ్నిస్తూ అవి సాధారణ మరణాలని ధృవీకరించారు. అయితే తరువాత ప్రభుత్వమే అవి నాటుసారా మరణాలని ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో కల్తీసారా విషయంలో ‘టిడిపి’ తాను అనుకున్నది సాధించగలిగింది. వీటన్నిటికంటే హైలెట్‌ అయినది మద్యం బ్రాండ్ల వ్యవహారంలో ‘జగన్‌’తో సెల్ప్‌గోల్‌ వేసుకునే విధంగా ఆయనను బుట్టలోకి లాగింది ‘టిడిపి’. మద్యం బ్రాండ్ల చర్చ సందర్భంగా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ‘చంద్రబాబు’ అడ్డుపడుతున్నారని, మద్యంపై ఆదాయం ఎంతో ముఖ్యమని దీనితోనే అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వ పథకాలను ఇస్తున్నానని ‘జగన్‌’ అసెంబ్లీ వేదికగా చెప్పుకున్నారు. మహిళలకు తాయిలాలు ఇవ్వడానికి పురుషలతో మద్యం తాగిస్తారా..? అనే ప్రశ్న వివిధ వర్గాలద్వారా వస్తోంది. ఈ విషయంలో టిడిపి వైకాపాపై మరోసారి పైచేయి సాధించింది.


అదే విధంగా అసెంబ్లీలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌పై చేస్తోన్న పొగడ్తలపై ప్రతిపక్షపార్టీ అసెంబ్లీలోకి చిడతలను తెచ్చి వాయించి వారు ఏ విధంగా ‘జగన్‌’ భజన చేస్తున్నారో మరోసారి చాటిచెప్పింది. అయితే అసెంబ్లీలోకి ‘చిడతలను’ తేవడం తప్పని టిడిపి సభ్యులను సభాపతి సస్పెండ్‌ చేశారు. మొత్తం మీద అధికారపార్టీ తనకున్న బలంతో , స్పీకర్‌ సహకారంతో సభలో పైచేయి సాధించాలని చూసినా, ఉన్న కొద్దిమంది సభ్యులతోనే ‘టిడిపి’ అధికారపార్టీకి చుక్కలు చూపించగలిగింది. ఈసారి సమావేశాల్లో మొదట్లోనే నోరున్న ‘అచ్చెంనాయుడు, బుచ్చయ్యచౌదరి’ వంటి వారిని అధికారపార్టీ సస్పెండ్‌ చేసినా, గతంలో చురుగ్గాలేని టిడిపిసభ్యులు ఈసారి మాత్రం దూకుడుగా వ్యవహరించి ‘టిడిపి’ని నిలబెట్టారు. అసెంబ్లీకి ‘చంద్రబాబు’ రాకపోయినా తన గదిలో కూర్చుని టిడిపి సభ్యులకు సూచనలు చేస్తూ వారితో పోరాటం చేయించగలిగారు. అదే విధంగా మండలిలో కూడా ‘టిడిపి’ పైచేయి సాధించింది. మొత్తం మీద గతంలో కన్నా టిడిపి ఈసారి మంచి ప్రదర్శనే చేయగలిగింది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ