పొత్తులేకుండానే ‘టిడిపి’ గెలుస్తుందట...!?
ఎన్నికలు ఎప్పుడు జరిగినా, పొత్తు ఉన్నా లేకపోయినా వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని ‘ఆత్మసాక్షి’ తన నూతన సర్వేలో స్పష్టం చేసింది. (ఈ సర్వే ఫిబ్రవరి 17 వరకూ జరిగింది) ‘ఆత్మసాక్షి’ సర్వే ప్రకారం టిడిపికి 78 సీట్లు వస్తాయని తేలింది. అదే సమయంలో అధికార వైకాపాకు 63 సీట్లు వస్తాయని, సినీ నటుడు ‘పవన్ కళ్యాణ్’ పార్టీకి 7 సీట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసింది. ‘జనసేన’కు వచ్చే 7 సీట్లలో నాలుగు సీట్లు తూర్పుగోదావరి జిల్లా నుంచే వస్తాయని తెలిపింది. రాజకీయంగా ‘కాపులు’ ఆధిక్యత కలిగిన తూర్పుగోదావరి జిల్లాలో ‘జనసేన’ నామ మాత్రమైన సీట్లును సాధించబోతోందట. సర్వే ప్రకారం ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, టిడిపికి 78 సీట్లు వస్తాయని, అదే సమయంలో 27 సీట్లలో హోరాహోరి పోటీ ఉంటుందని, అయితే ఈ 27 సీట్లలో 13 సీట్లలో టిడిపికి ఆధిక్యత ఉందని, 14 సీట్లలో వైకాపాకు ఆధిక్యత ఉందని సర్వే తెలిపింది. ఈ హోరాహోరి పోరు ఉన్న సీట్లను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే టిడిపికి 91సీట్లు వస్తాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 90 సీట్లు సరిపోతాయి. అదే సమయంలో అధికార వైకాపా బలం కూడా 77 సీట్లకు పెరుగుతుంది. ఇదంతా పొత్తులు లేకుండానే. అయితే ఎటువంటి పొత్తులు లేకుండానే టిడిపి సగం సీట్లలో విజయం సాధించడం ఖాయమైంది. ఒక వేళ అందరూ అనుకున్నట్లు జనసేనతో ఆ పార్టీకి పొత్తు ఉంటే ఆ కూటమికి 150 సీట్ల దాకా రావచ్చునని సర్వే స్పష్టం చేసింది. ఎన్నికలకు మరో 13 మాసాలు సమయం ఉండగా, ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది.