ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘జగన్’కు షాక్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి షాక్ తగిలింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన షాక్ నుంచి కోలుకోక ముందే మరోసారి వైకాపాకు, ముఖ్యమంత్రికి టిడిపి అధినేత చంద్రబాబు మరో రaలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్సీలను ఎన్నుకునే ఓటింగ్లో టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేనాటి వరకు కూడా టిడిపి ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే విషయాన్ని ప్రకటించలేదు. దీంతో టిడిపి ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటుందని వైకాపా, ఆ పార్టీ అధినేత జగన్ భావించారు. అందుకే తమ పార్టీ తరుపున మొత్తం ఏడుగురు అభ్యర్థులను రంగంలోకి దించారు. అయితే ఇక్కడే టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యహరించారు. ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించాలంటే 23మంది ఎమ్మెల్యేలు అవసరం. వాస్తవానికి టిడిపి తరుపున గత ఎన్నికల్లో 23 మంది గెలిచారు. అయితే వారిలో నలుగురు వైకాపాలోకి ఫిరాయించారు. దీంతో టిడిపి బలం 19 మందే. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలంటే మరో నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి ఓటు వేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో టిడిపి ఈ ఎన్నికకు దూరంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే టిడిపి అధినేత చంద్రబాబు వైకాపాలో ఉన్న అసంతృప్తిని పసిగట్టి బీసీ సామాజికవర్గానికి చెంది ‘పంచుమర్తి అనురాధ’ను అభ్యర్థిగా పోటీ పెట్టారు. దీంతో వైకాపాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుస్తారని వారు భావించగా, టిడిపి పోటీలోకి దిగడంతో వైకాపా అత్యవసరంగా క్యాంపు రాజకీయాలను నిర్వహించింది. ఎమ్మెల్యేలను హుటాహుటిన విజయవాడ తరలించి ఎన్నికల వరకు వారి కోరింది చేసిపెట్టారు. ఏ ఒక్కరిని వదులుకోకుండా, అందరినీ బుజ్జగించి పార్టీ అభ్యర్థులకు ఓటు వేయించడానికి ప్రయత్నించారు. చివరకు ముఖ్యమంత్రి స్వయంగా వారిని బుజ్జగించారు. వారు అడిగిన పనులను వెంటనే చేసిపెట్టారు. అయితే..ఆయన ఎంత ప్రయత్నించినా..ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థికి ఓటు వేసి టిడిపిని గెలిపించారు. దీంతో వైకాపా శిబిరం అవాక్కు అయింది. మొన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో ఓడినా..వారు..తమ ఓటర్లు కాదని, ఆ ఓటమితో తమకు సంబంధం లేదని, తమ ఓటర్లు వేరే ఉన్నారని ప్రభుత్వ సలహాదారు ప్రకటించారు. అయితే..ఇప్పుడు దాని కన్నా పెద్ద షాక్ తగిలింది. స్వంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ అభ్యర్థులకు ఓటు వేయకుండా ప్రత్యర్థికి ఓటు వేశారు. దీంతో..జగన్పై ప్రజలతో పాటు స్వంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా విశ్వాసాన్ని కోల్పోయారన్న విశ్లేషణలు వెలువెడుతున్నాయి. మొత్తం మీద..టిడిపి అధినేత వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడలు ఫలించి, ఎటువంటి అవకాశం లేని చోట కూడా విజయాన్ని సాధించారని, ఆయన వ్యూహాలు మళ్లీ పదునెక్కుతున్నాయని మాట సర్వత్రా వినిపిస్తోంది.