బాబు వ్యూహం ఏమిటో...!?
హఠాత్తుగా కూటమిలో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. ఎందుకో కానీ..అంతా సాఫీగా సాగిపోతున్నవేళ కూటమిలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, జనసేనల మధ్య చిచ్చు మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఉపముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ ఇప్పుడు వారి మధ్య చిచ్చుకు ప్రధాన కారణం. హఠాత్తుగా టిడిపిలో ఈ డిమాండ్ మొదలైంది. ఇది ఎవరు సృష్టించారో తెలియదు కానీ..ఇప్పుడు కూటమి విచ్ఛన్నం అయ్యే పరిస్థితికి వచ్చిందేమోనన్న సందేహాలు చూపరుల్లో కలుగుతోంది. ఏడు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం చాలా వరకు బాగానే పనిచేస్తోంది. కొన్ని లోపాలు ఉన్నా..అనుకున్న విధంగానే కూటమి పాలన సాగుతోంది. ముందుగా పెన్షన్లు పెంచడం, పోలవరాన్ని గాడినపెట్టడం, పోలవరం నిర్వాసితులకు ఎటువంటి ఆర్భాటం లేకుండా పరిహారం చెల్లించడం, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు తేవడం, రైల్వేజోన్కు ప్రధానితో శంఖుస్థాపన చేయించడం, విశాఖస్టీల్ప్లాంట్ ప్రవేటీకరణను అడ్డుకోవడమే కాక, దాని కోసం ప్రత్యేక ప్యాకేజ్ సాధించడం, రైతులకు ధాన్యం సొమ్ములు రెండు గంటల్లో ఖాతాల్లో వేయడం, మందుబాబులకు నాణ్యమైన మందు అందించడం, చెత్తపన్నును రద్దు చేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం, మెగా డీఎస్సీ ప్రకటించడం, ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు చెల్లించడం, సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయడం..ఇలా కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లో చాలా వరకు మంచి పనులే చేసింది. ఒక వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతూ ఇది చేతల ప్రభుత్వమనే పేరు తెచ్చుకుంటోంది. అయితే..ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై మెతకగా వ్యవహరించడం, వైకాపా ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించిన వారిని శిక్షించకపోవడం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, ఇంకా ఇస్తానన్న సంక్షేమపథకాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వంపై కొందరిలో అసంతృప్తి నెలకొంది. అయితే..అసంతృప్తివాదులు ఎంత మేరకు ఉన్నారో తెలియదు కానీ..కూటమి ప్రభుత్వం సరైన దారిలోనే నడుస్తోందన్న అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో ఉంది.
అయితే..ఇప్పుడు హఠాత్తుగా లోకేష్కు డిప్యూటీ సిఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ టిడిపిలో రోజు రోజుకు పెరిగిపోతోంది. దీనిపై జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ను ఉపముఖ్యమంత్రిని చేస్తే తమ నేత విలువ తగ్గుతుందని, ఆయనను ఉపముఖ్యమంత్రి చేయడానికి వీలు లేదని వారు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి లోకేష్ను ఉపముఖ్యమంత్రిని చేస్తారని ఎవరూ ఇంత వరకూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ..జనసేన క్యాడర్ మాత్రం దీనిపై అప్పుడే విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ స్పందించలేదు. మరోవైపు టిడిపిలో సీనియర్ నేతలు లోకేష్ను డిప్యూటీ సిఎంను చేయాలని డిమాండ్లు మీద డిమాండ్లు చేస్తున్నారు. ఆయన టిడిపికి మూడో తరం నాయకుడని, ఆయనను ఇప్పుడు డిప్యూటీ సిఎం చేయకపోతే పార్టీ చాలా నష్టపోతుందని వారు చెబుతున్నారు. పార్టీ గెలుపుకోసం ఆయన చాలా చేశారని, సుధీర్ఘపాదయాత్ర చేశారని, పార్టీ కార్యకర్తల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారని, ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతోన్న లోకేష్కు డిప్యూటీ సిఎం పదవి ఇస్తే తప్పేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే..లోకేష్ను డిప్యూటీ సిఎంను చేస్తే తమ నేతను సిఎంను చేయాలని చంద్రబాబును కేంద్రానికి పంపించాలని జనసేన డిమాండ్ చేస్తోంది. అయితే..ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు స్పందించడం లేదు.
బాబు మనస్సులో ఏముందో...?
కాగా నిన్న కడపలో పార్టీ పోలిట్బ్యూరోసభ్యుడు శ్రీనివాసరెడ్డి లోకేష్ను డిప్యూటీ సిఎంను చేయాలని చంద్రబాబు ముందే కోరారు. అయితే..దీనిపై ముఖ్యమంత్రి స్పందించలేదు. అయితే..గత కొన్నాళ్లుగా చంద్రబాబు లోకేష్ను డిప్యూటీ సిఎంగా చేయాలనే వ్యూహంతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన వ్యూహంప్రకారమే టిడిపి సీనియర్ నేతలతో ఈ డిమాండ్ను చేయించారంటున్నారు. పవన్ వ్యవహారశైలి సరిగా లేదని కూటమి ప్రభుత్వంలోకీలకమైన స్థానంలో ఉండి ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆయన వ్యవహారశైలి వల్ల నష్టం జరుగుతోందని,ఆయన ప్రాధాన్యతను తగ్గించాలనే వ్యూహంలో భాగంగానే లోకేష్ను డిప్యూటీ సిఎంను చేయాలనే ఆలోచన చేశారంటున్నారు. దీనికి పవన్ అంగీకరించినా, అంగీకరించకపోయినా, ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్షాలు అంగీకరిస్తే చాలునని, చంద్రబాబు భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే..చంద్రబాబు పవన్ను నొప్పించరని, ఆయన అంగీకారం తీసుకునే..లోకేష్ను డిప్యూటీ సిఎంను చేయాలని ఆయన చూస్తారని, అప్పటి వరకూ ఈ చర్చను సాగదీస్తారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. మొత్తం మీద..సాఫీగా సాగుతోన్న కూటమిలో డిప్యూటీ సిఎం పదవి చిచ్చుకు కారణమవుతుందా..అనే అనుమానాలు కూటమి అభిమానుల్లో కలుగుతున్నాయి.