హాకీలో భారత్ కు కాంస్యం
భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృఫ్టించింది. 41 ఏళ్ల తరువాత ఒలంపిక్స్ లో హాకీలో పతకాన్ని సాధించింది. నేడు జర్మనీతో జరిగిన మ్యాచ్ లో భారత్ 5-4 తేడాతో ఆ జట్టును ఓడించి కాంస్యాన్ని ఒడిచిపట్టుకుంది. 1980లో భారత్ ఒలంపిక్ప్ లో కాంస్యాన్ని సాధించింది. ఆ తరువాత మళ్లీ పతకం సాధించడం ఇదే తొలిసారి. టోక్యో ఒలంపిక్ప్ లో భారత్ హాకీ జట్టు సెమీస్ లో బలమైన బెల్జియం జట్టు చేతిలో ఓడిపోయింది. మూడో స్థానం కోసం నేడు జరిగిన మ్యాచ్ లో భారత్ గట్టిపట్టుదలను ప్రదర్శించింది. మొదట్లో భారత్ 3-1తో వెనుకబడినా తరువాత పుంజుకుంది. బలమైన జర్మనీ జట్టుపై పదేపదే దాడులు చేసి సంచలన విజయం సాధించింది. ఒలంపిక్స్ లో భారత్ కు ఇది నాలుగవ కాంస్య పతకం. 1972లో జరిగిన మ్యూనిచ్ ఒలంపిక్ప్ లో భారత్ కాంస్యం సాధించింది. ఒలంపిక్స్ లో భారత్ 8 స్వర్ణాలు సాధించింది. మరే దేశం ఇలా హాకీలో ఇన్ని స్వర్ణాలు సాధించలేదు.
భారత్ హాకీ టీమ్ ఒలంపిక్స్ ను చాలా నిరాశాజనకంగా ప్రారంభించింది. తొలుత ఆష్ట్రేలియాపై 1-7 తేడాతో ఓడిపోయింది. అయితే ఆ పరాజయం నుంచి వెంటనే తేరుకుంది. మొత్తం 5 మ్యాచ్ ల్లో నాలుగు గెలిచి పూల్-ఎలో రెండోస్ధానాన్ని సాధించి క్వార్టర్ కు దూసుకెళ్లింది. క్వార్టర్స్ లో గ్రేట్ బ్రిటన్ ను 3-1 తేడాతో ఓడించి 49 సంవత్సరాల తరువాత సెమీస్ లోకి ప్రవేశించింది. అయితే బెల్జియం బ్రహ్మాండంగా ఆడి భారత్ ను ఓడించింది. దీంతో స్వర్ణం సాధించాలన్న భారత్ కల నెరవేరలేదు. అయితే మూడోస్ధానానికి జరిగిన మ్యాచ్ లో బలమైన జర్మనీని ఓడించి భారత్ కాంస్యాన్ని సాధించింది. హాకీ కాంస్యంతో భారత్ ఖాతాలోకి నాలుగో పతకం చేరింది.