నాలుగైదు నెలల్లో విశాఖకు రాజధాని:సజ్జల

రాజధాని తరలింపు నాలుగైదు నెలల్లో జరుగుతుందని, ఒక నెల అటో ఇటో తేడాతో పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి తరలుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై కోర్టులో కేసులు ఉన్నాయని, నాలుగైదు నెలల్లో కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ప్రకటించిన నోటిఫికేషన్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని, అందుకే హైకోర్టు తగిన తీర్పు ఇచ్చిందన్నారు. ఆలయాలపై దాడులు ఆగిన వెంటనే ఎన్నికల వ్యవహారం తెరపైకి రావడం పలు అనుమానాలకు కారణం అవుతుందన్నారు. ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకుడు జీవీ ప్రసాద్, ఎన్నికల కమీషనర్ కార్యదర్శి వాణీ మోహన్ను ఎసీ నిమ్మగడ్డ తొలగింపుపై 'సజ్జల' మాట్లాడుతూ ఎన్నికల కమీషనర్ వ్యవహారశైలి ఉద్యోగులను బెదిరించేలా ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఒక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని సజ్జల ఆరోపించారు.