తెలంగాణ ఉద్యోగి కోసం సీనియర్ మంత్రి ఆరాటం...!?
రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లు అవుతున్నా...ఇంకా కొంత మంది మంత్రులు తమ కార్యాలయాల్లో పనిచేయడానికి తెలంగాణ ఉద్యోగులే కావాలని మారాం చేస్తున్నారట. తెలంగాణలో పనిచేసే ఉద్యోగులపై సదరు మంత్రులకు ఎందుకు అంత ప్రేమ...? ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగుల వలే పనిచేయలేరని, వారిని వీరు కోరుకుంటున్నారా...? లేక వారి వల్ల ప్రత్యేకమైన లాభం ఏమైనా ఉంటుందా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నూతనంగా ఏర్పడిన ఎన్డిఏ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు కొందరు తెలంగాణ ఉద్యోగులు కావాలని వారిని డిప్యూటేషన్పై ఇక్కడకు పంపించమని తెలంగాణ సిఎస్కు లేఖలు రాపిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఓ సీనియర్ మంత్రి ప్రత్యేకంగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వై.ఎస్.రాజశేఖర్రెడి, కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో పనిచేసి..మొన్నటి ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరి మంత్రి అయిన సీనియర్ మంత్రి తెలంగాణలోని ఓ ఉద్యోగి కోసం ప్రత్యేకంగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆయన ప్రభుత్వ ప్రధానకార్యదర్శిపై ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ డిప్యూటేషన్ వ్యవహారం తెలంగాణ సిఎస్ వద్ద పెండింగ్లో ఉంది. సదరు మంత్రి ఒత్తిడి తెస్తోన్న ఉద్యోగి వ్యహారంపై ఆరా తీసినప్పుడు ఆసక్తికరమైన వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఈ ఉద్యోగి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్ద పనిచేశారని, ఆయన పనితీరు నచ్చక ఆయనను అక్కడి నుంచి పంపించివేశారు. అవినీతి వ్యవహారాల్లో ఆరితేరిన ఈయనగారు గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వద్ద పనిచేశారు. అయితే ఆయన వ్యవహారాలను చూసిన మల్లారెడ్డి అక్కడి నుంచి తరిమేశారు. ఇటువంటి గత చరిత్ర ఉన్న ఉద్యోగి కోసం సదరు సీనియర్ మంత్రి పట్టుబట్టడం ఏమిటో...? అయితే..సదరు సీనియర్ మంత్రికి ఈ వ్యవహారాలు తెలియవని, ఆయన వద్ద పైరవీలు చేసే ఓ సీనియర్ జర్నలిస్టు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో సదరు జర్నలిస్టు, ఈ ఉద్యోగి కీలకంగా వ్యవహరించారని, ఎన్నికల ప్రచారం జోరుగా చేయడంతో పాటు, ఇతర విషయాల్లో సహకరించారని, దాంతో..ఆయనను ఇప్పుడు మంత్రి పేషీలో చేర్పించాలని సదరు జర్నలిస్టు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయన మంత్రి పేషీలోఉంటే తనకు లాభమనే భావనతో తెలంగాణ ఉద్యోగిని ఇక్కడకు రప్పించడానికి తీవ్రంగా యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటేషన్పై వివిధ రాష్ట్రాల నుంచి ఐఏఎస్ అధికారులను తన పేషీకి రప్పించుకుంటున్నారు..కదా...? మనం తెలంగాణ నుంచి తీసుకుంటే తప్పేమిటని సదరు జర్నలిస్టు మంత్రికి సలహా ఇస్తున్నారట. దీంతో మంత్రి కూడా సదరు ఉద్యోగి డిప్యూటేషన్ కోసం లేఖ రాశారని తెలుస్తోంది. మొత్తం మీద..ఆంధ్రాలో ఉద్యోగులే లేనట్లు తెలంగాణ ఉద్యోగి కోసం ప్రాకులాడడం రాజకీయంగా, అధికారికంగా చర్చకు కారణమవుతోంది.