నామినేటెడ్ పదవుల పంపిణీకి బిజెపి అగ్రనేతల గ్రీన్సిగ్నల్...!?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి పార్టీ విజయం కోసం అహర్నిశలు పనిచేసిన టిడిపి,జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు నామినేటెడ్ పోస్టుల పంపకంపై ఆశలు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే..పదవుల పంపిణీ ఉంటుందని వారంతా ఆశించారు. అయితే..వారి ఆశలపై నీళ్లు జల్లుతూ కూటమి ప్రభుత్వం పదవుల పంపిణీని ఆలస్యం చేస్తూ వస్తోంది. దీనితో వీరంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అధికారపగ్గాలు చేపట్టి మూడు నెలలు అయినా..నామ మాత్రంగానైనా..పదవులను పంపిణీ చేయలేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన టిటిడి ఛైర్మన్ పదవినైనా భర్తీ చేస్తారనుకుంటే..అదీ చేయకుండా నానబెడుతున్నారు. ఈ పదవుల పంపకంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అటు టిడిపి నాయకులు, ఇటు జనసేన నాయకులు ఆయనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఈ పదవుల పంపకాన్ని సెప్టెంబర్లో ఇస్తామని బహిరంగానే చెప్పారు. మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, అది అయిన తరువాత చేస్తామని జూలైలో చెప్పారు. అయితే..ఇంతలోనే విజయవాడలో కనీవినీ ఎరుగని వరద రావడంతో...రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా వరదబాధితులను ఆదుకోవడంలోనిమగ్నమయ్యారు. ఈ మాసం ఆరంభం నుంచి నిన్నటి వరకూ వరద బాధితుల కోసం ప్రభుత్వ యంత్రాంగంతో పాటు, పార్టీ యంత్రాంగ పనిచేసింది. నిన్నటితో వరద ఒక తెరిపికి రావడంతో..ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి మృతి చెందడంతో ఆయనకు నివాళులు అర్పించిన తరువాత ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సందర్భంగా బిజెపి అగ్రనేతలతో..నామినేటెడ్ పదవులపై చర్చించి ఉంటారని టిడిపి నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా టిటిడి ఛైర్మన్ విషయంలో బిజెపి పెద్దలు జోక్యం చేసుకుంటున్నారని, వారు చెప్పిన వారికే ఈ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా..టిటిడి బోర్డులో వారి సూచించిన వారికి పదవులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీని వల్లే టిటిడి ఛైర్మన్ పోస్టు భర్తీ చేయడంలో ఆలస్యం అవుతుందంటున్నారు. అయితే..ఇప్పుడుముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తరువాత దానిపై ఒక క్లారిటీ వస్తుందని, దీనితో కొన్ని నామినేటెడ్ పదవులనైనా ఈ వారంలో ప్రకటిస్తారని పదవులు ఆశించేవారు భావిస్తున్నారు. తమ నేత నిదానంగా వ్యవహరిస్తున్నారని, అదే జగన్ అయితే..నిమిషాల్లో పదవులు భర్తీ చేశారని, ఈయనమాత్రం లెక్కలు వేసుకుంటూ కాలం గడుపుతున్నారని వారు ఆక్షేపిస్తున్నారు.