‘కెసిఆర్’ గుండెల్లో ‘బిజెపి’ బాంబు...!?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఆధిక్యత సాధించింది. ఈ రోజు వస్తోన్న ఫలితాల్లో దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ‘ఉత్తరప్రదేశ్’లో మరోసారి ‘బిజెపి’ ఘనవిజయం సాధించబోతోంది. వెలువడుతున్న ఫలితాల ప్రకారం ఆ పార్టీకి దాదాపు 250సీట్లను గెలుచుకునేలా ఉంది. అదే విధంగా ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ల్లోనూ బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. ఆయా రాష్ట్రాల్లోనూ బిజెపి తిరుగులేని విజయం సాధించింది. ఒక్క పంజాబ్లో మాత్రమే ఆ పార్టీ ప్రభావం చూపించలేకపోయింది. ఇక్కడ ఆప్ నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దేశ రాజకీయాల్లో కీలకమలుపు అని భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ‘బిజెపి’ ఘనవిజయం తెలుగురాష్ట్రాల రాజకీయాలను సమూలంగా మార్చబోతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే బలంగా ఉన్న ‘బిజెపి’ అక్కడ అధికార ‘టిఆర్ఎస్’కు ప్రధాన ప్రత్యర్థి కాబోతోంది. నిన్న మొన్నటిదాకా..‘బిజెపి’ ఎంత ప్రయత్నించినా..ప్రధాన ప్రతిపక్షస్థాయికి చేరుకోలేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా..అది ‘టిఆర్ఎస్’, కాంగ్రెస్ల మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల పోరు ‘బిజెపి, టిఆర్ఎస్’ల మధ్యే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా ‘కాంగ్రెస్’ మరింత క్షీణించిన పరిస్థితుల్లో తెలంగాణలో ‘కాంగ్రెస్’ పుంజుకోవడం అంత సులువు కాదు. ఆ పార్టీ నాయకుల్లో ఉన్న విభేదాలు, అసంతృప్తి, ఇతర విషయాలు ఆ పార్టీని మరింత బలహీనపర్చబోతున్నాయి. దీంతో నిన్నటిదాకా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ‘కాంగ్రెస్’ క్రమేపీ మూడో స్థానానికి వెళ్లబోతోంది. ‘కాంగ్రెస్’ స్థానాన్ని ‘బిజెపి’ ఆక్రమించబోతోంది.
‘కాంగ్రెస్’ బలహీనపడడం అధికార ‘టిఆర్ఎస్’కు నష్టం చేకూరేలా ఉంది. కాంగ్రెస్తో అయితే ‘కెసిఆర్’ తన జిమ్మిక్కులను ప్రయోగించి పార్టీని ఒడ్డున పడేసేవారు. అయితే ఇప్పుడు ప్రత్యర్థి మారిపోవడం, అదీ దేశంలోనే అత్యంత శక్తివంతమైన పార్టీని ఢీకొట్టాల్సిన పరిస్థితిని కెసిఆర్ సృష్టించుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు దేశంలో ‘బిజెపి’ని ఓడిరచాలంటే ఒక కూటమి కావాలని ఆయన దేశ వ్యాప్తంగా పర్యటనలు చేశారు. బిజెపియేతర పార్టీలను ఒకతాడిపైకి తీసుకువచ్చేందుకు ఆయన యత్నించారు. ‘బిజెపి’పై, ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ‘బిజెపి’ పెద్దలు ఇక ‘కెసిఆర్’పై దృష్టిపెడతారు. దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతోన్న హైదరాబాద్ నగరాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి, దక్షిణాదిలో పట్టుసాధించడానికి తెలంగాణలో గెలుపు ‘బిజెపి’కి అత్యంత అవసరం. అందుకే ఇకపై ఎటువంటి శభిషలు లేకుండా ‘కెసిఆర్’ పని పట్టడంలో కమలనాథులు ఉంటారనడంలో సందేహం లేదు. నిన్నమొన్నటి దాకా ‘బిజెపి’తో లోపాయికారిగా స్నేహం చేసి, హఠాత్తుగా వారిపై విరుచుకుపడ్డ ‘కెసిఆర్’కు ఐదు రాష్ట్రాల్లో ‘బిజెపి’ గెలుపు ఆయన గుండెల్లో బాంబు పడినట్లేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దగ్గర నుంచి కుటుంబపాలన చేస్తోన్న కెసిఆర్కు ఇప్పుడు బిజెపి రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురుకావడంతో ఆయనను వ్యతిరేకించేవారంతా పొలోమంటూ ‘బిజెపి’బాట పడతారు. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, అసంతృప్తితో ఉన్న వారిని ఏదో విధంగా సంతృప్తి పరిచేందుకు కెసిఆర్ ప్రయత్నించినా..ఈసారి మాత్రం ఆయన ఆటలు సాగేపరిస్థితి మాత్రం కనిపించడం లేదు.