‘చంద్రబాబు’పై హైకోర్టులోనూ కేసులు వేసిన ‘స్వర్ణాంధ్ర తిలక్’..!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెయిల్ను రద్దు చేయాలంటూ స్వర్ణాంధ్ర జర్నలిస్టు ‘తిలక్’ సుప్రీంకోర్టులో వేసిన పిల్పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు ఈ కేసుతో సంబంధం ఏమిటని..ఎందుకు ఇటువంటి కేసులు వేస్తున్నారంటూ..ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన పిటీషన్ను డిస్మిస్ చేసింది. పిల్ దాఖలు చేయడానికి మీకు ఉన్న అర్హత ఏమిటి..? మీరెవరూ అంటూ తీవ్రంగా స్పందించింది. అంతే కాకుండా ఇలా మరోసారి సంబంధం లేని కేసులను కోర్టులో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. కాగా ‘స్వర్ణాంధ్ర తిలక్’ ఇదే కాదు..మరి కొన్ని కేసులను కూడా టిడిపి నాయకులపై వేశారు. ‘చంద్రబాబునాయుడు’ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనపై ఉన్న కేసులన్నింటిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్పై విచారణ సాగుతోంది. 2024 ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించిన తరువాత ఆయన ఈ కేసును దాఖలు చేశారు. ‘చంద్రబాబు’పై ‘జగన్’ ప్రభుత్వం ‘స్కిల్ డెవలప్మెంట్, మద్యం, ఎపీ ఫైబర్నెట్, అమరావతి ల్యాండ్స్, ఇసుక, ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ మార్పులో అవినీతి, అక్రమాలు జరిగాయని కేసులు పెట్టింది. వీటిలో ‘స్కిల్డెవలప్మెంట్’కేసులో ‘చంద్రబాబు’ను జైలుకు కూడా పంపింది. అయితే..ఇప్పుడు అధికారం మారడంతో..ఇక్కడ విచారణ సరిగా జరగదని, వీటిపై సీబీఐ మరియు ఈడీలతో విచారణ జరిపించాలని ‘తిలక్’ హైకోర్టులో పిల్ వేశారు. దీనిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, కె.అచ్చంనాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యాపారవేత్త లింగమనేని రమేష్, వేమూరి హరికృష్ణ ప్రసాద్ వంటి వారితో మొత్తం 114మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ వద్ద విచారణ జరుగుతోంది.