లేటెస్ట్

లోక్‌స‌భ‌ స్థానాల పునర్విభజనపై ‘జగన్‌’ మాజీ ఓఎస్‌డి లెక్క ఇది...!?

లోక్‌సభ స్థానాల పెంపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో దీనిపై తీవ్ర దుమారం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికపై నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళనకు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ‘తమిళనాడు’ ముఖ్యమంత్రి ‘స్టాలిన్‌’ దీనిపై ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించారు. జనాభా ఆధారంగా నిర్ణయం తీసుకుంటే..దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, దీన్ని సహించమని ఆయన చెబుతున్నారు. జనాభా నియంత్రణను గట్టిగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు దీని వల్ల నష్టపోతాయని, దీన్ని సహించేది లేదని ఆయన కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. అయితే దీనిపై తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఎంపి స్థానాల పెంపుపై రాజకీయ లబ్ది కోసమే ‘స్టాలిన్‌’ నాటకాలు ఆడుతున్నారని ‘బిజెపి’ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే..‘బిజెపి’ నేతలు ఏమి చెప్పినా...జనాభా ప్రాతిపదికన ఎంపి స్థానాలను పునర్విభజన చేస్తే ‘దక్షిణాదికి’ తీవ్ర అన్యాయం జరుగుతుందనడంలో రెండో మాటకు తావు లేదు. కాగా..ఈ అంశంపై ‘ఆంధ్రప్రదేశ్‌’ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మాజీ ఓఎస్‌డి ఓ ఆంగ్ల పత్రికలో ‘డెకాడల్‌ గ్రోత్‌ యావరేజ్‌’తో అందరికీ సమన్యాయం జరుగుతుందని చెబుతూ ఓ వ్యాసాన్ని రాశారు. కేంద్రప్రభుత్వం జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతుందని, దీని వల్ల లోక్‌సభ స్థానాలు 1374 అవుతాయని, ఇది సరికాదని ఆయన అంటున్నారు. అలా కాకుండా గత 50 ఏళ్ల సగటు జనాభా వృద్ధితో లెక్కలు వేస్తే..లోక్‌సభ 656 అవుతాయని, ఇది సరైన న్యాయమని ఆయన చెబుతున్నారు. ఈ సూత్రం ఆధారంగా పునర్విభజన చేస్తే..ప్రస్తుతం 80 స్థానాలు ఉన్న ‘ఉత్తరప్రదేశ్‌’లో 97కి చేరుతాయని, మహారాష్ట్రలో 48 నుంచి 58కి, పశ్చిమబెంగాల్‌లో 42 నుండి 51, బీహార్‌లో 40 నుంచి 48కి, తమిళనాడు 39 నుంచి 47కి, మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 35కి, కర్ణాటకలో 28 నుంచి 34కి, గుజరాత్‌లో 26 నుంచి 31కి, రాజస్థాన్‌లో 25 నుంచి 30కి, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 30కి చేరతాయని ఆయన చెబుతున్నారు. తెలంగాణలో 17 నుంచి 21కి చేరతాయి. ఈ సూత్రం ఆధారంగా పునర్విభజన చేస్తే తెలుగు రాష్ట్రాల్లో 9 లోక్‌సభ సీట్లు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు, తెలంగాణ నాలుగు నూతన లోక్‌సభ సీట్లు వస్తాయి. ఇలా కాకుండా జనాభా ప్రాతిపదికనే కేంద్రం పునర్విభజన చేపడితే..ఆంధ్రాలో 25 నుంచి 21కి, తెలంగాణలో 17 నుంచి 15కి వస్తాయంటున్నారు. మొత్తం మీద..లోక్‌సభ స్థానాల పునర్విభజన ఏ సూత్రం ఆధారంగా చేపడతారో స్పష్టమైతే..అప్పుడు అసలైన లెక్కలు బయటకు వస్తాయి. అప్పటి వరకు దీనిపై చర్చ సాగుతూనే ఉంటుంది.  

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ