లేటెస్ట్

‘అమ్మో’...! ‘అమరావతి’ బస్సా...!?

2017-18 ప్రాంతంలో ‘విజయవాడ’ బస్సు స్టాండ్‌లో ఠీవీగా నిలబడిన ‘అమరావతి’ బస్సులు చూసి ప్రయాణికులు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ బస్సుల ఠీవీ, హంగామా చూసి..ఇవి బస్సులా..లేక ప్లైట్‌లా..అని అనుకునేవారు. దగ్గర నుంచి చూడడమే కాదు..దానిలోపలికి వెళితే..దానిలో ఉన్న సౌకర్యాలు ప్రయాణీకులను అబ్బురపరిచాయి. ‘విజయవాడ’ నుంచి ‘హైదరాబాద్‌’కు, బెంగుళూరు, చైన్నె, విశాఖపట్నం..ఇలా.. ముఖ్యమైన స్థానాలకు ఇవి అప్పట్లో నడిచేవి. వాటిలో ప్రయాణించడానికి అప్పట్లో ప్రయాణీకులు ఆసక్తి చూపించేవారు. కొందరు గొప్పల కోసం ‘అమరావతి’ బస్సు ఎక్కేమని చెప్పుకునే వాళ్లు. ‘అమరావతి’ బస్సు అప్పట్లో చేసిన హంగామా..అంతా ఇంతా కాదు.శుభ్రంగా, ఎటువంటి కుదుపులు లేకుండా ప్రయాణం హాయిగా ఉండేది. కేవ‌లం నాలుగున్న‌ర గంట‌ల్లో విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లేవారు. ఇది అప్ప‌ట్లో సంచ‌ల‌నం..సౌక‌ర్య‌వంతం..సొమ్ములు పోయినా హాయిగా ఉంద‌ని ప్ర‌యాణీకులు భావించేవారు. కార్లు, విమానాల్లో వెళ్లేవాళ్లు కూడా.. అమ‌రావ‌తిలో హాయిగా ఉంద‌ని..దీనిలోనే ప్ర‌యాణించేవాళ్లు. అయితే..జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి అమ‌రావ‌తి బ‌స్సుల హీన‌స్థితి మొద‌లైంది. ఆయ‌న అధికారంలో ఉన్న ఐదేళ్లూ వీటి గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. బ‌స్సుల‌కు మ‌ర‌మ్మ‌త్తులు వ‌చ్చినా.. చేయించ‌క‌పోవ‌డం, మెయిటెన్స్ లేక‌పోవ‌డంతో..అవి నానాటికి తమ వైభ‌వాన్ని కోల్పోయి సాధార‌ణ బ‌స్సుల స్థాయికి చేరాయి. దీంతో ఎక్క‌డ బ‌డితే అక్క‌డ ఆగిపోవ‌డం..మంట‌లు, పొగ‌రావ‌డం వంటి సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లుగా జ‌రిగిపోయాయి. అప్ప‌ట్లో అడిగేవాడు లేక‌పోవ‌డంతో.. అలానే న‌డిచిపోయింది. అయితే..కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 10 నెల‌లు దాటినా.   వీటి ప‌రిస్థితి ఏమీ మార‌లేదు.  ప్రయాణం మధ్యలో ఆగిపోవడం, ఇంజిన్‌లో మంటలు రావడం సర్వసాధారణమైంది. పదే పదే సమస్యలు వస్తుండడంతో...డ్రైవర్లు, ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. తాజాగా ‘విజయవాడ’ నుంచి ‘విశాఖపట్నం’ వెళుతోన్న ‘అమరావతి’ బస్సులో మంటలు రావడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. మంటలు, పొగ రావడంతో..బస్సులోని ప్రయాణికులంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కిందకు దిగేశారు. దీంతో ప్రయాణీకులను ఇతర బస్సుల్లో ‘వైజాగ్‌’ పంపేశారు. ఇలా పలుసార్లు ‘అమరావతి’ బస్సులు మొరాయిస్తున్నాయి. దీనిపై ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదు. సమస్య వచ్చినప్పుడు తాత్కాలిక మరమ్మత్తులు చేసేసి..మళ్లీ వాటినే తిప్పేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనైనా ‘అమరావతి బస్సుల’ తీరు మారుతుందని ఆశించినా..పెద్దగా మార్పేమీ రావడం లేదు.ఒకప్పుడు ‘ఆంధ్రా’ బ్రాండ్‌గా ఉన్న ‘అమరావతి’ బస్సులు నేడు ఆదరణ కోల్పోయే పరిస్థితి ఉంది. ఇది మా బ్రాండ్‌ అని చెప్పుకున్న ఈ బస్సులపై ప్రభుత్వ పెద్దలు స్పందించాలి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ