లేటెస్ట్

మూగజీవాలతో రాజకీయక్రీడలు...!?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ మూగజీవాల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణలో మొదలైన ఈ వికృత క్రీడ, ఆంధ్రప్రదేశ్‌లోనూ మొదలైంది. తొలుత తెలంగాణలో ‘కంచ గచ్చిబౌలి’ భూముల విషయంలో పెద్ద రచ్చ జరిగింది. ‘కంచ గచ్చిబౌలి’ భూములు ప్రభుత్వానివని, వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ వర్గాలు ప్రయత్నం చేశాయి. దీన్ని అక్కడి ప్రతిపక్షం రాజకీయంగా వాడుకుంది. ఆ భూముల్లో వణ్యప్రాణులు ఉన్నాయని, వాటిని నిర్ధాక్ష్యణ్యంగా చంపేశారని, వందల కొద్ది జింకలు, నెమళ్లు, ఇతర జంతువులు చనిపోయాయని, ప్రాణభయంతో అవి ఆర్తనాదాలు చేస్తున్నాయని ఐఏని ఉపయోగించి అక్కడి ప్రతిపక్షం కృత్రిమంగా కొన్ని వీడియోలు రూపొందించి సోషల్‌ మీడియాలో ప్రసారం చేసింది. ఆ వీడియోలకు ప్రజలతో పాటు సుప్రీంకోర్టు కూడా స్పందించింది. వేలాది మూగజీవాలు చనిపోతున్నాయని, అక్కడ వెంటనే ప్రభుత్వ చర్యలను ఆపివేయాలని ఘాటుగా ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడ నుంచి ప్రభుత్వ వర్గాలు బయటకు రాకపోతే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపుతామని కూడా హెచ్చరించింది. దీంతో అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిరది. వాస్తవానికి అక్కడ పెద్దగా వన్యప్రాణులేమీ లేవు. అయితే..కృత్రిమంగా సృష్టించిన వీడియోలను సకాలంగా ఎదుర్కోలేక ‘రేవంత్‌రెడ్డి’ ప్రభుత్వం ఆభాసుపాలైంది. జరగాల్సిన నష్టం జరిగిన తరువాత ‘రేవంత్‌రెడ్డి’ అధికారులు ఆ వీడియోలు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే..ఈలోగా జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది.


తెలంగాణలో జరిగినట్లే..ఇప్పుడు ‘ఆంధ్రప్రదేశ్‌’లోనూ మూగజీవాలను అడ్డుపెట్టుకుని రాజకీయ రచ్చ చేయడానికి ‘వైకాపా’ యత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తలు సృష్టిస్తోంది. ‘టిటిడి’ ఆధ్వర్యంలో ఉన్న గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని, దీనికి ‘టీటీడీ’ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని వైకాపా మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్‌ ‘కరుణాకర్‌రెడ్డి’ ఆరోపించారు. ఈ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. గతంలో ఎప్పుడో మృతి చెందిన ఆవుల చిత్రాలను తీసి..ఇప్పుడు జరిగినట్లు ఆయన ప్రచారం చేయడంపై ‘టీటీడీ’ వర్గాలతో పాటు, టిడిపి నాయకులు మండిపడ్డారు. ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఆరోపణల్లో నిజం లేదని, కావాలనే ఆయన మతాల పేరిట రచ్చ చేస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ పరిస్థితుల్లో ఇరువర్గాలు సవాళ్లు చేసుకున్నాయి. తనను గోశాలకు రానిస్తే..ఎన్ని గోవులు చనిపోయాయో..తేలుస్తానని ‘కరుణాకర్‌రెడ్డి’ సవాల్‌ చేయగా.. ఆయనకు దమ్ముంటే రావాలని ‘టిడిపి’ నేతలు సవాల్‌ చేశారు. దీంతో..‘కరుణాకర్‌రెడ్డి’ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ‘రోజా’ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. ‘ఆడంగి వెధవలు’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఆమె ఘోరంగా ఓడిపోయినా..ఆమె నోటి దురుసు తగ్గడం లేదని, ఆమెపై కేసు పెట్టాలని పలు వర్గాలు డిమాండ్‌ చేశాయి. ఈ మొత్తం వ్యవహారంలో ‘వైకాపా’, ‘బిఆర్‌ఎస్‌’లు మూగ జీవాలను అడ్డుపెట్టుకుని మృత్యు క్రీడను ఆడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యూహంతో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను అభాసు పాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ‘ఆంధ్రప్రదేశ్‌’లో కులాలు, మతాలను రెచ్చగొట్టే చర్యలు భారీగానే జరుగుతున్నాయి. ఒకవైపు పాస్టర్‌ రోడ్డు ప్రమాద మృతిని హత్య అంటూ వైకాపాకు చెందిన వారు ప్రచారం చేస్తూ క్రైస్తవ మతస్థులను రెచ్చగొడుతుండగా..గోవుల మృతిని రాజకీయం చేస్తూ హిందూమతస్తులను ‘కరుణాకర్‌రెడ్డి’ తదితరులు రెచ్చగొడుతున్నారు. మొత్తం మీద..వైకాపా చేస్తోన్న కుల,మత రాజకీయాలను ‘టిడిపి’ తిప్పికొట్టలేకపోతోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ