రేపు ‘మెగా డిఎస్సీ’ విడుదల
మెగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తోన్న వారికి శుభవార్త. రేపు అంటే (ఏప్రిల్ 20న) మెగా డిఎస్సీని విడుదల చేయనున్న పాఠశాల విద్య డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యా సంస్కరణల్లో భాగంగా, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ధృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు మెగా డిఎస్సీని రేపు విడుదల చేయాలని నిర్ణయించిందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 20వ తేదీన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు సీ.బి.టి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. మెగా డిఎస్సీ 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు, ఉపాధ్యాయపోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్, హెల్స్ డెస్క్ వివరాలు 20.04.2025 ఉదయం 10 గంటల నుండి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఆ ప్రకనటలో పేర్కొన్నారు.
మెగా డిఎస్సీ షెడ్యూల్
నోటిఫికేషన్ జారీ & సమాచార బులెటిన్ విడుదల : 20.04.2025
ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు & అప్లికేషన్ గడువు : 20.04.2025 నుంచి 15.05.2025
మాక్ టెస్ట్ (నమూనా పరీక్ష) : 20.05.2025
హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ : 30.05.2025
పరీక్ష తేదీలు : 06.06.2025 నుండి 06.07.2025
ప్రాధమిక కీ విడుదల : అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు
అభ్యంతరాల స్వీకరణ : ప్రాథమిక కీ విడుదల తదుపరి 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు
తుది కీ విడుదల : అభ్యంతరాలు స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తరువాత తుది కీ విడుదల చేస్తారు
మెరిట్ జాబితా విడుదల: తుది కీ విడుదల చేసిన 7రోజుల తరువాత మెరిట్ జాబితా ప్రకటిస్తారు.
కూటమి ప్రభుత్వ మొదటి హామీని నెరవేర్చడం లేదని ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న వారు చాలా రోజుల నుంచి ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ హామీ వల్ల ఈ నోటిఫికేషన్ ఆలస్యమైంది. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడంతో ఆ సమస్య పరిష్కారం కావడంతో ఎటువంటి ఆలస్యం లేకుండా నోటిఫికేషన్ను విడుదల చేస్తున్నారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ‘చంద్రబాబు నాయుడు’ పుట్టినరోజు కావడం..అదే రోజు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుండడం టిడిపి వర్గాల్లో ఆనందాన్ని నింపుతోంది. తమ నేత ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ వస్తున్నారని, రాబోయే నాలుగేళ్లల్లో అన్ని హామీలను అమలు చేస్తామని, వెనుకా ముందు అయినా..అన్నింటిని అములు చేసి ప్రజల మనస్సులను చూరగొంటామని వారు చెబుతున్నారు.