లేటెస్ట్

ఇటువైపు ఒక్క‌రే..అటువైపు ఎంద‌రో...!?

75ఏళ్ల వసంతాలను పూర్తి చేసుకుని 76లోకి అడుగుపెడుతోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ రాజకీయ చరిత్ర ఆసక్తికరమైందే. ఒక సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి..నిరంతరాయంగా ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగడం అంత ఆషామాషీ విషయం కాదు. ఆయనతోపాటు రాజకీయాలను ప్రారంభించిన వారందరూ దాదాపు రాజకీయంగా రిటైర్‌ అయ్యారు. కొందరు బలవంతంగా రాజకీయాల నుంచి నిష్క్రమణకు గురయ్యారు. అలా గురైనవారిలో మాజీ ఉపరాష్ట్రపతి ‘ఎం.వెంకయ్యనాయుడు’ ఒకరు. రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్నా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకున్నా...‘మోడీ’ కుటిల రాజకీయాల వల్ల ఆయన రాజకీయంగా తెరమరుగయ్యారు. మ‌రి కొంద‌రు కాల‌ధ‌ర్మం చెందారు.  ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాలో ‘చంద్రబాబు’కు సమకాలికులు ఎవరూ రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. ఇలా ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగిన ‘చంద్రబాబు’కు ఎంతో మంది మిత్రులు, ఆప్తులు, శిష్యులు ఉన్నా చాలా మంది ప్ర‌త్య‌ర్ధులూ ఉన్నారు.  రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉండ‌గా మ‌రి కొంద‌రు మాత్రం శత్రువుల‌య్యారు. అయితే..ఆయనను ఎవరు శత్రువుగా భావించినా..‘చంద్రబాబు’ మాత్రం వారిని రాజకీయ ప్రత్యర్థిగానే చూశారు. అలా ఆయన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ప్రత్యర్థులుగా మారిన ప్ర‌ముఖులెవ‌రో చూద్దాం. 

‘నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి’

‘చిత్తూరు’ జిల్లా నుంచి రాజకీయాలను ప్రారంభించిన ‘చంద్రబాబు’కు తొలి ప్రత్యర్థి ‘నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి’. కాంగ్రెస్‌లో ‘చంద్రబాబు’ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌గా ‘కుతూహలమ్మ’ను ‘చంద్రబాబు’ ఇండిపెండెంట్‌గా గెలిపించుకున్నారు. అప్పట్లో ‘నల్లారి అమర్‌నాధ్‌రెడ్డి’ అప్పటి ప్రధాని ‘ఇందిరాగాంధీ’కి సన్నిహితుడంటారు. అటువంటి పరిస్థితుల్లో ‘చంద్రబాబు’ చేసిన పనిపై ఆగ్రహించిన ఆయన ‘చంద్రబాబు’ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించారు. అయితే..ఆ సస్పెండ్‌ను ఒకేరోజులో ‘చంద్రబాబు’ ఎత్తేయించుకున్నారు. ‘చంద్రబాబు’ రాజకీయానికి ‘అమర్‌నాధ్‌రెడ్డి’ తట్టుకోలేకపోయారంటారు. తరువాత.. ‘అమర్‌నాధ్‌రెడ్డి’ చనిపోయారు. తన తండ్రి మరణానికి ‘చంద్రబాబే’ కారణమని ఆయన తనయుడు ‘ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయిన‌ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి’ ‘చంద్రబాబు’తో వైరాన్ని పెంచుకున్నారు. ‘చంద్రబాబు’పై పదే పదే యుద్ధానికి కాలు దువ్వేవారు. అయితే..ఆయనను చాలా సులువుగానే ‘చంద్రబాబు’ లొంగదీసుకున్నారు. చివరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత కాంగ్రెస్‌ బలహీనపడడం, సమైక్యాంధ్ర కోసం చివరి బాల్‌ ఉందంటూ.. ఊరించి..ఊరించి ఉసూరమనిపించిన ‘కిరణ్‌కుమార్‌రెడ్డి’ రాజకీయంగా బలహీనపడిపోయారు. తరువాత ఆయన తమ్ముడు ‘టిడిపి’లో చేరి ఎమ్మెల్యే కాగా..‘కిరణ్‌’ మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఉన్న వైరాన్ని మరిచి ‘చంద్రబాబు’ ‘కిరణ్‌’లు ఎన్నికల్లో పనిచేశారు. దీంతో..వీరి మధ్య ఉన్న వైరం మాసిపోయినట్లైంది.

‘కోట్ల,మర్రి,నాదెండ్ల‌, నేదురుమల్లి...!

‘ఎన్టీఆర్‌’ ‘టిడిపి’ని స్థాపించిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ‘చంద్రబాబు’ తరువాత తన మామ పార్టీలో చేరారు. అప్పట్లో ‘ఎన్టీఆర్‌’కు కాంగ్రెస్‌ సహాయంతో ‘నాదెండ్ల భాస్కర్‌రావు’ వెన్నుపోటు పొడవడం..దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని మళ్లీ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడంలో ‘చంద్రబాబు’ కాంగ్రెస్‌ నాయకులు ‘కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి’ వంటి మహామహులను ఎదుర్కొన్నారు. 1989 ఎన్నికల్లో ‘టిడిపి’ ఓడిపోయిన తరువాత ప్రతిపక్షనేతగా ఉన్న ‘ఎన్టీఆర్‌’ అసెంబ్లీకి రాకపోతే ‘చంద్రబాబే’ పార్టీని నడిపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్లు అయిన ‘కోట్ల’, జనార్థన్‌రెడ్డి, రోశయ్య, నేదురుమల్లి’ వంటి వారితో తలపడ్డారు. 

దగ్గుబాటి, లక్ష్మీపార్వతిలు...!

1994లో టిడిపి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పరిణామాలతో ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ‘చంద్రబాబు’ తీరు నచ్చక అప్పటిదాకా ఆయన వెంట ఉన్న ‘దగ్గుబాటి’ ‘లక్ష్మీపార్వతి’తో చేతులు కలిపి ‘చంద్రబాబు’పై యుద్ధం ప్రకటించారు. అయితే..వీరిద్దరూ ‘చంద్రబాబు’ రాజకీయాలను నిలువరించలేకపోయారు. ‘దగ్గుబాటి’, ‘లక్ష్మీపార్వతి’ ఎన్ని విమర్శలు చేసినా..‘చంద్రబాబు’ స్పందించేవారు కాదు. దీంతో వాళ్లే అరిచి..అరిచి మెత్తబడేవారు.

పిజెఆర్‌...!

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కకని 1994 ఎన్నికల్లో ఆ పార్టీ నేతగా అచ్చు తెలంగాణ బిడ్డ ‘పి.జనార్థన్‌రెడ్డి’ పార్టీ నాయకుడిగా ఉండేవారు. అప్పట్లో ‘పిజెఆర్‌’ ‘చంద్రబాబు’ను ముప్పుతిప్పలు పెట్టేవారు. 26 మంది ఎమ్మెల్యేలతో ‘పిజెఆర్‌’ అసెంబ్లీలో ‘చంద్రబాబు’ను అడుగడుగునా.. అడ్డుపడేవారు. దీంతో 1999లో జరిగిన ఎన్నికల్లో ‘పిజెఆర్‌’ను గెలనీయకూడదని ‘చంద్రబాబు’ పట్టుపట్టి..అప్పట్లో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన ‘విజయరామారావు’ను ‘పిజెఆర్‌’కు ప్రత్యర్థిగా నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో ‘విజయరామారావు’ గెలుపొందారు. దీంతో..తనకు చికాకులు సృష్టించిన ‘పిజెఆర్‌’ను ఓడించి ‘చంద్రబాబు’ ప్రతీకారం తీర్చుకున్నారనే సందేశం జనాల్లోకి వెళ్లింది.

‘వైఎస్సార్‌, మైసూరారెడ్డి, ‘డి.శ్రీనివాస్‌’...!

1999 ఎన్నికల్లో ‘టిడిపి’ మరోసారి గెలుపొందడంతో..అప్పట్లో 91 మంది ఎమ్మెల్యేలతో ‘వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి’ బలమైన ప్రతిపక్షనేతగా అవతరించారు. అప్పట్లో ఈ ఇద్దరు హోరాహోరిగా తలపడ్డారు. ఒకవైపు ‘వైఎస్‌’ ప్రశ్నలతో నిలదీస్తుంటే.. మరోవైపు ‘మైసూరారెడ్డి’ ‘కౌల్‌ అండ్‌ షక్దర్‌’ అంటూ, ‘సురేష్‌రెడ్డి’ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అంటూ..‘చంద్రబాబు’ను ఇబ్బందులు పెట్టేవారు. దానికి తోడు..అప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న ‘డి.శ్రీనివాస్‌’ తనవంతు పాత్ర పోషించారు. వీరందరూ తన ప్రత్యర్థులైనా..వారితో చట్టబద్దంగానే ‘చంద్రబాబు’ ప్రవర్తించారు. 

వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి

2004 ఎన్నికల్లో ‘టిడిపి’ ఘోరంగా ఓడిపోయిన తరువాత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ‘వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి’ వ్యవహరించారు. అప్పట్లో ‘వై.ఎస్‌’ ‘చంద్రబాబు’ మాతృమూర్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ‘చంద్రబాబు’ను కుంగిపోయేలా చేశాయి. అయితే..‘వై.ఎస్‌’ అన్నమాటలపై అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో..ఆయన తరువాత వాటిని ఉపసంహరించుకున్నారు. ఐదేళ్ల ‘రాజశేఖర్‌రెడ్డి’ పాలన ‘చంద్రబాబు’కు తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. అప్పటి వరకూ తనకు ప్రత్యర్థులుగా వ్యవహరించిన వారు...కేవలం రాజకీయాలకే పరిమితం కాగా..తొలిసారి ‘రాజశేఖర్‌రెడ్డి’ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగేశారు. 

‘కెసిఆర్‌’...!

తన వద్ద పనిచేసి..తాను మంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో ‘తెలంగాణ’ ఉద్యమాన్ని నిర్మించి..దాంతో ముఖ్యమంత్రి అయిన ‘కె.చంద్రశేఖర్‌రావు’ తీరు ‘చంద్రబాబు’ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ‘తెలంగాణ’ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని అసభ్యంగా ‘కెసిఆర్‌’ పలుసార్లు దూషించినా..చివరకు ఆయనతోనే మళ్లీ పొత్తు కుదుర్చుకున్నారు. ఈ పొత్తు..విఫలం కావడం..తరువాత..‘కెసిఆర్‌’ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడంతో ఆయన మితిమీరిన అహంతో..‘చంద్రబాబు’ను పదే పదే దూషించారు. అయితే..‘చంద్రబాబు’ మాత్రం ఆయనను ప్రత్యర్థిగానే చూశారు..తప్ప ఎప్పుడూ..పరిధి దాటలేదు. ‘కెసిఆర్‌’ ఒక్కరే కాదు..ఆయన తనయుడు ‘కెటిఆర్‌’ ఆయన అల్లుడు ‘హరీష్‌రావు’, ఆయన కుమార్తె ‘కవిత’లు కూడా చులకనగా, వ్యంగ్యంగా ‘చంద్రబాబు’ను ఎద్దేవా చేసినా..ఆయన మాత్రం తన శైలిలోనే వెళ్లారు.

‘జగన్మోహన్‌రెడ్డి’

‘చంద్రబాబు’ సుధీర్ఘ రాజకీయ జీవితంలో..ఆయనను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది...చివరకు జైలు పాలు చేసింది ‘జగన్మోహన్‌రెడ్డే’. ‘చంద్రబాబు’ను ఆగర్భ శత్రువులా భావించి ‘జగన్‌’ ‘చంద్రబాబు’ను దెబ్బతీయడానికి పదే పదే యత్నించారు. ఈ ప్రయత్నాల్లో ఆయన ఒకసారి సక్సెస్‌ అయ్యారు. అయితే..ఆయన చేసిన కుటిల చేష్టల వల్ల ‘చంద్రబాబు’కు మేలే చేసింది. 2014 ఎన్నికల్లో గెలుపు ముంగిట ఉన్న ‘జగన్‌’ ‘చంద్రబాబు’ను తక్కువ అంచనా వేసి..దెబ్బతిన్నారు. అయితే 2019 ఎన్నికల్లో అన్నివైపుల నుంచి ‘చంద్రబాబు’ను ‘జగన్‌’ ముఠా చుట్టేసింది. ఇలా చుట్టేయడానికి ‘చంద్రబాబు’ చేసిన తెలివి తక్కువ పనులే కారణం. అప్పట్లో ‘జగన్‌’ చేస్తోన్న అవాస్త ప్రచారాన్ని ఖండిరచకుండా..వాటిని ప్రజలు నమ్మరన్న ఉద్దేశ్యంతో..చూసీ చూడనట్లు..అతనో పిల్లనిబ్బి అన్నట్లు వ్యవహరించడం..మరోవైపు..తమతో విరోధం పెట్టుకుంటాడా.. అని మోడీ, షాలు చేసిన కుటిల చేష్టలతో చరిత్రలో చూడని పరాభవాన్ని ‘చంద్రబాబు’ చవిచూశారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఆయన పెద్దగా బాధపడలేదు కానీ..తరువాత ‘జగన్‌’ బృందం చేసిన చేష్టలతో..ఆయన కుమిలిపోయారు. అయితే..‘జగన్‌’ ముఠా చేస్తోన్న చర్యలను ఓ కంటకనిపెడుతూ..వారిని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టేశారు ‘చంద్రబాబు’. తన రాజకీయం ఎలా ఉంటుందో..‘జగన్‌’ అరాచకముఠాకు చూపించారు...అదోదే..‘ప్రభాస్‌’ సినిమాలో ‘కోట శ్రీనివాసరావు’ ఒక డైలాగ్‌ చెబుతాడు..‘రౌడీయిజం... రాజకీయం ఒకటి కాదురా...? అంటూ..‘జగన్‌’ అరాచక బృందానికి  ప్రతిపక్షహోదా కూడా దక్కని విధంగా పావులు కదిపారు. ఇప్పుడా రౌడీ బృందం...మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి..అంటూ..వీధి..వీధి తిరిగి ప్రాధేయపడుతున్నారంటే..దానికి ‘చంద్రబాబు’ వ్యూహ చతురతే కారణం. తన కెరీర్‌లో ఎందరో ప్రత్యర్థులను ఎదుర్కొని వారిపై కొన్ని సార్లు పైచేయి సాధించినా..ఒక్కోసారీ కిందపడ్డా..మళ్లీ పైకిలేవడం ‘చంద్రబాబు’కే సాధ్యమైంది. వాస్తవానికి ‘చంద్రబాబు’ ‘టిడిపి’లో కీలకమైన తరువాత..‘టిడిపి’ తరుపు నుంచి ప్రతిసారీ ‘చంద్రబాబే’ మొహమే..ముందుంటుంది. కానీ..ఆయన ప్రత్యర్థులు మాత్రం ఐదేళ్లకో..ఆరేళ్లకే మారిపోతూ ఉంటారు..సుధీర్ఘ రాజకీయ జీవితంలో..ఆయన ప్రత్యర్థులు ఆయన ముందు మరింత కాలం కొనసాగలేకపోయారు. అప్పట్లో కొన్నాళ్లు వై.ఎస్‌...ఇప్పుడు ఆయన తనయుడు ‘జగన్‌’లు మాత్రమే..అంతో..ఇంతో.. ఆయనకు ఎదురు నిలుస్తున్నారు. అయితే..కెరీర్‌ చరమాంకంలో ఉన్న ‘చంద్రబాబు’కు ‘జగన్‌’ నిబ్బీ బృందం తన సైకో చేష్టలతో సవాల్‌ విసురుతోంది. ఈ బృందానికి ‘చంద్రబాబు’ ఎలా మందేస్తాడో..చూడాలి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ