‘జగన్’కు స్వర్ణావకాశం...!?
మాజీ ముఖ్యమంత్రి ‘వై.ఎస్.జగన్మోహన్రెడ్డి’కి స్వర్ణావకాశం లభించబోతోంది. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారా..? లేక తన అహంకారంతో జారవిడుచుకుంటారో తెలియదు కానీ..ఆయనకో బంగారు అవకాశం చిక్కబోతోంది. ఆ అవకాశం ఏమిటంటే...మే 2వ తేదీన భారత ప్రధాని ‘నరేంద్రమోడీ’ ‘అమరావతి’ పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి రాబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆయన చేతుల మీదుగా మరోసారి ‘రాజధాని’ ‘అమరావతి’ పనులు మొదలు పెట్టబోతోంది. గతంలో ప్రధాని ‘మోడీ’ చేతుల మీదుగా విభజిత రాష్ట్ర రాజధానిగా ‘అమరావతి’ నిర్మాణ పనులు మొదలయ్యాయి. అప్పట్లో ‘చంద్రబాబు’ ఆయన మున్సిపల్ మంత్రి ‘నారాయణ’ స్వయంకృతం వల్ల రాజధానిని వేగంగా నిర్మించలేకపోయారు. అప్పట్లో వారు చేసిన తప్పులు పాపాలై చుట్టుకుని తరువాత రాజధాని ‘అమరావతి’కి ‘జగన్’ రూపేణా శాపాలుగా మారిపోయాయి. రాజధాని ‘అమరావతి’ని ‘స్మశానం’ అంటూ ‘జగన్’ ఆయన బృందం ఎద్దేవా చేసి, దాని అంతానికి కుట్రలు చేసి..చివరకు ప్రజల చేతిలో దారుణంగా దెబ్బతిన్నారు. ఇదంతా చరిత్ర అనుకోండి. అయితే..గతంలో ‘జగన్’ చేసిన తప్పులు దిద్దుకోవడానికి ‘జగన్మోహన్రెడ్డి’కి ఇప్పుడో బ్రహ్మాండమైన అవకాశం దొరకబోతోంది.
రాజధాని ‘పునర్నిర్మాణ పనులు’ను ప్రారంభించడానికి ప్రధాని ‘మోడీ’ రానుండడంతో..రాష్ట్ర ప్రభుత్వం ‘అమరావతి’లో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. దీనికి లక్షలాది మంది ప్రజలను ఆహ్వానించింది. ప్రజలతో పాటు మంత్రుల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అయితే..దీనిలో ‘జగన్’కు వచ్చే అవకాశం ఏమిటంటారా..? అదే చెబుతున్నా...! ‘పులివెందుల’ ఎమ్మెల్యేగా ఉన్న ‘జగన్’కు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపుతుంది. దానితో పాటు రాష్ట్రంలో ప్రధాన పార్టీగా, 40శాతం ఓట్లు వచ్చిన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ‘జగన్’ ఎటువంటి శభిషలు లేకుండా రాజధాని పునర్నిర్మాణ సభకు హాజరు కావచ్చు. ప్రధాని సభకు ఆయన వస్తే..ఆయనను ‘చంద్రబాబు’ ఆహ్వానించినా..లేకపోయినా.. ప్రధాని మోడీ తన దత్తపుత్రుడనే ప్రేమతో ఆయనను కూడా స్టేజ్ మీదకు ఆహ్వానిస్తారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని..‘జగన్’ తాను గతంలో చేసిన తప్పులకు బహిరంగ క్షమాపణ చెబితే..ఆయనపై ప్రజల్లో నెలకొన్న ధ్వేషం చాలా వరకు తగ్గిపోవచ్చు. అప్పట్లో తప్పని తెలియక మూడు రాజధానులను తెచ్చానని, అది తప్పని ప్రజలు తీర్పుతో తేలిపోయింది కాబట్టి..ఇక రాజధాని ‘అమరావతే’నని, మూడు రాజధానుల ప్రస్తావన భవిష్యత్తులో తేనని చెబితే..వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు సమస్యగా ఉన్న మూడు రాజధానుల అంశం పక్కకు పోతుంది. ‘పిల్లాడు తప్పు చేశాడు..మళ్లీ అతనే తప్పు దిద్దుకున్నాడ’ని వెర్రి గొర్రెలు లేక ఆయన అభిమానులు, సానుభూతిపరులు మరోసారి..ఆయనకు బ్రహ్మరథం పడతారు.
వచ్చే ఎన్నికల నాటికి ‘జగన్’ ఎదుర్కొనే ప్రధాన సమస్య రాజధాని. మరో నాలుగేళ్లలో జరగనున్న ఎన్నికల నాటికి ‘చంద్రబాబు’ ఆయన మున్సిపల్ మంత్రి ‘నారాయణ’ ఎంతో కొంత రాజధానిని నిర్మిస్తారు. అయితే..అప్పుడు ‘చంద్రబాబు’ బృందం నుంచి ‘జగన్’కు ఎదురయ్యే మొదటి ప్రశ్న మూడు రాజధానుల ప్రశ్న. ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడ్డారా..? లేక ‘అమరావతి’నే రాజధానిగా గుర్తిస్తారా..? అని..ఎన్నికలప్పుడు దీనిపై ఆయన ‘అమరావతే’ రాజధాని అని చెబితే..అది ఎన్నికల స్టంట్గా ప్రజలు భావించవచ్చు. అలా కాకుండా.. ఇప్పుడే దానిపై క్షమాపణ చెప్పి..‘అమరావతే’ రాజధాని అని అంటే..వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన సమస్యగా ఉన్నది పక్కకు పోతుంది. రాజధాని అంశం పక్కకు పోతే..ఆయన బ్రహ్మాస్త్రాలైన సంక్షేమపథకాలు, కూటమి ప్రభుత్వ చేతకానితనంతో.. చేస్తోన్న తప్పులు...ప్రభుత్వ వ్యతిరేకత..ఇలా మిగతా అంశాలన్నీ కలసి వచ్చి..ఆయనకు మళ్లీ పదవీ యోగం కలగవచ్చు. పదవిలోకి వచ్చాక..మళ్లీ మూడు రాజధానులో.. లేక నాలుగో..ఐదో పెట్టుకోవచ్చు. కుక్కతోక..మారదని ప్రజలూ సర్దుకుపోతారు. గతంలో..ఇక్కడే ఇళ్లు కట్టుకున్నాను.. ఇక్కడే.. కాపురం పెడుతున్నాను..32 వేల ఎకరాలు కాదు..60వేల ఎకరాలు కావాలి..అన్న నోటితోనే..‘అమరావతి’ స్మశానం..అని అనలేదూ..అలా అనవచ్చు. ప్రస్తుతానికి ‘మోడీ’ సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పి..‘అమరావతే’ రాజధాని అని చెబితే..సరిపోతుంది. మరి ‘జగన్’ అలా చేస్తారా...వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారా..? వైకాపాలో బుర్ర ఉన్న ఎవరైనా..‘జగన్’ను ఒప్పిస్తే..బాగుంటుందేమో..?