ఒకే వేదికపై…ఇద్దరు లెజెండ్స్
ఒకరేమో...సినీ మెగాస్టార్..మరొకరేమో..రాజకీయ మెగాస్టార్...! ఇద్దరూ..అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన వారే...? అలా ఎదిగిన వారిద్దరూ..తమ తమ రంగాల్లో తిరుగులేని చరిత్ర సృష్టించారు. అలా చరిత్ర సృష్టించిన వారెవరో కాదు..వారిలో ఒకరు మెగాస్టార్ ‘చిరంజీవి’ ఒకరు కాగా..మరొకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’లు. వీరిద్దరూ అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చి తమ కృషితో, పట్టుదలతో ఎవరూ సాధించలేని రికార్డులు సాధించారు. రాష్ట్ర మున్సిపల్ మంత్రి ‘పి.నారాయణ’ కుమార్తె ‘శరణి’ రచించిన ‘మైండ్సెట్ షిప్ట్’ అనే పుస్తక అవిష్కరణ సభలో వీరిద్దరూ కలిసారు. వారు తమ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తమ మైండ్ను ఎలా షిఫ్ట్ చేసుకున్నారో..ఎలా కష్టపడ్డారో..ఈ సందర్భంగా వివరించారు. ఆసక్తి ఉన్నవారికి వారి జీవితం ఎన్నో పాఠాలను నేర్పుతుంది. జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో..? వాటిని అధిగమించి..ఎలా ముందుకు వెళ్లాలో, వాటి తట్టుకునే మెలుకవులు ఏమిటో..వారిద్దరిని గమనించి నేర్చుకోవచ్చు.
అతి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ‘చంద్రబాబు’ నాలుగు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యలు నిర్వహించారు. ఆయన నాలుగుసార్లు ఏదో అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి కాలేదు. ఆయన కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం, అంతులేని సహనం, రోజూ ఏదో నేర్చుకోవాలనే తపనే ఆయనను రాజకీయంగా ఉన్న స్థితిలో నిలిపింది. ఆయనతో పాటు రాజకీయాలు ప్రారంభించిన వారు..ఎప్పుడో రిటైర్ కావడమో..లేక క్రియాశీలకంగా లేకపోవడమో జరిగింది. కానీ..ఆయన తనను తాను మలచుకున్నారు. తొలినాళ్లలో ఎమ్మెల్యే అయితే చాలనుకున్న ఆయన తరువాత మంత్రి అయ్యారు. మంత్రి పదవి వచ్చిన తరువాత ఆయనకు అదృష్టం ‘ఎన్టీఆర్’ రూపంలో వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే బహిరంగంగా చెప్పారు. తాను కష్టపడ్డానని, దానికి అదృష్టం తోడైందని ఆయన చెప్పుకున్నారు. అది వాస్తవమే.. ఆయనకు ‘ఎన్టీఆర్’ పిల్లనివ్వడంతో..ఆయన దశ తిరిగింది. అయితే..అనుకోని విధంగా ముఖ్యమంత్రి అవడం..తరువాత దాన్ని నిలబెట్టుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యమంత్రి పదవి వచ్చిన తరువాత ‘ఎన్టీఆర్’ మరణించడం..ఆయనకు ఒకరకంగా అదృష్టమనే చెప్పాలి. ‘ఎన్టీఆర్’ కనుక బతికి ఉంటే..ఆయన ముఖ్యమంత్రి పదవి మూడునాళ్ల ముచ్చట అయ్యేదేమో..కానీ..ఎవరూ దీని గురించి వ్యాఖ్యానించరు. ఒకవేళ ‘చంద్రబాబు’ను ఇదే మాట ఎవరైనా..అడిగి ఉంటే ఏమి చెప్పేవారో..? అయితే ఒకటి ఊహించవచ్చు. ‘ఎన్టీఆర్’ బతికి ఉంటే ఆయనను కూడా ‘చంద్రబాబు’ తన కష్టంతో, వ్యూహాలతో ఢీ కొట్టి ఉండేవారు. బహుశా ఓడిపోవచ్చు. కానీ పట్టుదలతో పోరాడేవారు. దానిలో సందేహం లేదు. ఈ విషయం తరువాత రోజుల్లోనే ఆయన నిరూపించారు. ‘రాజశేఖర్రెడ్డి’ ముఖ్యమంత్రి అయిన తరువాత ‘తెలుగుదేశం’ పార్టీని కకావికలం చేశారు. ఒకవైపు ‘టిఆర్ ఎస్’ (ఇప్పుడు బిఆర్ ఎస్) మరో వైపు ‘చిరంజీవి’ ‘ప్రజారాజ్యం’, ఇంకోవైపు ‘లోక్సత్తా’ ‘జయప్రకాష్ నారాయణ’లు ‘చంద్రబాబు’ పార్టీని తీవ్రఇబ్బందులు పెట్టారు. కానీ..తన పట్టుదల, మొండి ధైర్యం, వ్యూహాలతో పార్టీనీ, పార్టీ నాయకులను కాపాడుకున్నారు. వై.ఎస్ మరణం తరువాత వచ్చిన ‘జగన్’ ‘చంద్రబాబు’కు చుక్కలు చూపించారు. చరిత్రలో లేని విధంగా ఆయనను జైలుకు పంపించారు. అయినా..ఆయన తొణకలేదు..బెణకలేదు..ఎక్కడలేని పట్టుదల, ధైర్యంతో..ముందడుగు వేసి అఖండ విజయంసాధించారు. ఈయన జీవితం..ఎందరో యువతకు స్పూర్తి..ఆయనపై విమర్శలు, ఆరోపణలు కొదవేమీ లేదు. అయినా..ఆయన పట్టుదల, వ్యూహాలు, మొండితనం..అనుకున్నది సాధించాలన్న తపన..క్రమశిక్షణ..ఎందరికో ఆదర్శం.
ఇక మెగాస్టార్ ‘చిరంజీవి’ జీవితం కూడా ఇంచుమించు ‘చంద్రబాబు’ వంటిదే. ఆయనో సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా సినీ జీవితం ప్రారంభించి..మెగాస్టార్గా ఎదిగారు. ‘ఎన్టీఆర్’,‘ ఎఎన్నార్’, ‘కృష్ణ’,‘శోభన్బాబు’ వంటి నటులతో పోటీని తట్టుకుని, చిన్న చిన్న పాత్రల నుంచి హీరోగా ఎదిగారు. సినీ రంగంలో ఎటువంటి మద్దతు లేకుండా స్వయం కృషితో ఆయన ఎదిగిన తీరు..ఎందరికో ఆదర్శం. క్రమశిక్షణ, పట్టుదల,చేసే పనిపై అంకితభావం, అంతులేని ఆసక్తి ఆయనను సినీ మెగాస్టార్గా చేశాయి. ‘చంద్రబాబు’కు కలిసివచ్చినట్లు ‘చిరంజీవి’కి కూడా అదృష్టం తోడైంది. సినీరంగంలో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఆయనకు ‘అల్లు రామలింగయ్య’ సహాయం తోడైంది. ఆయన కుమార్తెను ‘చిరంజీవి’ వివాహం చేసుకున్న తరువాత ఆయనకు తిరేగే లేకుండా పోయింది. అయితే..ఆయన తోటివారైన ‘బాలకృష్ణ’, ‘నాగార్జున’, ‘వెంకటేష్’, ‘కృష్ణంరాజు’ వంటి వారితో పోటీ ఎదురైనా..ఆయన ఎక్కడా వెనక్కు తగ్గలేదు. తనదైన డాన్స్లు, మేనరిజంతో.. తెలుగు సినీ రంగాన్ని ఉర్రూతలూగించారు. ‘ఎన్టీఆర్’ తరువాత..తెలుగు తెరను ఏలిన నటుడిగా..ఆయన నిలిచిపోయారు. అలా ఆయన నిలిచిపోవడానికి ఆయన తన మైండ్సైట్ను మార్చుకోవడమే కారణమని ఆయనే చెప్పారు. చిన్న చిన్న కష్టాలకే కుంగిపోకుండా..పోరాడా లని, పట్టుదలను ప్రదర్శించాలని ఆయన యువతను కోరుతున్నారు. వేర్వేరు రంగాలకు చెందిన ఈ ఇద్దరు లెజెండ్స్ను ఒకే ప్రేమ్లో చూడడం...వారి అనుభవాలను ఆహ్వానితులతో పంచుకోవడం..చూపరులను ఆకట్టుకుంది.