అరెస్టులు...సానుభూతి లెక్కలు...!?
‘మద్యం’ కుంభకోణంలో లెక్కలన్నీ తేలిపోయాయని, మద్యం ముడుపులన్నీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి చేరాయని, ఇక రేపో..మాపో ఆయనను అరెస్టు చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సీఐడీ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో కీలకమైన ‘కసిరెడ్డి’ అరెస్టు తరువాత వరుసగా అరెస్టులు జరుగుతూ వచ్చాయి. అయితే..దీనిలో మరో ప్రధాన నిందితుడైన ఎంపి ‘మిధున్రెడ్డి’ని ఇంకా అరెస్టు చేయలేదు. కాగా ఇప్పటీ కేసులో మనీ ట్రయిల్ మొత్తం ‘జగన్’ చుట్టూనే తిరుగుతోంది. మద్యం ముడుపులన్నీ ఆయనకే వెళ్లాయని, దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. దీని ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని అరెస్తు చేస్తారని, ఏ నిమిషంలోనైనా..ఆయనను అరెస్టు చేస్తారని సదరు సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఆశ్చర్యకరంగా వైకాపాను సమర్థించే సోషల్ మీడియా కూడా ‘జగన్’ను అరెస్టు చేస్తారని, ‘జగన్’ అరెస్టుపై కేంద్రంలోని ‘బిజెపి’ పెద్దలతో ‘చంద్రబాబు’ చర్చించారని, వారి అనుమతి తీసుకున్నారని, ఇక అరెస్టే మిగిలిందని వారు ప్రచారం చేస్తున్నారు. ‘జగన్’ అరెస్టు కోసం ‘చంద్రబాబు’ రెండు సార్లు కేంద్రహోంమంత్రి ‘అమిత్షా’తో భేటీ అయ్యారని, ఆయన అనుమతి ఇచ్చారని వైకాపా సోషల్ మీడియా అంటోంది.
ఒకవేళ ‘జగన్’ ఈ కేసులో అరెస్టు అయితే..‘జగన్’కే మంచిందని, ఆయనకు సానుభూతి వస్తుందని కూడా వారు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఆయనకు సొమ్ములు ముట్టినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, ఇప్పుడు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు చెల్లవని, ‘జగన్’ను అరెస్టు చేసినా..ఆయన మూడు నెలల్లో బెయిల్పై బయటకు వస్తారని వారు అంటున్నారు. ఆయన బయటకు వచ్చిన తరువాత ‘టిడిపి’ నాయకులు సంగతి తేలుస్తారని, ‘జగన్’ సంగతి ‘టిడిపి’ వారికి బాగా తెలుసునని, దీంతో కొందరు ఆయనను అరెస్టు చేయవద్దంటూ ‘చంద్రబాబు’పై ఒత్తిడి తెస్తున్నారని వారు చెప్పుకుంటున్నారు. గతంలో తనను అరెస్టు చేయించినందుకే ‘చంద్రబాబు’ ‘జగన్’ 53రోజుల పాటు జైలులో ఉంచారని, ఈసారి కనుక ఆయనను అరెస్టు చేస్తే..మళ్లీ ‘జగన్’ అధికారంలోకి వస్తే..‘టిడిపి’ నాయకులందరినీ జైలుపాలు చేస్తారని వారు హెచ్చరిస్తున్నారు. వైకాపా సోషల్ మీడియా ‘జగన్’ అరెస్టుపై ఒకటే రాద్ధాంతం చేస్తోంది. ఒకవైపు అరెస్టు చేస్తే..ఆయన ఊరుకోరని, మరోవైపు..ఆయనకు సానుభూతి వస్తుందని, ఆయనను అరెస్టు చేస్తే ఆయనకే లాభం అని ఊదరగొడుతోంది. ‘జగన్’ అరెస్టుపై ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి కదలిక లేకపోయినా..వైకాపా సోషల్ మీడియా మాత్రం ఆయనను అరెస్టు చేస్తే బాగుండు..అన్నట్లు వ్యవహరిస్తోంది. ఆయన అరెస్టు అయితే ‘చంద్రబాబు’కు వచ్చినట్లు ‘జగన్’కూ సానుభూతి వస్తుందని, తద్వారా వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ గెలుస్తుందనే ఉద్దేశ్యం వారిలో ఉంది. అయితే..వారనుకున్నట్లు ‘జగన్’ అరెస్టు అయితే..సానుభూతేమీ రాదు. కొన్నివర్గాలు ఆయనకు మద్దతు ఇవ్వవచ్చేమో కానీ..మెజార్టీ వర్గాలు మాత్రం ఆయనకు మద్దతు ఇవ్వవు.
అసలు ‘జగన్’ అరెస్టు అనే అంశంపై ‘చంద్రబాబు’కు ఆసక్తి ఉన్నట్లేమీ కనిపించడం లేదు. ఆయనను అరెస్టు చేయాలనకుంటే..బైయిల్ వచ్చే కేసుల్లో ఏమీ అరెస్టు చేయించరు. వాస్తవానికి ‘చంద్రబాబు’ ఆలోచనలు వేరే ఉన్నాయి. ‘జగన్’ను అరెస్టు చేస్తే మళ్లీ బయటకు రాకుండా కట్టుదిట్టంగా చేయాలనే ఆలోచన ఆయనలో ఉంది. ఈ మద్యం కేసుల్లో కాకుండా..గతంలో ‘జగన్’పై నమోదైన అక్రమ కేసుల్లో జైలు శిక్ష వేయిస్తే..ఇప్పట్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేకపోతే..‘జగన్’ తన పార్టీ ని మళ్లీ గెలిపించడానికి అంతగా ఆసక్తి చూపించరు. తాను కాకుండా ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా..ఆయనకు ఇష్టం ఉండదు. చివరకు ఆయన భార్య ముఖ్యమంత్రి అయినా..ఆయనకు ఆసక్తి ఉండదు. అందుకే ‘చంద్రబాబు’ కేంద్ర పెద్దలను ఏదో విధంగా ఒప్పించి ‘జగన్’ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయడానికే ప్రయత్నిస్తారు. ఆ కేసుల్లో ఆయనకు తప్పకుండా శిక్ష పడుతుంది. అప్పుడు ‘జగన్’కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. మనీలాండరింగ్, సూట్ కేసు కంపెనీల్లో ‘జగన్’ జైలుకు పోతే..ఐదారేళ్లు బయటకు వచ్చే అవకాశమే ఉండదు. ఇటువంటి అవకాశాన్నే ‘చంద్రబాబు’ ఉపయోగించుకుంటారు కానీ..మద్యం కేసులో మాత్రం అరెస్టు చేయించరనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే..ఈ మద్యం కేసుల్లో ‘జగన్’ను అరెస్టు చేస్తారని వైకాపా సోషల్ మీడియా ఒకటే ఊదరగొడుతుంది. సానుభూతి, వ్యతిరేకత అంటూ సోది లెక్కలు వేసుకుంటూ..ఊహాలోకాల్లో విహరిస్తోంది.