లేటెస్ట్

‘గుడ్డి’కన్నా ‘మెల్ల’ నయం కదా...!?

వైకాపా మాజీ నాయకుడు ‘విజయసాయిరెడ్డి’ రాజీనామా చేసిన రాజ్యసభ సీటును ఎవరూ ఊహించని విధంగా ‘బిజెపి’ ఓ సామాన్య కార్యకర్తకు ఇచ్చింది. ‘పశ్చిమగోదావరి’ జిల్లాకు చెందిన పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ ‘పాకా వెంకటసత్యనారాయణ’ను ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం రేపు ఆయనను నామినేషన్‌ వేయాలని సూచించింది. ‘వైకాపా’ రాజ్యసభ సభ్యుడు ‘విజయసాయిరెడ్డి’ రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ‘విజయసాయిరెడ్డి’ రాజీనామా తరువాత ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ‘టిడిపి’, ‘బిజెపి’లో పెద్ద చర్చే నడిచింది. ‘విజయసాయిరెడ్డి’ రాజీనామా చేసిన తరువాత తాను ఇక రాజకీయాల్లో ఉండడని, వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే..తరువాత ఆయన అనూహ్యంగా మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం సాగింది. దాన్ని ఆయన కూడా ధృవీకరించారు. తాను మనస్సు మార్చుకోకుడదా..? మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటే మీ అందరి వద్ద ఫర్మిషన్‌ తీసుకోవాలా..? అంటూ తనదైన శైలిలో దబాయించారు. దీంతో..రాజకీయ వర్గాల్లో ఊహాగాలు మొదలయ్యాయి. ‘విజయసాయిరెడ్డి’ ‘బిజెపి’లో చేరుతారని, ‘బిజెపి’లో చేరి..ఆయన రాజ్యసభకు మళ్లీ వెళతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ‘టిడిపి’ వర్గాల్లో, కార్యకర్తల్లో ఆందోళన రేకెత్తించింది. మన పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన రాజ్యసభ సభ్యుడు అవుతారా..? నిత్యం తమ పార్టీ అధినేతను, ఆయన కుమారుడ్ని దూషించే ఆయనను తమ పార్టీ మద్దతుతో రాజ్యసభకు పంపించడమా..? అనే ఆందోళన టిడిపి వర్గాల్లో నెలకొంది. ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’పై ‘బిజెపి’ పెద్దలు వత్తిడి తెస్తున్నారని, ‘విజయసాయిరెడ్డి’ అభ్యర్థిత్వం ఖరారు అయిందనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో..‘టిడిపి’ వర్గాలు డీలా పడ్డాయి.


తమ ఆగర్భశత్రువును తామే రాజ్యసభ సభ్యుడి చేయడమా..? హథవిధీ..అంటూ వాపోయారు. అయితే..‘చంద్రబాబు’ ‘బిజెపి’ పెద్దలతో గట్టిగా వ్యవహరించి.. ‘విజయసాయిరెడ్డి’ని అడ్డుకున్నారని తెలుస్తోంది.వాస్తవానికి బిజెపికి రాజ్యసభ సభ్యుడిని ఎంపిక చేసే బలం అసెంబ్లీలో లేదు. వారికి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఒక్క రాజ్యసభ స్థానం కూడా రాదు. అయితే.. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న ‘చంద్రబాబు’ ‘బిజెపి’ పెద్దలతో సఖ్యతతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన ‘బిజెపి’ పెద్దలకు ఎదురు చెప్పడం లేదు. వారు అడిగినవన్నీ ఇచ్చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే వైకాపా రాజ్యసభ్యులు నలుగురు రాజీనామా చేస్తే..వాటిలో రెండు ‘బిజెపి’కే అప్పగించారు. ‘ఆర్‌.కృష్ణయ్య’, ‘విజయసాయిరెడ్డి’ స్థానాలను వారికి ఇచ్చారు. అదే సమయంలో ‘మోపిదేవి వెంకటరమణ’, ‘బీద మస్తాన్‌రావు’ స్థానాలను ‘టిడిపి’కి తీసుకున్నారు. వీరిలో ‘బీద మస్తాన్‌రావు’ టిడిపిలో చేరి మళ్లీ రాజ్యసభకు వెళ్లగా, ‘మోపిదేవి’ స్థానం ‘సానా సతీష్‌’కు తీసుకున్నారు. వవన్నీ రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చినవే. కాగా మొన్నటి వరకూ..‘విజయసాయిరెడ్డే’ ‘బిజెపి’ అభ్యర్థినే ప్రచారం ‘టిడిపి’వర్గాలకు ఇబ్బందిగా మారింది. అయితే ఇప్పుడు ఆయన కాదని ‘పాకా’కు ఇవ్వడంతో ‘టిడిపి’ శ్రేణులు నిట్టూర్పులిడి స్తున్నాయి. ‘గుడ్డి’ కంటే...‘మెల్ల’ నయమన్నట్లు ‘విజయసాయిరెడ్డి’ కన్నా..‘పాకా’ నయం అంటూ..సర్ది చెప్పుకుంటున్నారు. తమ బలం మీద...‘బిజెపి’ రెండు రాజ్యసభ స్థానాలు తీసుకుందని, ఇవి ఉప ఎన్నికలని సర్దుకున్నా..భవిష్యత్తులో వాళ్లు మళ్లీ తమ సీట్లు తమకు ఇవ్వాలంటే..పార్టీ ఘోరంగా నష్టపోతుందని టిడిపి సీనియర్‌ నేతలు అంటున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ