SRM యూనివర్శిటీలో విద్యార్ధి ఆత్మహత్య...!?
భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడంటున్న యాజమాన్యం
విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
ఆత్మహత్యా లేక హత్యా...!?
అమరావతి: నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్శీటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ‘సుభాష్’ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ‘సుభాష్’ యూనివర్శీటీలోని 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. అయితే యాజమాన్య ప్రకటనపై తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని మానసికంగా వేధించారని, ఆయన చావుకు యాజమాన్య వైఖరే కారణమని తల్లిదండ్రులు అంటున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన సుభాష్ ఇక్కడ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. అయితే ఇటీవల జరిగిన పరీక్షలకు హాజరు తక్కువుగా ఉందని యాజమాన్యం పరీక్షలకు అనుమతించలేదని, దాంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని యాజమాన్యం అంటోంది. అయితే...హాస్టల్లో ఉండే తమ కుమారుడు కళాశాలకు హాజరు కాకపోతే.. పట్టించుకోవాల్సింది.. యాజమాన్యమే కదా..? కళాశాలకు తమ కుమారుడు హాజరు కాని విషయం తమకు తెలియచేయాల్సిన బాధ్యత వారికి ఉంది కదా..అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ‘సుభాష్’కు 69శాతం హాజరు ఉందని, కానీ కళాశాల రూల్స్ ప్రకారం 75శాతం ఉండాలని, అలా లేకపోవడంతో..విద్యార్థి కళాశాల ‘డీన్’ను కలిసి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోరారని తెలుస్తోంది. అయితే ‘డీన్’ పరీక్షలు రాయడానికి అనుమతించలేదని, దాంతో మనస్థాపం చెంది విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
‘ఆత్మహత్య’పై అనుమానాలు...!
కాగా విద్యార్థి ‘సుభాష్’ ఆత్మహత్యపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంటే తమకు నాలుగు గంటల తరువాత చెప్పారని, ఈ నాలుగు గంటల్లో ఏమి జరిగిందో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్శీటీ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని, విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడే సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయిందో..లేదో చెప్పాలంటున్నారు. లక్షల కొద్ది ఫీజులు తీసుకుంటోన్న యూనివర్శీటీ యాజమాన్యం విద్యార్థి కళాశాలకు సరిగా హాజరు కాకపోతే..తమకు తెలియజేయాల్సిన బాధ్యతలేదా అని ప్రశ్నిస్తున్నారు. తమ కుమారుడి మృతిపై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం పారదర్శికంగా విచారణ చేయించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా యాజమాన్య నిర్లక్ష్య,దోపిడీ విధానాలే.. విద్యార్థుల పాలిట శాపాలుగా మారుతున్నాయనే భావన ఉంది. లక్షలు..లక్షలు ఫీజులు వసూలు చేసే యాజమాన్యం.. విద్యార్థులను పట్టించుకోవడం లేదని, తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటి సంఘటనలే జరిగాయని, అయినా తమ తీరును యాజమాన్యం మార్చుకోవడం లేదని, దీనిపై విచారణ జరపాలని, కళాశాలను సీజ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి మృతిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని, ఆయన దీనిపై సీరియస్గా విచారణ చేయించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. యాజమాన్య వ్యవహారం సరిగా లేదని, గతంలో కూడా విద్యార్ధులు, విద్యార్థి తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించారని, ఎవరూ సమాధానాలు చెప్పేవారు లేరని, ఫీజులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ, చదువుచెప్పే విషయంలోనూ, విద్యార్ధులను పట్టించుకోవడలో లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేయించాలని సమాజంలోని అన్ని వర్గాలు కోరుతున్నాయి.