లేటెస్ట్

‘ఫీనిక్స్‌ అమరావతి’...!

వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి ‘అమరావతి’ మళ్లీ ‘ఫీనిక్స్‌పక్షి’లా బయటకు వస్తోంది.‘జగన్‌’ కుట్రలు, కుతంత్రాలను ధైర్యంగా ఎదుర్కొని.. సగౌరవంగా..మళ్లీ పునర్జీవం పొందుతోంది. ఐదేళ్ల ‘జగన్‌ గ్యాంగ్‌’ అరాచకానికి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు పాతరేసిన తరువాత..‘ఆంధ్రుల’ రాజధాని ‘అమరావతి’పై వారి కన్న కలలు నిజం చేసుకునే రోజు వచ్చింది. రాజధాని కోసం వేల ఎకరాల పొలాలను త్యాగం చేసిన రైతులు, మహిళల కలను సాకారం చేస్తూ ప్రధాని మోడీ మరోసారి రాజధాని ‘అమరావతి’కి పున:ప్రారంభోత్సవం చేయనున్నారు. రేపు ‘మోడీ’చేతుల మీదుగా జరుగుతోన్న ఈ ప్రారంభోత్సవం రాష్ట్ర భవిష్యత్తుకు మేలి మలుపుకావాలని ‘ఆంధ్రా’ హితులు కోరుకుంటున్నారు. దాదాపు 11ఏళ్ల నాడు విభజిత రాష్ట్రానికి రాజధాని లేదని భావిస్తున్న తరుణంలో మూడు పంటలు పండే వ్యవసాయ భూములను  ‘అమరావతి’ రైతులు పైసా తీసుకోకుండా రాజధాని కోసం ఇచ్చేసి..దేశానికో..సందేశాన్ని పంపించారు. తాము ‘ఆంధ్రుల’ ఆత్మగౌరవం కోసం..ఎందాకైనా..వెళతామని, అభివృద్ధికోసం, భవిష్యత్‌ తరాల కోసం త్యాగాలు చేస్తామని వారు నాడు నిరూపించారు. అయితే.. వారి ఆశలు, ఆశయాలు..సగంలోనే ఆవిరయ్యాయి. తొలివిడత ఇదే ‘మోడీ’తో ప్రారంభోత్సవం జరిగిన తరువాత రాజధాని నిర్మాణంలో ‘చంద్రబాబు’ ప్రభుత్వం తన అసమర్థతను చాటుకుంది. వేల ఎకరాల భూములను రైతులు ఇచ్చినా..వాటిని ఉపయోగించుకుని శరవేగంగా రాజధానిని నిర్మించలేకపోయారు.


నాటి ‘చంద్రబాబు’ ఆయన మంత్రులు చేసిన తప్పిదాలు ‘జగన్‌’ గ్యాంగ్‌కు వరంగా మారాయి. ‘గ్రాఫిక్స్‌’ అంటూ వాళ్లు చేసిన ప్రచారం ప్రజాబాహుళ్యంలోకి బాగానే వెళ్లింది. ‘అసెంబ్లీ’ సాక్షిగా..‘అమరావతే’ రాజధాని అన్న ‘జగన్‌’ తరువాత అడ్డంగా నాలిక మెలేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదికి..‘అమరావతి’రాజధాని కాదు..మూడు రాజధానులంటూ..‘అమరావతి’ విధ్వంసానికి వ్యూహరచన చేసి..తన కుటిలత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఐదేళ్లపాటు ‘అమరావతి’పై ‘జగన్‌గ్యాంగ్‌’ చేసిన అరాచకం ‘చరిత్ర’లో నిలిచిపోతుంది. ఒకవైపు ‘అమరావతి’లోనే ఉంటూ..అది రాజధాని కాదంటూ..అది స్మశానం అంటూ..మునిగిపోతుందంటూ..‘జగన్‌ గ్యాంగ్‌’ చేసిన ప్రచారాన్ని, కుట్రలను, కుతంత్రాలను ఐదేళ్ల పాటు ‘అమరావతి’ మౌనంగా భరించింది. అదే సమయంలో ‘అమరావతి’ రైతులు, మహిళలు చేసిన పోరాటం మరువలేనిది. మొక్కవోని దీక్షతో, మొండి ధైర్యంతో..‘జగన్‌’ అరాచకాన్ని వీళ్లు ఎదిరించి రాజధానికి ప్రాణం పోశారు. తమ ఆత్మబలంలో, అగ్నిలో కాలిపోయినా లెక్క చేయక, వందల ప్రాణాలు పోయినా..వెరవక,  నిరాశ, నిస్పృహలను దరిచేరనీయకుండా వారు సాగించిన పోరాట ఫలితమే మరోసారి ‘అమరావతి’కి ఆయువైంది. ‘ఆంధ్రు’లకో రాజధాని ఉండాలని, అది ‘అమరావతే’ కావాలని మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారు. వారి తీర్పు, అమరావతి రైతులు, మహిళల పోరాటంతో..‘అమరావతి’ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. అయితే..ఇప్పటికైనా.. పాలకులు గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా..రాబోయే నాలుగేళ్లలో రాజధాని కలను సాకారం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలోని ‘మోడీ’ ప్రభుత్వం ఎంతో కొంత మద్దతు ఇస్తోన్న తరుణంలో..అలసత్వం వహించకుండా రాజధానిని పూర్తిచేయాలి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ