సగం కుంటుంబాలకు సంక్షేమం...!
గత 20ఏళ్ల నుంచి ప్రభుత్వాలపై ఆధారపడే ప్రజానీకం సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వ్యవసాయికరణ తగ్గిపోయిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వైపు ఆశగా చూసే పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజు రోజుకు ఈ సంఖ్య కొండవీటిచాంతాడులా పెరిగిపోతూనే ఉంది. దేశంలో ప్రతి పదిమందీ తమ బతుకుదెరువు కోసం ప్రభుత్వంవైపు ఆశగా చూసే రోజులు వచ్చాయి. ప్రపంచీకరణే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గతంలో పలు వర్గాలు తమ స్వంత వృత్తులతో జీవనం సాగించేవారు. ఎవరి వృత్తిని వారు చేసుకుంటూ..ఎవరిపై ఆధారపడకుండా జీవించేవారు. అయితే ఆర్థికసంస్కరణలు పుణ్యాన, ప్రపంచబ్యాంక్ పుణ్యాన సామాన్య ‘జనం’ ప్రభుత్వం వైపు దీనంగా చూడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. దీనికి తోడు ఓటు లెక్కలతో..ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చేశాయి. ప్రతి వర్గానికి ఏదో పథకం పేరుతో ప్రభుత్వాలు సొమ్ములు పంచేస్తున్నాయి. ఇవి అప్పటికప్పుడు బాగానే ఉన్నా..ధీర్ఘకాలంలో మాత్రం ప్రతి ఒక్కరికీ నష్టమే చేస్తాయని అనుభపూర్వకంగా తేలిపోయింది. అయితే..సంక్షేమపథకాలు అమలు చేయకపోతే తాము ఓడిపోతామనే భయంతో పాటు..తమ ప్రత్యర్థి తమకంటే ముందుకు వెళతాడనే ఆందోళనతో రాజకీయపార్టీలు సంక్షేమపథకాలకు పెద్దపీట వేసి ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా పంచేస్తున్నాయి. చివరికి ఈ పంచుడు కార్యక్రమాలు..వేలం పాట రీతిలో ఉంటున్నాయి. ఫలానా పార్టీ..ఇంత అంటే..దానికి రెట్టింపు అంటూ..ఇంకో పార్టీ పాటను పెంచేస్తున్నాయి. ఇవి చివరికి ఏ దారికి పోతాయో తెలియదు కానీ..సంక్షేమం ముసుగులో పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారిపోతున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు ఆర్థికంగా చితికిపోయి..అభివృద్ధి, ధీర్ఘకాలిక ప్రయోజనాలకు కల్పించేవాటిపై దృష్టి పెట్టలేకపోతున్నాయి.
‘ఆంధ్రప్రదేశ్’ విషయమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. గత ‘జగన్’ ప్రభుత్వం అభివృద్ధిపనులు, దీర్ఘకాలిక పథకాలపై ఖర్చు చేయకుండా ప్రజల సొమ్మును పప్పూ బెల్లాల పంచేసింది. ‘జగన్’ను చూసి..‘చంద్రబాబు’ మరింతగా సంక్షేమపథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా ఆయన చేస్తోన్న సంక్షేమ ఖర్చు ‘జగన్’కు రెట్టింపు. ‘జగన్’ ఇచ్చిన ప్రతి పథకానికి రెట్టింపు ఇవ్వాలనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళుతున్నారు. ఉదాహరణకు సామాజిక భద్రతా ఫింఛన్లనే తీసుకుంటే..దాదాపు 63లక్షల మందికి ప్రతి నెలా రూ.2717 కోట్లు పంచుతున్నారు. గతంలో కన్నా ఇది రెట్టింపు. దీని ప్రకారం చూసుకుంటే..రాష్ట్రంలో ఉన్న కుటుంబాల్లో సగం కుటుంబాలు సామాజిక భద్రతా పింఛన్లు అందుకున్నట్లే. రాష్ట్రంలో ఒక కోటి అరవై లక్షల కుటుంబాలు ఉంటాయని అంచనా. దీని ప్రకారం చూసుకుంటే..ప్రతి రెండు కుటుంబాల్లో ఒక కుటుంబం ఫింఛన్ అందుకున్నట్లే. కేవలం సామాజిక ఫింఛన్లు కాకుండానే ఇతరత్రా చేసే సంక్షేమ పథకాలు అదనం. మొత్తం కోటి అరవై లక్షలు కుటుంబాలు ఉంటే..ప్రతి కుటుంబం ఏదో ఒకరకంగా ప్రభుత్వ పథకాలను అందుకుంటున్నట్లే. ఏతావాతా తేలేదేమిటంటే..ప్రతి కుటుంబం ప్రభుత్వంపై ఆధారపడినట్లే. ప్రభుత్వంపై ఆధారపడితే..ఇక అభివృద్ధి, ఇతర ధీర్ఘకాలిక ప్రయోజనాలు గాలికిపోయినట్లే. మొత్తం మీద..ఏఐ యుగంలో కూడా సంక్షేమం..సంక్షేమం..అంటూ..ప్రభుత్వాలు..ప్రజలను బిక్షగాళ్లను చేస్తూనే ఉన్నాయి.