అప్పుడే ‘జగన్’ను ‘మోడీ’ కట్టడి చేసి ఉంటే...!?
ఆంధ్రుల కలల రాజధాని ‘అమరావతికి నేడు ప్రధాని ‘మోడీ’ మరోసారి శంఖుస్థాపన చేయబోతున్నారు. నేడు అట్టహాసంగా ఆయన చేతుల మీదుగా దాదాపు రూ.57,962కోట్లు విలువైన పనులను చేపట్టబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘మోడీ’ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసింది. ఆయన అపూర్వస్వాగతం పలకబోతోంది. భారీ జనసమీకరణతో ఆయనను ఖుషీ చేయబోతోంది. ఆయన రాకతో అమరావతి బ్రేక్లు లేకుండా ముందుకు పోతుందని, భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ భావిస్తున్నారు. కాగా ‘మోడీ’ రెండోసారి రాజధాని పనులకు శంఖుస్థాపన చేయడంపై కొన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నా..మరికొన్ని వర్గాలు మాత్రం మళ్లీ ఎందుకీ..శంఖుస్థాపనలు అంటూ పెదవి విరుస్తున్నారు. దాదాపు పదేళ్లనాడు ఆయన రాజధాని కోసం మట్టీ,నీళ్లు తెచ్చారని అప్పట్లో ఆయనెంతో సహకరిస్తారని ఆంధ్రాప్రజలు ఆయనపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే అవేవీ జరగకపోవడంతో..వారు తీవ్ర నిరాశ, నిస్పృహకు గురయ్యారు. అప్పట్లోనే ఆయన రాజధాని కోసం సహకరించి ఉన్నా... ‘జగన్’ రాజధానిని విధ్వంసం చేస్తున్నప్పుడు ఆపినా..ఇప్పుడు రాజధాని పరిస్థితి వేరేలా ఉండేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నప్పుడు ఆపి ఉంటే..ఇప్పుడు రెండోసారి శంఖుస్థాపనల అవసరమే ఉండేది కాదని, ఏదో సినిమాలో చెప్పినట్లు.. ‘చెల్లిపెళ్లి..జరగాలి మళ్లీ..మళ్లీ..అన్నట్లు’ ఉందని వారు ఎద్దేవా చేస్తున్నారు. చిత్తశుద్ది లేకపోవడంతోనే..రాజధానికి ఈ గతి పట్టిందని, ఇన్నాళ్లు ఆలస్యమైందని వారు విమర్శిస్తున్నారు.
2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన ‘జగన్’ మూడు రాజధానులు అన్నప్పుడే ఆయనను వారించి ఉన్నా..రాజధానిని నాశనం చేస్తున్నప్పుడు ఆపి ఉన్నా.. ‘మోడీ’పై ఆంధ్రాప్రజల్లో అంతులేని అభిమానం ఉండేదని, కానీ..ఆయన మౌనమునిలా, నిర్లిప్తతో వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. కనీసం తన చేతుల మీదుగా ప్రారంభించిన ‘అమరావతి’ నాశనం అవుతున్నా..ఆయన అడ్డుకోలేదని, ఆయన అనుకుంటే.. ‘జగన్ను ఆపడం..అరక్షణంలో జరిగేదనే భావన వారిలో ఉంది. ‘జగన్’పై ఉన్న కేసుల దృష్ట్యా అయినా..లేక ఆయనకు అప్పుడు ఉన్న ఆర్థిక అవసరాల రీత్యా అయినా.. ‘జగన్’ వెంటనే దిగివచ్చేవారని, కానీ.. ‘బిజెపి’ పెద్దలు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. అయితే..ఈ విమర్శలు ఎలా ఉన్నా..ఇప్పటికైనా..మళ్లీ రాజధాని పనులు మొదలవుతున్నందుకు కొంత మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జరిగిందేదో..జరిగిపోయింది.. ఇకనైనా.. అడ్డంకులు లేకుండా రాజధాని పనులు పరుగులు తీయాలని భావనలో కొందరు ఉన్నారు. పదేళ్లపాటు..ఆలస్యమైనా..ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుందని, అమరావతే ఆంధ్రా రాజధాని గా చట్టబద్దత ఇస్తుందని, దాని వల్ల ఇక అడ్డంకులు లేకుండా రాజధాని నిర్మాణం జరిగిపోతుందని వారు ఆశిస్తున్నారు. మొత్తం మీద.. ‘మోడీ’ మళ్లీ అమరావతి పనులు మొదలు పెట్టడంపై కొందరు విమర్శలు చేస్తున్నా..మరి కొందరు మాత్రం స్వాగతిస్తున్నారు. అయితే.. ‘జగన్’ వ్యవహారంలో ‘మోడీ’ బృందం చేసింది తప్పేనని మెజార్టీ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.