మీకో రహస్యం చెబుతాః ప్రధాని మోడీ
మీకో రహస్యం చెబుతానంటూ ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. తనను టెక్నాలజీకి ఆద్యుడిగా ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారని, కానీ అది నిజం కాదని తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు హైదరాబాద్లో టెక్నాలజీతో దూసుకుపోతున్నారని, నాడు తాను..ఆయనను అనుసరించడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని పెట్టుకున్నానని మోడీ అమరావతి సభ సాక్షిగా చెప్పారు. టెక్నాలజీ అంటే చంద్రబాబు అని..ఆయననుచూసే తాను నేర్చుకున్నానని, ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నానని చెప్పారు. ఏవైనా పెద్ద పెద్ద పనులు చేయాలంటే చంద్రబాబు వల్లే అవుతుందని, ఆయన చాలా అద్భుతంగా చేస్తారని ప్రశంసించారు. చంద్రబాబు, పవన్ల వల్లే రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని, మనమే చేస్తాం...మనమే చేయాలని ప్రధాని వారిద్దరిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో చంద్రబాబు, పవన్లు ఖుషీ ఖుషీ అయ్యారు. ఎప్పుడూ లేనిది..ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రధాని పదే పదే ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని ప్రశంసలకు చంద్రబాబు ఆనందభరితులయ్యారు. ప్రధాని ప్రశంసినప్పుడల్లా చంద్రబాబు సంతోషంతో చిరునవ్వులు చిందించారు. అత్యంత హుత్సాహభరిత వాతావరణంలో ప్రధాని సభ జరిగింది. అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడుతూ ప్రధాని మోడీ సభికులను ఉత్సాహపరిచారు. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అనువాదం అద్భుతంగా సాగింది. అమరావతి నిర్మాణంలో తన వంతు పాత్రపోషిస్తానని, దేశ అభివృధ్దిలో ఆంధ్రా అభివృద్ధి మరింతగా ఉంటుందంటూ..ప్రధాని భరోసా ఇచ్చారు. అమరావతి ఒక నగరం కాదని, అదొక శక్తి అని, అది ఆంధ్రప్రదేశ్ను ఆధునికశక్తిగా మారుస్తుందని ఆయన అన్నారు. అమరావతి ఇంద్రలోక నగరమని, ఇప్పుడా నగరమే ఆంధ్రుల రాజధాని అయిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దుష్టగ్రహాలన్నీ పారిపోయాయన్నారు. కూటమి ఆంధ్రా అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు.