లేటెస్ట్

అమ‌రావ‌తి స‌భ సూప‌ర్ స‌క్సెస్‌

రాజ‌ధాని అమ‌రావ‌తి పునఃప్రారంభ స‌భ సూప‌ర్ స‌క్సెస్ అయింది. ముందుగా అనుకున్న‌ట్లుగానే ఈ స‌భ విజ‌యవంతం అయింది. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో స‌భ అట్ట‌హాసంగా జ‌రిగింది. రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నుల పునఃప్రారంభానికి భార‌త ప్ర‌ధాని మోడీ రావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం బ్ర‌హ్మాండ‌మైన ఏర్పాట్లు చేసింది. ల‌క్ష‌ల మందిని త‌ర‌లించినా..ఎవ‌రికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లుచేశారు. మోడీ స‌భ కోసం ముందుగానే ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేసి..ఆయ‌న మ‌న‌స్సు చూర‌గొంది. అనుకున్న‌ట్లుగానే అన్నికార్య‌క్ర‌మాలు జ‌రిగిపోయాయి. మధ్యాహ్నం రెండున్న‌ర గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం చేరుకున్న ప్ర‌ధానికి రాష్ట్ర మంత్రులు, శాస‌న‌స‌భ స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి, ప‌లువురు ఎమ్మెల్యేలు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డ నుంచి ఆయ‌న స‌భాస్థ‌లికి చేర‌డం..అక్క‌డ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాన‌వ‌న‌రుల‌శాఖ‌మంత్రి లోకేష్‌, కేంద్ర‌మంత్రులు రామ్మోహ‌న్‌నాయుడు, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌లు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం స‌భ ప్రారంభ‌మైంది. రాజ‌ధాని ప్రాంతంతో పాటు ఇత‌ర జిల్లాల నుంచి ప్ర‌జానీకాన్ని ప్ర‌భుత్వం భారీగా త‌రలించింది. స‌భ‌కు వ‌చ్చిన జ‌నాలు ప్ర‌ధాని మోడీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ప్ర‌సంగాల‌ను ఆస‌క్తిగా విన్నారు. అయితే..రాష్ట్రంపై మోడీ ప్ర‌త్యేక వ‌రాలు ప్ర‌క‌టిస్తార‌ని భావించిన వారికి నిరాశే ఎదురైయింది. కాగా ప్ర‌ధాని మోడీ, రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబులు ఒక‌రిపై ఒక‌రు పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించుకున్నారు. 

ఒక‌రిపై ఒక‌రు పొగ‌డ్త‌ల‌వ‌ర్షం...!

ముందుగా మాట్లాడిన చంద్ర‌బాబు మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఆయ‌న వ‌ల్లే దేశం అభివృద్దిలో ముందంజ‌లో ఉంద‌ని, ఆయ‌న వ‌ల్ల ప్ర‌పంచంలో దేశానికి మంచి గౌర‌వం ద‌క్కుతుంద‌ని, టెక్నాల‌జీకి ఆయ‌నే ఆద్యుడ‌ని, ఆయ‌న నాయ‌క‌త్వంలో ప‌నిచేయ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు. ముఖ్య‌మంత్రి పొగ‌డ్త‌లు మ‌రీ శృతి మించాయ‌ని, ఆయ‌న‌తో ప‌ని ఉంద‌ని, కానీ..మ‌రీ ఇంత‌గా పొగ‌డాల్సిన అవ‌స‌రం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. త‌న‌ను చంద్ర‌బాబు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తార‌ని భావించిన మోడీ అందుకు ప్ర‌తిగా చంద్ర‌బాబుపై ప్ర‌శంశ‌లు కురిపించారు. వీరిద్ద‌రి త‌తంగాన్ని చూసిన కొంద‌రు..ఇద్ద‌రూ..ఇద్ద‌రే అని వ్యాఖ్యానించుకోవ‌డం వినిపించింది. కాగా..రాజ‌ధాని ఇదేన‌ని, ఇది ఇంద్రుని రాజ‌ధాని అని..దీన్ని పూర్తి చేస్తామ‌ని మోడీ ప్ర‌క‌టించ‌డం స‌భ‌కు హాజ‌రైన వారిని ఉత్సాహ‌ప‌రిచింది. అయితే...ఐదేళ్ల పాటు అమ‌రావ‌తిని నాశ‌నం చేసిన జ‌గ‌న్‌పై క‌నీసం ఒక్క మాట కూడా మోడీ మాట్లాడ‌లేదు. ఇది స‌భ‌కు వ‌చ్చిన వారితోపాటు, టిడిపి, జ‌న‌సేన అభిమానుల‌కు నిరాశ‌కు గురిచేసింది. ఇది ఎలా ఉన్నా..మోడీని ఈ స‌భ‌కు ఆహ్వానించి, ఇంత ఖ‌ర్చు చేస్తే చంద్ర‌బాబుకు వ‌చ్చిన లాభం ఏమిట‌నే ప్ర‌శ్న‌లుప‌లువ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి. మోడీ కొత్తగా చేసిందేమీ లేదు..చెప్పిందేమీ లేదు..కేవ‌లం క‌థ‌లు చెప్పేసి వెళ్లిపోయార‌నే విమ‌ర్శ‌లు జోరుగా ఉన్నాయి. ఇలాంటి దాని కోసం ఇన్ని వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేయ‌డం అవ‌స‌ర‌మా..? అనే అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. అయితే ప్ర‌భుత్వ వ‌ర్గాల వాద‌న మ‌రోలా ఉంది. జ‌గ‌న్ ఐదేళ్ల పాటు అమ‌రావ‌తిని నాశ‌నం చేశాడ‌ని, అమ‌రావ‌తి బ్రాండ్‌ను చెడ‌గొట్టాడ‌ని, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాజ‌ధానిలో పెట్టుబ‌డిపెట్టేవాళ్లు ఎవ‌రూ ముందుకు రార‌ని, అమ‌రావ‌తి బ్రాండ్‌ను పెంచ‌డం కోస‌మే ముఖ్య‌మంత్రి అమ‌రావ‌తి స‌భ‌ను అత్యంత గ్రాండ్‌గా చేశారని చెబుతున్నారు. పోయిన బ్రాండ్‌ను రాబ‌ట్టుకోవ‌డం, ముఖ్యంగా పెట్టుబ‌డు దారుల్లో న‌మ్మ‌కం క‌ల్గించ‌డమే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రించార‌ని, అదే స‌మ‌యంలో..ఇదే రాజ‌ధాని అని, ఇక్క‌డ నుంచి భ‌విష్య‌త్తులో రాజ‌ధానిని ఎవ‌రూ త‌ర‌లించ‌లేర‌నే భ‌రోసా ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌డానికే ఈ స‌భ‌ను నిర్వ‌హించార‌ని చెబుతున్నారు. 


అధికారులూ శ‌భాష్‌...!

మొత్తం మీద ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు, మంత్రులు,అధికారులు, పోలీసులు వారాల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డ్డారు. ముఖ్యంగా సీనియ‌ర్ అధికారులు, పోలీసు వ‌ర్గాలు ప్ర‌ధాని స‌భ‌ను విజ‌యవంతం చేడానికి తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డారు.  వారి క‌ష్టానికి ఫ‌లితం ల‌భించింది. స‌భ స‌జావుగా జ‌ర‌గ‌డంతో..వారిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. అన్ని శాఖ‌ల‌కు చెందిన అధికారులు ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం ప‌నిచేసుకుంటూ పోయారు. ఎవ‌రికి అప్ప‌గించిన ప‌నిని వారు త‌మ శ‌క్తిమేర‌కూ నిర్వ‌హించారు. దీంతో వారాల త‌ర‌బ‌డి చేసిన వారి కృషి ఫ‌లించి స‌భ సూప‌ర్ స‌క్సెస్ అయింది. మోడీ సభాస్థ‌లికి చేరే స‌మ‌యానికి ఆకాశం మేఘాలు ప‌ట్టి ఏ నిమిషానైనా భారీ వ‌ర్షం కురుస్తుందేమో.. స‌భ‌కు వ‌చ్చిన ల‌క్ష‌ల మంది ఇబ్బందుల పాల‌వుతార‌మోన‌న్న భ‌యం అధికార‌గ‌ణాన్ని వేధించింది. అయితే వ‌రుణుడు క‌రుణించ‌డంతో.. స‌భ‌కు వ‌చ్చిన వారు, స‌భా నిర్వ‌హ‌కులు ఊప‌రిపీల్చుకున్నారు. మొత్తం మీద‌..వారు పడ్డ క‌ష్టానికి ఫ‌లితాలు ల‌భించ‌డంతో అంద‌రూ హాయిగా క‌ష్టాన్ని మ‌రిచిపోయి సంతోషంగా సేద‌తీరారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ