‘జగన్ గ్యాంగ్’లో మార్పేమీ లేదు...!?
గత ఎన్నికల్లో తమ ఘోర ఓటమికి కారణమైన రాజధాని విషయంలో ‘జగన్ గ్యాంగ్’ పాత పంథానే అనుసరిస్తోంది. ఎన్నికల్లో ఓడి ఏడాది కావస్తున్నా..తమ ఓటమికి కారణమైన విషయాల్లోకి ఈ గ్యాంగ్ వెళ్లడం లేదు. పాత పద్దతుల్లోనే ఆయా విషయాలపై ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. తమను ప్రజలు ఓడించలేదని, ఈవీఎంల వల్లే ఓడామని చెప్పుకుంటూ కార్యకర్తలను, నాయకులను నమ్మించాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని నమ్మడం లేదని ‘చంద్రబాబు’ పలావు పెడతానన్నారు..అందుకే ఆయనకు ఓట్లు వేశారని బొంకుతున్నారు. ఇలా పూటకో మాట చెబుతూ..కాలం గడిపేస్తున్నారే కానీ..తమ ఓటమికి కారణమైన అంశాలపై ఎటువంటి నిర్ణయం, సమీక్షలు చేసుకోవడం లేదు. మూడు రాజధానులంటూ..ఎక్కడా లేని దిక్కుమాలిన విధానాన్ని తీసుకొచ్చి ప్రజల చేతిలో అభాసుపాలయ్యారు. ఆ విషయాన్ని ఇప్పటికీ గ్రహించడం లేదో..లేక..గ్రహించినా..ప్రజలదేముంది..మాయ చేద్దామనే భావనో కానీ, కీలకమైన విషయంలో ఎటువంటి సమీక్ష నిర్వంచుకోవడం లేదు. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని పదే పదే ప్రకటిస్తున్నారు కానీ..రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ఒక విధానాన్ని ప్రకటించడం లేదు.
రాజధాని ‘అమరావతి’ విషయంలో గతంలో అనుసరించిన పిచ్చి వ్యూహాన్నే మళ్లీ అనుసరిస్తున్నారు. ‘అమరావతి’ పునఃప్రారంభ సభ తరువాత ‘వైకాపా’ నేతలు చేస్తోన్న విమర్శలను చూస్తే వాళ్లలో మార్పేమీ లేదని తేలిపోతుంది. మళ్లీ ఆ పాత ఆరోపణలు, విమర్శలే తెరపైకి తెచ్చారు. ‘అమరావతి’ భ్రమరావతి’ అని, వరదతో మునిగిపోతుందని, రాజధానిగా పనికిరాదని, అప్పులు చేసి రాజధానిని నిర్మిస్తున్నారని, రాజధాని రైతులు అమరావతి నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని..ఇలా..గతంలో చేసిన విమర్శలు, ఆరోపణలు మళ్లీ చేస్తున్నారు. వాళ్లు ఇప్పుడు చేస్తోన్న విమర్శలు గత పదేళ్ల నుంచి వస్తోన్నవే. గత ఎన్నికల్లో ఈ ఆరోపణలకు ప్రజలే ఆ మూల నుంచి ఈ మూల దాకా ఒకటే తీర్పు చెప్పారు. మూడు రాజధానులంటే మాడు పగిలే తీరులో తీర్పు ఇచ్చారు. అయినా..మళ్లీ ‘పాడిందే పాటరా...పాసిపళ్లదాసుడా’.. అన్నట్లు అవే ఆరోపణలు చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం నచ్చకే..రాష్ట్ర ప్రజలంతా ఏకమై ‘వైకాపా’ను దారుణంగా ఓడించినా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. జరిగిందేదో..జరిగిపోయింది..అమరావతి పునఃప్రారంభానికి రావాలని ‘జగన్’కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపినా..ఆయన రాకుండా ‘బెంగుళూరు వెళ్లిపోయారు. దీంతోనే..ఆయన తీరు మారలేదని స్పష్టమవుతోంది. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల నాటికి కూడా ‘వైకాపా’ మూడు రాజధానులంటూనే ఎన్నికలకు వెళుతుందనే భావన వ్యక్తం అవుతుంది. అయితే.. మరోసారి వారు కనుక మూడు రాజధానులంటే..2024లో వచ్చిన తీర్పే వస్తుంది. ‘జగన్ గ్యాంగ్’లో మార్పు రాకపోతే..ఇక వాళ్లు ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాల్సి ఉంటుంది.