లేటెస్ట్

‘త‌మ్ముడి’ ప‌త‌న‌మే ధ్యేయ‌మా...!?

అన్న‌ద‌మ్ములంటే.. ‘రామ‌ల‌క్ష్మ‌ణు’ల్లా ఉండాలంటారు..?  అదే విధంగా అన్న‌ద‌మ్ములు ఎలా ఉంట‌కూడ‌దంటే.. ‘రావ‌ణుడు’,  ‘విభీష‌ణుడు’,  ‘వాలి’,  ‘సుగ్రీవుల‌’ను చెబుతారు. వీరిలో మొద‌ట చెప్పుకున్న‌వారు అన్న‌ద‌మ్ముల అనుబంధానికి, త్యాగానికి ప్ర‌తీక‌లైతే..త‌రువాత చెప్పుకున్న‌వారు స్వార్ధానికి ప్ర‌తీక‌లుగా చెప్పుకోవ‌చ్చు.  ‘రామాయణం’లోని అన్న‌ద‌మ్ములు అన్న‌మాట‌ను దాట‌రు..అదే విధంగా.. ‘మ‌హాభార‌తం’లో  ‘పాండ‌వులు’ కూడా  ‘ధ‌ర్మ‌రాజు’ మాట జ‌వ‌దాట‌రు. ఆశ్చ‌ర్య‌క‌రంగా...ఇదే ఇతిహాసంలోని ప్ర‌తినాయ‌కుడు అయిన  ‘దుర్యోధ‌నుడి’ త‌మ్ములు కూడా అన్న‌మాట జ‌వ‌దాట‌రు. తాము అధ‌ర్మంవైపు ఉన్నామ‌ని, యుద్ధంలో తామంతా చ‌నిపోతామ‌ని తెలిసినా..అన్న కోసం..అన్న‌ద‌మ్ముల అనుబంధం కోసం.. యుద్ధంలో చ‌నిపోతారు. భార‌త కుటుంబ వ్య‌వ‌స్థ‌ల్లో అన్నాద‌మ్ముల అనుబంధానికి ఎంతో పేరుంది. ‘అన్నకోసం త‌మ్ముడు’..‘త‌మ్ముడి కోసం అన్న‌లు’..ఎన్నేన్నో త్యాగాలు చేసిన చేసిన సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు? అయితే అంద‌రూ ఇలా ఉన్నార‌ని కాదు కానీ..మెజార్టీ అన్న‌ద‌మ్ములు..సానుకూలంగానే ఉంటారు. ‘అన్న‌కు పేరొస్తే..త‌మ్ముడికి’ వ‌చ్చిన‌ట్లే సంబర‌ప‌డ‌తాడు..అదే ‘త‌మ్ముడికి పేరొస్తే..’అన్న ఆనంద‌ప‌డ‌తారు. అయితే..అన్నిచోట్లా ఇలానే ఉండాల‌ని లేదు. ‘త‌మ్ముడు’ పైకి వ‌స్తే అత‌ని ప‌త‌నం చూడాల‌ని భావించేవారు..‘అన్న‌’పైకి వ‌స్తే..అన్న అంతం చూడాల‌నుకునే వారూ ఉన్నారు. ఒక‌రి పొడ మ‌రొక‌రికి గిట్ట‌దు. ఒక‌రి పెత్త‌నం..మ‌రొక‌రికి న‌చ్చ‌దు. ఇలా ఉన్న అన్నాద‌మ్ములు...చివ‌రికి ఒక‌రు అంతు ఒక‌రు చూసుకుని స‌మాజంలో ఎక్క‌డ లేని అప్ర‌దిష్ట కొని తెచ్చుకుంటారు. ఇలా అప్ర‌దిష్ట పాల‌వుతున్నారు విజ‌య‌వాడ‌కు చెందిన ‘కేశినేని బ్ర‌ద‌ర్స్‌’.  విజ‌య‌వాడ ఎంపి ‘కేశినేని శివ‌నాథ్‌’పై మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఆయ‌న సోద‌రుడు ‘కేశినేని నాని’ స్వంత త‌మ్ముడిపై అవినీతిపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ‘విజ‌య‌వాడ’ ఎంపిగా గెలిచిన ‘కేశినేని చిన్ని’ అవినీతికి అంతేలేకుండా పోతుంద‌ని, ఆయ‌న అనేక అక్ర‌మ‌వ్యాపారాలు నిర్వ‌హిస్తున్నార‌ని, దేశ‌ద్రోహానికి పాల్ప‌డుతున్నార‌ని, మ‌నీలాండ‌రింగ్‌కు, అక్ర‌మ‌మ‌ద్యం కేసుల్లో అరెస్టు అయిన వారితో సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోపిస్తున్నారు. కేవ‌లం ఆరోప‌ణ‌లే కాదు...దీనిపై ప్ర‌ధాని మోడీ, కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి, సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ఫిర్యాదు చేస్తున్నారు. 


అన్నాద‌మ్ములైన వీరి మ‌ధ్య ఇటువంటి పోరు చూసి ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వీళ్లు అన్న‌ద‌మ్ములా..ఆగ‌ర్భ‌శ‌త్రువులా..అని చ‌ర్చించుకుంటున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల వ‌ర‌కూ..వీరిద్ద‌రూ ఎలా ఉండేవారో..పెద్ద‌గా ఎవ‌రికీ తెలిసేది కాదు. అప్ప‌ట్లో  ‘టిడిపి’ ఎంపిగా ఉన్న  ‘కేశినేని నాని’ టిడిపిని వీడి  ‘వైకాపా’లో చేర‌డం..ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా  ‘కేశినేని శివ‌నాథ్’ పోటీ చేయ‌డం..రికార్డు మెజార్టీతో గెల‌వ‌డం.. వ‌రుస‌గా జ‌రిగిపోయాయి. ఈ ఎన్నిక‌ల త‌రువాత వైకాపాలో ఉన్న  ‘కేశినేని నాని’ తాను రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మిస్తున్నాన‌ని ఇక ఏ పార్టీలో చేర‌న‌ని ప్ర‌క‌టించారు. అయితే..ఆయ‌న రాజ‌కీయాల నుంచి వైదొలుగుతున్నాన‌ని ప్ర‌క‌టించిన త‌రువాత‌..విజ‌య‌వాడ ఎంపి  ‘చిన్ని’ మీద వ‌రుస‌గా అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ముందుగా   ‘ఉర్సా’కు భూముల కేటాయింపు విష‌యంలో అవినీతి జ‌రిగింద‌ని దానికి విజ‌య‌వాడ ఎంపి  ‘కేశినేని చిన్ని’ కార‌ణ‌మంటూ..ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ విషయాన్ని వైకాపా ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఎక‌రం భూమి కేవ‌లం 99పైస‌ల‌కే ఇచ్చార‌ని, దీనిలో మూడు వేల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని, దీనికి  ‘లోకేష్‌’, కేశినేని చిన్ని కార‌ణ‌మంటూ..విమ‌ర్శ‌లు గుప్పించింది. దీనిపై  ‘కేశినేని చిన్ని’ త‌న సోద‌రుడు నాని’పై రూ.100కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లు చేశారు. అయితే.. ఇటువంటి వాటికి తాను బెద‌ర‌నని చెబుతూ ఈ రోజు మ‌ద్యం కేసులో అరెస్టు అయిన  ‘క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి’తో  ‘కేశినేని చిన్ని’కి సంబంధాలు ఉన్నాయ‌ని, ఇద్ద‌రూ క‌లిసి అక్ర‌మ వ్యాపారాలు చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. దీంతో..ఇది రాష్ట్ర వ్యాప్త చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. 


అసలు ఎందుకు ‘నాని’ ఈ విధంగా స్వంత సోద‌రుడ్ని వీధిలోకి లాగుతున్నారు. అవినీతిని స‌హించ‌లేని త‌త్వ‌మా..? స‌మాజానికి మేలు చేయాల‌నా..?  లేక స్వంత సోద‌రుడ్ని రాజ‌కీయంగా దెబ్బ‌తీసి తాను రాజ‌కీయంగా బ‌ల‌ప‌డాల‌నే కోరిక‌తోనే ఇలా చేస్తున్నారా..? అయితే..అవినీతిపై  ‘కేశినేని నాని’కి మాట్లాడే అర్హ‌త‌లేద‌ని, ఆయ‌న ఎప్పుడైతే  ‘జ‌గ‌న్’ పంచ‌న చేరాడో..అప్పుడే ఆయ‌న అవినీతి గురించి మాట్లాడే అర్హ‌త కోల్పోయారని టిడిపి నేత‌లు అంటున్నారు. అయితే ఆయ‌న ఇలా త‌మ్ముడి అంతు చూడ‌డానికి ప్ర‌ధాన కార‌ణం..త‌మ్ముడు రాజ‌కీయంగా ఎదుగుతున్నార‌నే దుగ్ధేన‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌తంలో ఈ ఇద్ద‌రి మ‌ధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో కానీ..గ‌త ఎన్నిక‌ల ముందు బాగా క్షీణించాయి.  ‘కేశినేని శివ‌నాథ్’ టిడిపి యువ‌నాయ‌కుడు  ‘లోకేష్‌’ను క‌లిసి త‌న‌కు  ‘విజ‌య‌వాడ సీటు అడిగిన త‌రువాత నుంచే వీరి మ‌ధ్య అగాధం ఏర్ప‌డింద‌నే అభిప్రాయాలున్నాయి. త‌న‌ను ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం  ‘టిడిపి’ నుంచి  ‘శివ‌నాథ్’,  ‘లోకేష్‌’లు బ‌య‌ట‌కు పంపించి విజ‌య‌వాడ సీటు త‌మ్ముడు కొట్టేశాడ‌నే అభిప్రాయం ఆయ‌న‌లో ఉందంటారు ఆయ‌న ద‌గ్గ‌రివాళ్లు. అది కొంత‌వ‌ర‌కూ నిజ‌మే కానీ.. ‘కేశినేని నాని’ ప్ర‌వ‌ర్త‌న బాగా లేక‌నే ఆయ‌న‌ను టిడిపి వ‌దిలించుకుంద‌నే వాళ్లూ ఉన్నారు. అయితే..ఇలా జ‌ర‌గ‌డానికి  ‘చిన్ని’, లోకేష్‌లే కార‌ణం కనుక వారిపై అవినీతి ఆరోప‌ణ‌ల‌ను ఎడాపెడా చేసి..వారిని ప‌లుచ‌న చేయాల‌నే వ్యూహంతో.. ‘నాని’ ఉన్నారంటున్నారు. అందుకే ముందుగా వైకాపా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని, అక్క‌డే ఉండి ఆరోప‌ణ‌లు చేస్తే..అవి జ‌నంలోకి అంత‌గా వెళ్ల‌వు క‌నుక ఏ పార్టీతో సంబంధం లేదంటూ ఇలా ర‌చ్చ ర‌చ్చ చేసి త‌మ్ముడి అంతు చూస్తున్నార‌ని, అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు అండ‌గా ఉన్న  ‘లోకేష్’ సంగ‌తి చూడాల‌నే ల‌క్ష్యంతో ఆయ‌న ఉన్నారంటున్నారు. మొత్తం మీద త‌మ్ముడి అంతు చూసేవ‌ర‌కూ అన్న ఊరుకునేలాలేడ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ