లేటెస్ట్

స‌మ‌రోత్సాహంలో ‘భారత్‌’...!

‘ప‌హ‌ల్గాం’ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌న్న‌ యావ‌త్ భార‌త‌దేశ వాసుల‌ కోరిక‌ను భార‌త్ సైన్యం నెర‌వేర్చింది. బుధ‌వారం వేకువ‌ఝామున  ‘పాక్‌’లోని ఉగ్ర‌శిబిరాల‌పై భార‌త సైన్యం మెరుపుదాడులు చేసింది. ఈ వార్త తెలిసివెంట‌నే భార‌త్‌లో ఆనందోత్స‌హాలు నెల‌కొన్నాయి. దేశంలోని ప్ర‌తి ఒక్క‌రూ ఈ దాడుల‌ను స‌మ‌ర్ధించారు. ముష్క‌ర‌మూక‌ల‌కు భార‌త సైన్యం స‌రైన బ‌దులు తీర్చుకుంద‌నే భావ‌న దేశ‌మంతా వ్య‌క్తం అవుతోంది. వారికి స‌రైన గుణ‌పాఠం నేర్పాల‌ని, ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తోన్న ‘పాకిస్తాన్‌’పై దాడులు చేయాల‌ని భార‌త ప్ర‌భుత్వంపై గ‌త ప‌క్షం రోజుల నుంచి ఒత్తిడి వ‌స్తోంది. ‘కాశ్మీర్‌’లోని ‘ప‌హ‌ల్గాం’లో ప‌ర్యాట‌కుల‌ను మ‌తం పేరు అడిగి ఉగ్ర‌వాదులు చంపేయ‌డం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడి త‌రువాత దేశ ప్ర‌జ‌లు ‘పాకిస్థాన్‌’పై దాడులు చేయాల‌ని, ‘పాకిస్థాన్‌ను యుద్ధంలో ఓడించి, ఆక్ర‌మిత ‘కాశ్మీర్‌’ను స్వాధీనం చేసుకోవాల‌ని, ‘పాకిస్థాన్‌’ను మ‌ళ్లీ లేవ‌కుండా కొట్టాల‌ని ఇలా ప‌లువిధాలైన డిమాండ్లు దేశ వ్యాప్తంగా వ‌చ్చాయి. అయితే భార‌త ప్ర‌భుత్వం ఆచితూచి స్పందించింది. ఉగ్ర‌దాడుల‌పై స‌రైన స‌మ‌యంలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, తొంద‌ర‌ప‌డ‌డం లేద‌నే భావ‌న‌ను బ‌య‌ట‌కు పంపుతూ చేయాల్సిన ప‌నులు రెండో కంటికి తెలియ‌కుండా చేసుకుంటూ వ‌చ్చింది. గ‌తానికి విరుద్ధంగా ఉగ్ర‌వాదుల మూక‌పై చ‌టీచ‌ప్పుడు లేకుండా దాడి చేసి ప్ర‌తీకారం తీర్చుకుంది.

వాస్త‌వానికి ఉగ్ర‌దాడి జ‌రిగిన త‌రువాత భార‌త ప్ర‌భుత్వం భారీ ఎత్తున చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, ‘పాకిస్థాన్‌’పై నేరుగా యుద్ధానికి దిగుతుంద‌నే భావ‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. అయితే..నేరుగా ‘పాకిస్థాన్‌’పై దాడులు చేస్తే..అంత‌ర్జాతీయంగా ఇబ్బందులు వ‌స్తాయ‌న్న భావ‌న‌తో ప‌రిమిత దాడుల‌కు ప్ర‌భుత్వం సైన్యానికి అనుమ‌తి ఇచ్చింది. ప్ర‌భుత్వ అనుమ‌తితో సైన్యం త‌న‌ప‌ని పూర్తి చేసుకుంది. అయితే ఈ దాడి త‌రువాత భార‌త్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల దేశ వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఎవ‌రిని క‌దిలించినా..ప్ర‌భుత్వం మంచిప‌నే చేసింద‌నే చెబుతున్నారు. ఇక సోష‌ల్ మీడియ‌లో అయితే..భార‌త సైన్యానికి, ప్ర‌భుత్వానికి భారీగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ప్ర‌తి ఒక్క‌రూ హిందుస్థాన్ జిందాబాద్‌..అనే పోస్టుల‌తో హోరెత్తిస్తున్నారు. ప్ర‌త్యేకంగా భార‌త సైన్యానికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రిలో స‌మ‌రోత్సాహం ర‌గులుతోంది. యువ‌తీయువ‌కులు, మ‌ధ్య‌వ‌య‌స్కులు, వృద్ధులు..ఇలా ప్ర‌తి ఒక్క‌రూ దేశ‌భ‌క్తితో ఉర‌క‌లెత్తుతున్నారు. నిన్న మొన్న‌టి దాకా..‘మోడీ’ ప్ర‌భుత్వానికి, ‘మోడి’కీ, వ్య‌తిరేకంగా మాట్లాడిన, న‌సిగిన  వాళ్లూ కూడా ఇప్ప‌డు దేశానికి మ‌ద్ద‌తు ఇస్తోన్నారు. ‘పాకిస్థాన్’ అంతు చూడాలంటూ పోస్టులు పెడుతున్నారు. 

‘పాక్‌’ను మూడు ముక్క‌లు చేయాలి...!

కాగా ‘పాకిస్థాన్‌’పై ‘భార‌త్’ వెంట‌నే దాడి చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాల‌ని కొంద‌రు కోరుతుండ‌గా, మ‌రి కొంద‌రు ‘పాకిస్థాన్‌’ను మూడు ముక్క‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ‘పాకిస్థాన్’ బుద్ది మార‌ద‌ని, ఆ దేశం ఎప్పుడూ ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తు ఇస్తూనే ఉంటుంద‌ని, భార‌త సైన్యం ‘లాహోర్’ దాకా..దూసుకెళ్లి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని ‘భార‌త్‌’లో క‌లిపేసుకోవాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తుండ‌గా..మ‌రి కొంద‌రు మాత్రం ‘ఆక్ర‌మిత కాశ్మీర్‌’ను ‘భార‌త్‌’లో క‌లిపేసుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని..వెంటే ఇది చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ‘పాకిస్థాన్’ ప‌రిస్థితి అత్యంత దారుణంగా ఉంద‌ని, ‘మోడీ’ క‌నుక ఆక్ర‌మిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటే..ఏళ్ల త‌ర‌బ‌డి ఉన్న స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని, ఈ ప‌రిస్థితుల్లో ‘పాకిస్థాన్’ సుధీర్ఘ యుద్ధం చేయ‌లేద‌ని, మ‌హా అయితే..వారం ప‌ది రోజుల్లో యుద్ధం పూర్తి అవుతుందంటున్నారు. కాగా మ‌రి కొంద‌రు మాత్రం పూర్తిస్థాయి యుద్ధం చేసి ‘పాక్‌’ను మూడు ముక్కులుగా చేయాలంటున్నారు. ఇప్ప‌టికే ‘పాకిస్థాన్’ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంద‌ని ‘బ‌లుచిస్థాన్’ వేర్పాటువాదులు ప్ర‌త్యేకదేశం కోసం పోరాడుతున్నార‌ని, పూర్తిస్థాయి యుద్ధం జ‌రిగితే ‘బ‌లుచిస్థాన్’ ‘భార‌త్‌’వైపే ఉంటుందంటున్నారు. ఇక మ‌రోవైపు ‘ఆఫ్గ‌నిస్థాన్ తాలీబాన్లు’ మ‌రోవైపు నుంచి ‘పాకిస్థాన్‌’పై దాడులు చేస్తున్నార‌ని ఈ ప‌రిస్థితుల్లో ‘పాక్‌’ను మూడు ముక్క‌లు చేయ‌డం సుల‌వువుతుందంటున్నారు. అయితే..అంత‌ర్జాతీయ ఒత్తిడి త‌ట్టుకుని ‘భార‌త ప్ర‌భుత్వం’ ఈ ప‌నిచేయ‌గ‌లుగుతుందా..? అణుసామ‌ర్థ్యం ఉన్న ‘పాకిస్థాన్‌’ను మూడు ముక్క‌లుగా విడ‌గొట్ట‌డం..అంత సులువైన చ‌ర్య కాదంటున్నారు. మొత్తం మీద‌..ప‌రిమిత స్థాయిలో జ‌రిగిన ఈ దాడులు..పూర్థిస్థాయి యుద్ధంగా మారుతుందా..?  లేక స్ప‌ల్ప‌స్థాయిలో ముగిసిపోతుందా..? అనేది త్వ‌ర‌లో తేలుతుంది. విభిన్న‌భాష‌లు, సంస్కృతులు, జాతులు ఉన్న ‘భార‌త్‌’లో..యుద్ధ‌మేఘాలు ముసిరిన వేళ దేశ‌వాసులంతా ఒకేబాట‌లోకి రావ‌డం..దేశాభిమానుల‌కు ఆనందోత్సాహాల‌ను క‌ల్గిస్తోంది. స‌మ‌స్య‌లు ఎన్ని ఉన్నా..మ‌న‌లో మ‌నం ఎన్ని గొడ‌వ‌లు ప‌డ్డా...ఎంత త‌న్న‌కున్నా.. ప్ర‌త్య‌ర్థులు ‘భార‌త్‌’పై దాడి చేస్తే..మాత్రం మేమంతా ఒకేమాట మీద ఉంటామ‌నే మ‌రోసారి భార‌తావ‌ని చాటింది. జైహో భార‌త్‌...!

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ