ఏడాదిపాటు జగన్ బస్సుయాత్ర...!
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఏడాది పాటు బస్సుయాత్ర నిర్వహించబోతున్నాట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి గురైన ఆయన ఇప్పుడిప్పుడే ఆ పరాభవాన్ని మరిచిపోయి వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి ఆయన యత్నిస్తున్నారు. అయితే.. ఏడాదిన్నర నుంచి కూటమి ప్రభుత్వం ఆయనకు ఎటువంటి అవకాశాలు ఇవ్వడం లేదు. ఓడి తరువాత ఆయనకు కొన్నే అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం విషయంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం నిర్మించాల్సిన మెడికల్ కళాశాలలను ప్రవేట్ సంస్థలకు కట్టబెట్టడంపై ఆయన పార్టీ కోటి సంతకాల సేకరణను నిర్వహించింది. అది తప్ప ఈ ఏడాదిన్నరలో ఆయన చేసిందేమీ లేదు. అప్పుడప్పుడు బెంగుళూరు నుంచి విజయవాడకు వచ్చి సుధీర్ఘ ప్రెస్మీట్ నిర్వహించడం, దానిలో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం తప్ప మరేమీ చేయడం లేదు. ఆయన ప్రెస్ మీట్ వల్ల పార్టీకి మైలేజ్ రాకపోగా..లేని కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. ఈయన ప్రెస్మీట్ నిర్వహించిన ప్రతిసారీ..అధికారపార్టీకి ఏదో ఒక ఆయుధాన్ని అందిస్తున్నారని, ఆయన ప్రెస్మీట్లు పెట్టకపోతేనే మంచిదనే అభిప్రాయం వారిలో ఉంది. అయితే..నేరుగా ఆయనకు ఎవరూ చెప్పలేక..మౌనంగా భరిస్తున్నారు. అయితే...జగన్ ప్రజల్లో ఉంటే పార్టీకి మేలు జరుగుతుందని, నేరుగా ఆయన ప్రజల మధ్యకు వెళ్లాలని వారు కోరుకుంటున్నారు. తాను త్వరలో పాదయాత్ర చేస్తానని ఆయన పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. కానీ..దానికి చాలా సమయం పడుతుందని, ఆలోపు ప్రజలను కలుసుకునేందుకు ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని వారు కోరుతుండడంతో ఇప్పుడు బస్సుయాత్ర నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారంటున్నారు. అయితే..ఇది ఏడాదిపాటు సాగుతుందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ జనవరిలోనే ఆయన ఈ బస్సు యాత్రను ప్రారంభించాలి. అయితే..ఎందుకో అది వాయిదా పడింది. అయితే..ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ యాత్ర ఉంటుందంటున్నారు. తమ నేత రోడ్డు మీదకు వస్తే ప్రజలు తండోపతండాలుగా వస్తారని, అదే ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తుందనే భావన వైకాపాలో ఉంది. ఇప్పటికే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్తో పాటు, ఆయన పార్టీ నేతలూ విశ్వసిస్తున్నారు.