అందరి దృష్టీ.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్పైనే...!
దాయాది దేశాల మధ్య నేడు కొలంబోలో జరగబోతోన్న 20ట్వంటీ మ్యాచ్పై భారీ ఆసక్తి ఏర్పడింది. మహాశివరాత్రి కావడంతో పాటు, ఆదివారం కూడా కలిసిరావడంతో ఈ మ్యాచ్పై ప్రేక్షకులు మరింత ఆసక్తిని చూపిస్తున్నారు. చాలా రోజుల తరువాత భారత్, పాకిస్థాన్ ముఖాముఖి తలపడనుండడంతో..క్రికెట్ ప్రేమికులు దీని కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి అసలు ఈ మ్యాచ్ జరుగుతుందో లేదోనని నిన్న, మొన్నటి దాకా సందేహాలు నెలకొన్నాయి. అయితే ఐసిసి దౌత్యంతో ఈ మ్యాచ్ జరగడానికి మార్గం ఏర్పడింది. తొలుత భారత్లో జరుగుతోన్న ఈ ప్రపంచ కప్లో తాము పాల్గొనమని బంగ్లాదేశ్ ప్రకటించడం, దానికి పాకిస్థాన్ మద్దతు ఇస్తూ..కొలంబోలో జరిగే మ్యాచ్లో తాము పాల్గొనమని ప్రకటించింది. అయితే..అనూహ్య పరిస్థితుల్లో ఆఖరు నిమిషంలో ఈ మ్యాచ్కు పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించింది. మ్యాచ్ ఆడకపోతే భారీగా జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో పాటు, ఆర్థికంగా నష్టపోతామని శ్రీలంక బోర్డు పాకిస్థాన్తో చేసిన విన్నపాలు...చివరకు ఫలించాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జరగబోతోన్న ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్ క్రికెట్ అభిమానులు పాకిస్థాన్నుమరోసారి ప్రపంచ కప్లో ఓడించాలని ఆశిస్తున్నారు. ప్రపంచ కప్లో భారత్-పాకిస్తాన్లు 9సార్లు తలపడగా, భారత్ 8సార్లు విజయం సాధించగా, పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. అయితే..అనిశ్చితికి మారుపేరైన 20ట్వంటీ మ్యాచ్ల్లో ఏదైనా జరగవచ్చు. స్పిన్కు సహకరించే కొలంబో పిచ్పై పాకిస్థాన్ స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత సులువైన పనేం కాదు. అయితే..భారత్ బ్యాట్స్మెన్ ఉన్న ఫామ్లో పాకిస్థాన్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. భయంకరమైన భారత్ బ్యాట్స్మెన్ను ఆపడం పాకిస్తాన్ స్పిన్నర్లతో అయ్యే పనికాదనే అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ శివరాత్రి రోజున శివయ్య భక్తులతో పాటు, క్రికెట్ ప్రేమికులు రాత్రంతా జాగారం చేస్తూనే ఉంటారు.