అప్పట్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానుః చాహల్
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తాను ప్రముఖ నర్తకి మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మతో విడిపోవడం పై తొలిసారి స్పందించాడు. విడాకుల వెనుక ఉన్న భావోద్వేగ కారణాలను వెల్లడించాడు. తాజాగా ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న చాహల్ మాట్లాడుతూ, వారి వివాహ జీవితంలో సమస్యలు ఒక్కసారిగా మొదలుకాలేదని, ఇది చాలా కాలంగా కొనసాగుతోందని చెప్పాడు. “ఇది చాలా కాలంగా సాగుతోంది,” అని పేర్కొన్న ఆయన, దాదాపు రెండు సంవత్సరాలుగా సంబంధం బాగా గందరగోళంగా ఉందని తెలిపారు. ఇటువంటి సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తాము “సాధారణ జంట”లా కనిపించినా, అంతర్గతంగా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి అని చెప్పారు. చాహల్ మాట్లాడుతూ, తమ వ్యక్తిగత జీవితంపై వచ్చిన ప్రచారం, ముఖ్యంగా మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని వివరించాడు. “నిజం మీకు తెలుసు, కానీ అటువంటి ఆరోపణలు చదవడం… అది లోపలినుండి నన్ను కలిచి వేస్తోంది,” అని అన్నారు. ఆ సమయంలో తాను డిప్రెషన్కు లోనై, ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించానని విచారంగా వెల్లడించాడు. తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా..అవి నెరవేరలేదని, ముఖ్యంగా ఎక్కడ నివాసం ఉండాలనే దానిపైనే సమస్య జఠిలం అయిందని ఆయన పేర్కొన్నారు. ధనశ్రీ తన వృత్తి కోసం ముంబయికి వెళ్ళాలనుకుంది కానీ చాహల్ మాత్రం కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు, మరియు తన క్రికెట్ కమిట్మెంట్స్ కోసం గురుగ్రామ్లో ఉండాలని అనుకున్నాడు. వీరికి మార్చి 20న విడాకులు మంజూరు అయ్యాయి. చాహల్ ఆమెకు రూ. 4.75 కోట్ల భరణం చెల్లించాల్సి వచ్చిందని, అందులో ఇప్పటివరకు రూ. 2.37 కోట్లు ఇప్పటికే చెల్లించాడని వెల్లడించారు. ప్రస్తుతం తాను మెల్లగా మానసికంగా కోలుకుంటున్నానని, తన పని మరియు భవిష్యత్తుపై దృష్టి పెడుతున్నానని ఆయన చెప్పారు.