అప్పుడు రామ్‌గోపాల‌వ‌ర్మ‌...ఇప్పుడు దేవ‌క‌ట్టా...!?

11, Aug 2025

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా..సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన కొంత మంది ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడుపై విమ‌ర్శ‌నాత్మ‌క లేక జుగ్బుసాక‌ర చిత్రాలు తీస్తూనే ఉన్నారు. వైకాపా అధికారంలో ఉన్న‌ప్పుడు టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడును, ఆయ‌న కుమారుడు లోకేష్‌, వాళ్ల సామాజిక‌వ‌ర్గాన్ని కించ‌ప‌రుస్తూ ప‌లు చిత్రాల‌ను వైకాపా మ‌ద్ద‌తుదారులు తీసి ప్ర‌జ‌ల్లోకి వాళ్ల‌ను కించ‌ప‌ర్చ‌డానికి య‌త్నించారు. అప్ప‌ట్లో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ దారుణాతి దారుణంగా వీళ్ల‌ద్ద‌రినీ కించ‌ప‌ర్చాడు. వీరితో పాటు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను కూడా టార్గెట్ చేస్తూ ప‌లు చిత్రాల‌ను నిర్మించారు. అప్ప‌టంటే..వైకాపా అధికారంలో ఉంది క‌నుక‌..వాళ్ల ఇష్టారాజ్యంగా చంద్ర‌బాబును, ఆయ‌న కులాన్ని దూషిస్తూ, ఆయ‌న ప్ర‌త్య‌ర్థి అయిన వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని, ఆయ‌న కుమారుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిల‌ను హీరోలంటూ..చిత్రాల‌ను జ‌నాల మీద‌కు వ‌దిలేవాళ్లు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తూ..వారిని హీరోలుగా, చంద్ర‌బాబును విల‌న్‌గా పేర్కొంటూ ప్ర‌జ‌ల మ‌న‌స్సులో విష‌బీజాలు నాట‌డానికి వాళ్లు త‌మ వంతు పాత్ర పోషించారు. తాజాగా దేవ‌క‌ట్టా అనే ద‌ర్శ‌కుడు తీసిన మ‌య‌స‌భ వెబ్‌సీరిస్‌ కూడా అదే విష‌బీజాల‌ను నాట‌డానికే..నిర్మించార‌ని టిడిపి కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న షో మ‌య‌స‌భ‌లో రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, ఆయ‌న తండ్రి రాజారెడ్డిలు ఉదాత్త‌మైన వ్య‌క్తులుగానూ, చంద్ర‌బాబును క్యారెక్ట‌ర్ లేని వ్య‌క్తిగా అబూత‌క‌ల్ప‌ల‌ను జోడించి...లేనివి ఉన్న‌ట్లు క‌థ‌లు అల్లార‌ని వారు ఆరోపిస్తున్నారు. చంద్ర‌బాబుకు ఓ మ‌హిళ‌కు ప్రేమికుల‌న్న‌ట్లు..ఆయ‌న క‌డు పేద‌రికంలో ఉన్న‌ట్లు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆయ‌న ఎమ్మెల్యే కావ‌డానికి స‌హ‌క‌రించిన‌ట్లు, ఎన్నిక‌ల్లో 300ఓట్ల‌తోనే చంద్ర‌బాబు గెలిచిన‌ట్లు, అలా గెల‌వ‌డానికి కుయుక్తులు చేశాడ‌న్న‌ట్లు ఇలా ఒక‌టేమిటి..? ఎన్నో అస‌త్యాలు, అర్థ‌స‌త్యాల‌తో చంద్ర‌బాబు వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచే విధంగా ఈ సిరీస్‌ను వండివార్చారు.


చంద్ర‌బాబుకు స్వ‌తాగా నాయ‌క‌త్వ‌పు ల‌క్ష‌ణాలు లేన‌ట్లు, వ్య‌క్తిగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ లేన‌ట్లు ప్ర‌జ‌లు భావించాల‌నేది ఈ చిత్ర ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌.  ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ఏదో విధంగా చంద్ర‌బాబు కించ‌ప‌ర్చ‌డానికి, అదే స‌మ‌యంలో వై.ఎస్‌ను ఆయ‌న తండ్రిని ఉదాత్తులుగా చూపించ‌డానికి తెగ‌య‌త్నించారు. క‌రుడుగ‌ట్టిన ఫ్యాక్ష‌న్ లీడ‌ర్లు అయిన వారిని హీరోలుగా చూపించ‌డం ఏమిటి..? ఈ సిరీస్‌లో వీరి కుటుంబాన్ని ఎంత‌గా హైలెట్ చేశారంటే...1978 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాత కాంగ్రెస్ త‌రుపున దాదాపు 30మంది ఎమ్మెల్యేలు గెలిస్తే..ఈ సిరీస్ లో మాత్రం కేవ‌లం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఒక్క‌డే గెలిచాడ‌ని,అందుకే ఇందిరా కాంగ్రెస్‌లో చేరార‌ని ప‌చ్చి అబ‌ద్దాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. వైకాపా అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ త‌న‌ను తాను హైలెట్ చేసుకోవ‌డానికి రామ్‌గోపాల‌వ‌ర్మ‌ను ఉప‌యోగించుకున్నారు. ఇప్పుడు ఈ దేవ‌క‌ట్టా అనే అత‌న్ని..వాడుకుంటూ..రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందేందుకు య‌త్నిస్తున్న‌ట్లుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఘోర‌మైన ప‌రాజయంతో ఇక ఇప్ప‌ట్లో త‌న‌ను న‌మ్మ‌ర‌ని భావించిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం మ‌ళ్లీ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని ప్ర‌మోట్‌చేస్తున్న‌ట్లున్నారు. దానికి ఈ మ‌య‌స‌భ వెబ్ సిరీస్‌ను ఎంచుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని ప్ర‌జ‌ల ముందు పెట్టి...తాను చేసిన అవినీతి, అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లు మ‌రిచిపోయేలా చేయాల‌న్న‌దే ఆయ‌న ల‌క్ష్యం కావ‌చ్చు. ఒక‌వైపు త‌న తండ్రిని ప్ర‌మోట్ చేసుకుంటూ..మ‌రోవైపు త‌న తండ్రి ప్ర‌త్య‌ర్థి, త‌న ప్ర‌త్య‌ర్థి అయిన చంద్ర‌బాబుపై విషం చిమ్మ‌డ‌మే ఆయ‌న ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. మొత్తం మీద ఇటువంటి షోల విష‌యంలో...టిడిపి అప్ర‌మ‌త్త‌తో ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. చాప కింద నీరులా...చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడిపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రావాల‌నే ల‌క్ష్యంతో తీస్తోన్న ఇటువంటి షోల విష‌యంలో  క‌ఠినంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. 


(3)
(0)

Comments


  • 2025-08-15 05:12:24

కరెక్ట్ గా చెప్పారు సార్

(0)
(0)