రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఈ వయస్సును మరో ఏడాది పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 58 ఏళ్లుగా ఉన్న రిటైర్మెంట్ వయస్సును 60 సంవత్సరాలకు పెంచారు. తరువాత ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దాన్ని 62 సంవత్సరాలు చేశారు. తాజాగా ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు మరోసారి రిటైర్మెంట్ వయస్సును మరో ఏడాది పెంచాలని భావిస్తున్నారని, దీనిపై సుధీర్ఘంగా అధికారులతో ఆయన చర్చిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే..దీనిలో నిజమెంతో తెలియదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక మరోసారి ఉద్యోగుల రిటైర్ వయస్సును పెంచితే..నిరుద్యోగుల నుండి వ్యతిరేకత తప్పదు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు లభించక నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ ఏజ్ పెంచితే..వారి నుంచి తీవ్ర నిరసనతో పాటు, ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. కాగా..ఇప్పటికే 62 ఏళ్ల వయస్సులో ఉద్యోగులు పనిచేయలేకపోతున్నారు. అనారోగ్య సమస్యలతో వారు..తమకు కేటాయించిన పనుల్లో చురుగ్గా ఉండలేకపోతున్నారనే విమర్శ ఉంది. మొత్తం మీద..ఉద్యోగుల రిటైర్ వయస్సును మరోసారి ప్రభుత్వం పెంచితే..అటు ఉద్యోగుల నుంచి ఇటు నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తం అవడం ఖాయం. కాగా..ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేకనే మరోసారి ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.