అరాచకానికి, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కల్తీమద్యం కేసులో ఆయనను ఈ రోజు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో అరెస్టు అయిన అద్దేపల్లి జనార్థన్రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరాచక జోగి అరెస్టు జరిగింది. చిత్తూరు జిల్లా ములకలచెరువులో జయచంద్రారెడ్డి సాయంతో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నామని, 2023లో జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో ఈ వ్యాపారాన్ని విస్తృతం చేశామని జనార్థన్రావు తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. దీని ఆధారంగానే పోలీసులు జోగి రమేష్ను అరెస్టు చేశారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు గత కొన్నాళ్లుగా జోగి రమేష్ రకరకాలు ఎత్తులు వేస్తున్నారు. తనకు కల్తీ మద్యంతో సంబంధం లేదని, జనార్థన్రావు ఎవరో తనకు తెలియదని, రాజకీయ కక్షతోనే టిడిపి నేతలు ఇలా చేస్తున్నారని ఆయన ఎదురుదాడి చేస్తున్నారు. అంతేనా..టివి9 రజనీకాంత్ సలహాతో విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరకు వెళ్లి ప్రమాణం చేశారు. తనకు కల్తీ మద్యంతో సంబంధం లేదని ఆయన అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి రసవత్తర డ్రామాను నడిపారు. అయితే..కల్తీమద్యం కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ఈ కేసులో సాక్ష్యాధారాలతో ఆయనను అరెస్టు చేశారు. కల్తీ మద్యం కేసులో ఆయన పాత్రపై జనార్థన్రావు ఇచ్చిన సమాచారాన్ని వీడియో తీయించి సాక్ష్యాలను బలంగా తయారు చేసిన తరువాతే జోగి రమేష్ను అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గతంలో ఆయన చేసిన అరాచకాలకు ఆయనను అరెస్టు చేస్తారని భావించారు. అయితే.. గత అరాచకాల జోలికి కూటమి ప్రభుత్వం వెళ్లలేదు. అయితే ఈ లోపే కల్తీ మద్యం వ్యవహారంలో..కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ధ్యేయంతో తన అనుచరులతో కల్తీ మద్యం తయారు చేయించి, వాటిని అమ్మించిన రమేష్ మళ్లీ వాటిని పట్టించి కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అమ్ముతోందని వైకాపా మీడియాలో గగ్గోలు పెట్టించారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు చిర్రెత్తింది. అప్పటి వరకూ..జోగి విషయంలో పట్టీపట్టనట్లు ఉన్న ప్రభుత్వ పెద్దలు ఈ కల్తీ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. దీంతో..జోగి ఓవర్ యాక్షన్తో అడ్డంగా దొరికిపోయారు. గతంలో మంత్రి పదవి కోసం అప్పటి ప్రతిపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై జోగి రమేష్ వందల సంఖ్యలో అనుచరులను వెంటపెట్టుకుని దాడికి వెళ్లారు. అరాచకంగా కరకట్టలోని చంద్రబాబుపై దాడి చేయాలనే వ్యూహంతో భారీ ఎత్తున జనాన్ని పోగేసి..హల్ చల్ చేశారు. అంతేనా..అసెంబ్లీలోనూ, ఇతర సభల్లోనూ చంద్రబాబు, లోకేష్, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఇష్టారీతిన దూషించారు. మొత్తం మీద..జగన్ దృష్టిలోపడి మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆరాటంలో..చేయకూడని తప్పులన్నీ చేసిన జోగి పాపం ఎట్టకేలకు పండిందని టిడిపి కార్యకర్తలు అంటున్నారు. మొత్తం మీద కల్తీ మద్యం కేసులో రమేష్ చేసిన పాపాలు ఇప్పుడు ఆయనను కలకాలం వెంటాడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.