దేవుడి సాక్షిగా చెబుతున్నాను..నేను నీ పెన్సిల్ దొంగతనం చేయలేదు..అంతే..అంటూ..చిన్నప్పుడు పిల్లలు ప్రమాణం చేసేవారు. వారి ప్రమాణంలో ఎంతో కొంత నీతి ఉండేది..భయం ఉండేది..పాపభీతి ఉండేది..అబద్దం చెబితే..దేవుడు శిక్షిస్తాడనే భయం ఉండేది. వాళ్లే కాదు..కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ..దేవుడి వద్ద ప్రమాణాలు చేస్తారు. ముఖ్యంగా కాణిపాకం వినాయకస్వామి వద్ద ప్రమాణం చేసేవాళ్లూ ఉన్నారు. అక్కడ అబద్దం చెబితే..అరిష్టం, నష్టం జరుగుతుందేమోనన్న భయం ఉండేది. అయితే..ఇవన్నీ..నమ్మకాల కోసమే. ఇలాంటి నమ్మకాలను అడ్డం పెట్టుకుని దోపిడీదారులు, దొంగలు, అవినీతిపరులు, విచ్చిన్నకారులు..కూడా తాము తప్పుచేయలేదని ప్రమాణాలు చేసి..తప్పించుకోవాలని, ప్రజల దృష్టిలో తాము అవినీతిపరులం కాదని చెప్పుకునేందుకు ప్రమాణాలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇటువంటి ప్రమాణమే చేశారు. బెజవాడ కనకదుర్గ సాక్షిగా తనకు కల్తీ మద్యంతో సంబంధం లేదని, తాను నిజాయితీపరుడునని ఆయన ప్రమాణం చేశారు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అరాచకంగా వ్యవహరించిన ఈనేత..ఇప్పుడు తాను కల్తీ మద్యం వ్యాపారం చేయలేదని, చేయించలేదని, జనార్థన్రావు ఎవరో తనకు తెలియదని చెబుతున్నారు. దీని కోసమే ఆయన ఈరోజు కనకదుర్గ సాక్షిగా ప్రమాణం చేశారు. వాస్తవానికి ఆయనకు ఈ ఐడియా ముందు రాలేదు. టివి9 డిబేట్లో ఆ పోగ్రామ్ యాంకర్ రజనీకాంత్ ఇలా ప్రమాణం చేయాలని సూచించారు. ఇలా ప్రమాణం చేస్తే..చట్టం దృష్టిలో ఇక ఆయన కల్తీ మద్యం చేయనట్లేనా..? లక్షల కోట్ల దోపిడీ చేశారనే ఆరోపణలతో వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జైలులో వేసింది. దాదాపు 16 నెలలు ఆయన జైలులో ఉన్నారు. పాపం అప్పట్లో జగన్కు ఇటువంటి సలహా ఇవ్వలేదేమో...? ఇచ్చి ఉంటే ఆయన ఆయన నమ్మే ఏసుప్రభుతోపాటు..తిరుమల వెంకన్నతో పాటు హిందూమతం నమ్మే లక్షల దేవుళ్లపై ఒట్లు వేసి, ప్రమాణాలు చేసేవాడు. రజినీకాంత్ అప్పట్లో ఆయనకు ఆ సలహా ఇవ్వకపోవడం నిజంగా విచారకరమే. అప్పట్లో ఇవ్వలేదు సరే..ఇటీవల ఎన్నికలకు ముందు 175/175 అన్నప్పుడు వైనాట్ రజనీ అన్నప్పుడైనా.. ఇవ్వాల్సిందేమో...? మొత్తం మీద అవినీతిపరులైన రాజకీయనాయకులందరూ రజనీకాంత్ను సలహాదారుగా పెట్టుకుంటే బాగుంటుందేమో..?