రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిధున్రెడ్డి తనవల్లే జైలుకు వెళ్లాడని వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు సన్నిహితుడైనందుకే ఆయనను కూటమి ప్రభుత్వం జైలుకు పంపిందని, తన వల్లే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, లేకపోతే ఆయన రాజకీయాల్లోకి వచ్చేవారే కాదని, తన వల్లే ఇప్పుడు ఆయన జైలు పాలయ్యారని జగన్ వ్యాఖ్యానించారు. మిధున్రెడ్డికి లిక్కర్ కుంభకోణంతో సంబంధం లేదని, కనీసం ఆయన తండ్రి ఎక్సైజ్ మంత్రిగా కూడా పనిచేయలేదని, అలాంటప్పుడు ఆయనకు ఈ మద్యం కుంభకోణంతో సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తన వల్లే మిధున్రెడ్డి ఇబ్బందులు పడుతున్నాడని, ఆయన అమాయకుడని జగన్ సర్టిఫికెట్ ఇచ్చేశాడు. ఒకవైపు మద్యం కుంభకోణంలో మిధున్రెడ్డిదే కీలకపాత్ర అని సిట్ వాదిస్తుంటే..ఆయన అమాయకుడని జగన్ చెప్పడంపై పార్టీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మద్యం కేసులో అప్పుడు ఎక్సైజ్శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి అమాయకుడు, అంతంత మాత్రమే..విజయసాయిరెడ్డి కూడా అమాయకుడు, కసిరెడ్డికి ఏమీ తెలియదు...ధనుంజయరెడ్డికి ఏమీ తెలియదు..చెవిరెడ్డి భాస్కర్ అమాయకుడు, వెర్రిబాగులోడు..జగన్ ఓఎస్టీడీ పనిచేసిన కృష్ణమోహన్రెడ్డి నోట్లో వేలుపెడితే..కొరకడం చేతకాని వ్యక్తి..ఇంత మంది అమాయకులు, వెర్రిబాగులోళ్లుతో తాను మద్యం కుంభకోణం చేయలేదని జగన్ చెబితే..ప్రజలు నమ్మాలా..? అసలు మద్యం విక్రయాల్లో నగదు తప్ప డిజిటల్ కరెన్సీని ఎందుకు వాడలేదో సూటిగా చెప్పమంటే చెప్పకుండా..ఆయన అమాయకుడు, ఈయన శుద్దపూస అంటూ..చెబితే..ప్రజలు నమ్ముతారా..? ఏమో..అంటూ కొందరు వైకాపా నాయకులు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. (మిధున్రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి ఎక్సెజ్శాఖను చూడలేదు కనుక మిధున్రెడ్డి మద్యం కుంభకోణం చేసేఅవకాశం లేదంట..? మరి జగన్ తండ్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా..మరి జగన్ అవినీతి, అక్రమాలు చేశాడని అంటే..జగన్ ఒప్పుకుంటాడా..?)
ఈ పిల్లోడిని రెండుసార్లు జైల్లో వేశారు...!
పిఎసి సమావేశంలో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ..అమాయకులైన మాజీ మంత్రులు కాకాణిగోవర్ధన్రెడ్డి, అనిల్కుమార్, ఆర్.కె.రోజాలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో బాపట్ల మాజీ ఎంపి నందిగం సురేష్ను ఉద్దేశించి...ఈ పిల్లోడిని రెండుసార్లు జైల్లో వేశారు. అమాయకుడైన దళితుడ్ని రెండుసార్లు జైల్లో వేస్తారా...? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. నందిగం సురేష్ అమాయకుడట. రాజధాని ప్రాంతంలో ఇసుకదోచేసి.. అడ్డగోలుగా రౌడీయిజం చేసి, ఒక వ్యక్తి చావుకు కారణమైన వ్యక్తి అమాయకుడు, పిల్లోడట. కాగా ఈ సమావేశంలో జగన్ రక్షణపై పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారట. బాబూ జగన్ జాగ్రత్త..నీకు ఈ ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదు. దుర్మార్గులు ఏమైనా చేస్తారంటూ..ఆయనకు లక్ష్మీపార్వతి జాగ్రత్తలు చెప్పారట. అదే విధంగా మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి, మరి కొందరు కూడా ఇదే పాట పాడినట్లు తెలుస్తోంది.