రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణంలో అసలైన నిజాలు బయటకు వస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నెలకొన్న మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం సిట్ ద్వారా విచారణ చేయిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 10మందికి పైగా అరెస్టు కాగా, మరి కొందరు దేశం విడిచి పారిపోయారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిధున్రెడ్డి కూడా అరెస్టు అయ్యారు. గతంలో జగన్ సిఎంగా ఉన్నప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయరెడ్డి, ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్రెడ్డితో పాటు జగన్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి తదితరులు అరెస్టు అయ్యారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డిని ఇప్పటిదాకా విచారించారు. దాదాపు మూడువేల కోట్లకు పైగా మద్యం కుంభకోణం ద్వారా దోచుకున్నారని, దీనిలో పెద్ద సంఖ్యలో ముడుపులు జగన్మోహన్రెడ్డికి చేరాయని సిట్ భావిస్తోంది. దీనిపై ఆయనను త్వరలో అరెస్టు చేస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఇది ఇలా ఉంటే..అప్పట్లో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన నేతకూ భారీగానే ముడుపులు అందాయని వైకాపా నేతలే అంటున్నారు. ఆయనేమీ తక్కవేమీ తినలేదు. నెలకు దాదాపు రూ.5కోట్లు ఆయనకుచేరాయి. దాదాపు ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్న ఆయనకు నెలకు రూ.5కోట్ల చొప్పున ఐదేళ్లలో దాదాపు రూ.300కోట్ల వరకూ చేరి ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఆయన చెబుతున్నారని, కానీ వాస్తవంగా ఆయన కూడా ముడుపులు తీసుకునే సంతకాలు చేశారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ వర్గానికి చెందిన ఈ మంత్రి ఒకప్పుడు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అసభ్యంగా దూషించారు. అయితే ఇప్పుడు తనకేమీ తెలియదని, మద్యం విషయంలో అవినీతి జరగలేదని, తన పాత్ర లేదని, తన వయస్సు చూడాలని కబుర్లు చెబుతున్నారని, అయితే..ఆయనకూ జీవితంలో చూడనంతటి సొమ్ము వచ్చి చేరిందని, ఆయన అడిగినా..అడగకపోయినా..నెల నెలా...ఆయనకు రూ.5కోట్లు అందించారని ఆ వర్గాలు చెబుతున్నాయి. సిట్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఆయనను విచారణకు పిలిచింది. అయితే ఆరోగ్య కారణాలు చెబుతూ ఆయన విచారణకు డుమ్మా కొడుతున్నారు. అయితే ఆయన విచారణకు వస్తే..ఆయనను అప్రూవర్గా సిట్ మారుస్తుందా..? లేక నిందితుడిగానే విచారణ చేస్తుందా..అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద వైకాపా గ్యాంగ్ పేదల రక్త, మాంసాలను పిండేసి..సొమ్ములు చేసుకుని పంచుకున్నారనేది స్పష్టం అవుతోంది.