వైకాపా పాలనలో సాగిన మద్యం కుంభకోణంలో రోజుకో పేరు బయటకు వస్తోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త బి.సి.జిందాల్ కంపెన్సీలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించింది. దాదాపు రూ.3500కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ తేల్చింది. దీనిలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి సన్నిహితులైన పలువురు ఇప్పటికే అరెస్టు అయ్యారు. రాజంపేట ఎంపి మిధున్రెడ్డి, జగన్ సిఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయ ఇన్ఛార్జిగా పనిచేసిన ధనుంజయరెడ్డి, ఆయన ఒఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్రెడ్డితో పాటు పలువురు అరెస్టు అయ్యారు. అయితే...తాజాగా ఈ మద్యం కుంభకోణంలో జిందాల్ కంపెనీ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జిందాల్ సంస్థల్లో ఈడీ బృందం నిన్న వేర్వేరుచోట్ల సోదాలు నిర్వహించింది. విదేశీమారకపు నిర్వహణ చట్టం ఉల్లంఘనల కేసులో ఈ శోధనలను ప్రారంభించింది. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సిఆర్ల్లోని జిందాల్ గ్రూపు డైరెక్టర్లు, అధికారులకు సంబంధించిన డజన్ చోట్ల సోదాలు జరిగాయి. జిందాల్ ఇండియా థర్మల్ పవర్ లిమిటెడ్, జిందాల్ ఇండియా పవర్టెక్ లిమిటెడ్ సంస్థల ద్వారా విదేశీ పెట్టుబడులు, నిధుల బదిలీలలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని ఈడి పరిశీలిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో 20చోట్ల సోదాలు చేసి, మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసును ఇడి విచారిస్తోంది. మద్యవర్తుల ద్వారా డబ్బులు, పెంచిన బిల్లుల రూపంలో లంచాలు చెల్లించబడ్డాయని, ఈ సోదాల్లో ఆరేట్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీజువెలర్స్ ఎక్సింప్ వంటి సంస్ధలు కూడా ఉన్నాయి.