ఓవల్ టెస్టులో భారత్ ఘనవిజయం
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఓవల్ లో జరుగుతున్న నాల్గవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో చివరి రోజు అయిన సోమవారం నాడు ఇంగ్లాండ్ ను భారత్ 210 పరుగులకు ఆలౌట్ చేసింది. గత రోజు వికెట్లేమీ కోల్పోకుండా 77\0 పరుగులతో ఐదవరోజు ఆటను ప్రారంభించింది. బ్రిటన్ ఓపెనర్లు హమీద్, బ్రూన్స్ గత రోజులాగే క్రీజులో పాతుకోపోయారు. భారత్ బౌలర్లను ఆచితూచి ఆడుతూ స్కోరును 100పరుగులు దాటించారు. ఈ స్థితిలో శార్ధూల్ ఠాకూర్ ఓ అద్భుత బంతితో బ్రూన్స్ ను అవుట్ చేశాడు. ఆ వెంటనే ఇంగ్లాండ్ కు వరుస దెబ్బలు తగిలాయి. 120పరుగుల వద్ద మలన్ రనౌట్ అయ్యాడు. 131పరుగులతో లంచ్ కు వెళ్లి వచ్చిన ఇంగ్లాండ్ కు జడేజా షాక్ ఇచ్చాడు. అప్పటి వరకు ఓపిగా ఆడుతున్న ఓపెనర్ హమీద్ ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే బుమ్రా ఓలే పోప్, జానీ బెయిర్ స్ర్టోలను వరుస ఓవర్లలో క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ వెంటనే జడేజా ఆలీని ఔట్ చేశాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 147\6. అయితే వికెట్లు పోయినా ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ భారత్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంటూ మ్యాచ్ ను డ్రా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే శార్ధూల్ ఠాకూర్ మరోసారి రూట్ ను బౌల్డ్ చేసి భారత్ విజయానికి ఉన్న ప్రధాన అడ్డంకిని తొలగించాడు. ఆ వెంటనే వోక్స్ ను ఉమేష్ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 197\8తో టీకి వెళ్లింది. టీ తరువాత ఓవర్టన్, అండర్సన్ లను ఉమేష్ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ కథ ముగిసిపోయింది. 5 టెస్టుల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. సిరీస్ లో చివరదైన ఆఖరి టెస్టు 10వ తేదీన జరగనుంది.