లేటెస్ట్

ప్ర‌తిప‌క్షం దూకుడు...అధికార‌ప‌క్షం నిస్తేజం...!

రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల హ‌డాహుడి ఇంకా ముగియ‌నేలేదు..అప్పుడే..ర‌ణ‌నినాదాలు మొద‌ల‌య్యాయి. నిన్న‌టి దాకా అధికారంలో ఉన్న‌వాళ్లు..ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చారు. ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన వారు..అప్పుడే..ఎన్నిక‌ల నినాదాలు, హామీల అమ‌లుపై నిల‌దీత‌లు, మ‌ళ్లీ వ‌చ్చేది మేమేనంటూ..ప్ర‌గ‌ల్భాల‌తో హోరెత్తిస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వానికి క‌నీసం కుర్చీలు స‌ర్దుకునే అవ‌కాశం కూడా ఇవ్వ‌కుండా దాడి మొద‌లెట్టేశారు. తాను చేసిన మేళ్ల‌ను ప్ర‌జ‌లు మ‌రిచిపోయార‌ని, త‌న‌ను ఎందుకు ఓడించారో తెలియ‌డం లేదంటూ..మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌న్నీళ్ల ప‌ర్యంతం అయ్యారు. అయితే..అంత‌లోనే..ఆయ‌న మ‌ళ్లీ రోడ్లెక్కుతున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటానంటూ..ఆయ‌న చేస్తోన్న ప్ర‌క‌ట‌న‌లతో..మ‌ళ్లీ ర‌ణ‌నినాదాలు మొద‌ల‌య్యాయి. త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను టిడిపి కూట‌మి హ‌త్య‌లు చేయిస్తోందంటూ ఆయ‌న రంకెలేస్తున్నారు. ఇటీవ‌ల ఇవిఎంల‌ను బ‌ద్ద‌లు కొట్టిన కేసులో జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డిని ఆయ‌న ప‌రామ‌ర్శించిన త‌రువాత‌..ఇక యుద్ధ‌మేనంటూ...ఆవేశంగా ఊగిపోయారు. అది అయిందో..లేదో..వ్య‌క్తిగత క‌క్ష‌ల‌తో వినుకొండ‌లో హ‌త్య జ‌రిగితే..త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను టిడిపి న‌రికేసిదంటూ నానా యాగీ చేస్తూ..ఢిల్లీలో ధ‌ర్నాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించి..రాజ‌కీయంగా పైచేయి సాధించేందుకు జ‌గ‌న్ హ‌డావుడి చేస్తున్నారు. మ‌రోవైపు..రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు లేవంటూ..గుండారాజ్ రాజ్యం న‌డుస్తుందంటూ..జ‌గ‌న్ మీడియా రోజుకో అస‌త్య‌క‌థ‌నాల‌ను వండివారుస్తోంది. అదే స‌మ‌యంలో..ఉచిత ఇసుక‌పై నానా రాద్ధాంతం చేసింది. తెలంగాణ ముఖ్య‌మంత్రితో..చంద్ర‌బాబు భేటీ అయిన వెంట‌నే..తిరుమ‌ల కొండ‌లో తెలంగాణ‌కు వాటా ఇస్తున్నార‌ని, ఆంధ్రాపోర్టుల్లో తెలంగాణ‌కు స‌గం స‌గం ఇస్తున్నార‌ని విష ప్ర‌చారాన్ని మొద‌లెట్టింది. మ‌రోవైపు..ప్ర‌తిబిడ్డ‌కు త‌ల్లికివంద‌నం ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, టిడిపి కూట‌మి ప్ర‌భుత్వం ఆ హామీని నెర‌వేర్చ‌డం లేద‌ని ఆరోపిస్తోంది. దీనిపై జ‌గ‌నే స్వ‌యంగా విష‌ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ఈరోజు వినుకొండ‌లో హ‌త్య‌కు గురైన కార్య‌క‌ర్త కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లి అక్క‌డ ప్ర‌తిబిడ్డ‌కు రూ.15వేలు వ‌చ్చాయా..? అంటూ ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఇంకా మొద‌లు కాని, అమ‌లు చేయ‌ని హామీపై ఇటువంటి ప్ర‌చారం చేయ‌డం వైకాపాకే చెల్లింది. నూత‌న ప్ర‌భుత్వానికి క‌నీసం ఆరు నెల‌లైనా స‌మ‌యం ఇవ్వాల‌నే ఇంగితం లేకుండా ఎడాపెడా దాడులు చేయ‌డానికి, దూకుడుగా రాజ‌కీయం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా వైకాపా ప‌నిచేస్తోంది.


అయితే...దీనికి విరుద్ధంగా బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం మాత్రం నిస్తేజంగా క‌నిపిస్తోంది. అధికారం వ‌చ్చింద‌న్న సంతోషం వారిలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్తల్లో ఈ భావ‌న ఎక్కువ‌గా ఉంది. తాము అధికారంలోకి వ‌స్తే..ఎవ‌రైతే..విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తించారో..వారి అంతుచూస్తామ‌ని అప్ప‌ట్లో టిడిపి పెద్ద‌లు పెద్ద ఎత్తున్న ప్ర‌చారం చేశారు. అయితే..అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వారు ఆ సంగ‌తే ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇది టిడిపి కార్య‌క‌ర్త‌ల‌కు, సానుభూతిప‌రుల‌కు న‌చ్చ‌డం లేదు. త‌మ‌పై దాడులు చేసిన వారికి బుద్దిచెప్పాల‌ని, వాళ్లు చేసిన దానికి డ‌బుల్ చేయాల‌నే ధ్యేయంతో ఉన్న‌వారికి ఇదేమి పాల‌న‌..?  అంటూ పెద‌వి విరుస్తున్నారు. అధికార వ్య‌వ‌స్థ‌లో భారీ మార్పులు చేయ‌క‌పోవ‌డం, గ‌తంలో అధికారం చెలాయించిన వారే...మ‌ళ్లీ నూత‌న ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి వారి నిరాశ‌కు కార‌ణాలు. టిడిపి నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేసిన వారికి మ‌ళ్లీ పెద్ద పోస్టులు ఇవ్వ‌డం..నిజ‌మైన కార్య‌క‌ర్త‌ల‌కు ఎమ్మెల్యేలు, మంత్రులు మొహంచాటేస్తుండ‌డంతో..టిడిపి కార్య‌క‌ర్త‌ల్లో నైరాశ్యం ఆవ‌హించింది. నామినేటెడ్ పోస్టులు భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డం కూడా వారిలో నిరాశ‌కు కార‌ణం. టిడిపి పెద్ద‌ల తీరుతో..ఎలాగైనా చంద్ర‌బాబును అధికారంలోకి తేవాల‌నే క‌సితో పోరాడిన కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు రుచించ‌డం లేదు. అందుకే..ఇంత‌కు ముందు సోష‌ల్ మీడియాలో వైకాపాకు గ‌ట్టి కౌంట‌ర్‌లు ఇచ్చే టిడిపి కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రులు ఇప్పుడు నిస్తేజంగా..మ‌న‌కెందుకులే..అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మొత్తం మీద నెల‌న్న‌ర రోజుల్లోనే టిడిపిలో నిస్తేజం అల‌ముకోగా, వైకాపా ర‌ణ‌నినాదాలు అందుకోవ‌డం, దూకుడుగా ముందుకు వెళ్ల‌డం..ప‌రిశీల‌కుల‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌ల్గిస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ