లేటెస్ట్

అవకాశాలను వదిలేస్తోన్న ‘చంద్రబాబు’...!?

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత ‘నారా చంద్రబాబునాయుడు’తానో గొప్ప వ్యూహకర్తనని, తనకు అన్నీ తెలుసునని భావిస్తుంటారు. ఎప్పుడో 40ఏళ్ల క్రితం అమలు చేసిన వ్యూహాలనే ఇప్పుడూ అమలు చేసి ఫలితాలను రాబట్టాలని చూస్తుంటారు. కానీ కాలం చెల్లిన వ్యూహాలు పనిచేయవని ఆయన తెలుసుకోరు. ఆయన పక్కన ఉన్నవాళ్లు ఆయనకు అర్థం అయ్యేలా చెప్పలేరు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో నెట్టుకొచ్చినా ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన పాత విధానాలనే అమలు చేస్తున్నారు. అధికారపక్షం ఎన్నో ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నా, ప్రజలను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతున్నా, దాన్ని ఆయన క్యాష్‌ చేసుకోలేకపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా అంది వచ్చిన అవకాశాలను ఆయన ఈ మూడేళ్లలో ఎన్నో వదులుకున్నారు. తాజాగా అటువంటిదే మరో అవకాశం వచ్చినా ఆయన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. అధికార వైకాపా ప్రభుత్వం దాదాపు రూ.48వేలకోట్ల రూపాయలకు లెక్కలు చూపలేదని ‘కాగ్‌’ స్పష్టం చేసింది. దీన్ని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి ప్రజల్లోకి తీసుకొనిపోవడంలో ఘోరంగా విఫలమైనట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చినా ‘టిడిపి’ దీనిపై అధికారపక్షాన్ని గట్టిగా ఇబ్బంది పెట్టలేకపోయింది. రూ.48వేలకోట్లకు లెక్కా పత్రం లేదంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. ప్రజల సొమ్ముకు జవాబుదారి అయిన అధికారపక్షం అడ్డగోలుగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడంలో పార్టీ ఘోరంగా విఫలమైంది. ఈ విషయంపై పార్టీ నామమాత్రమైన మీడియా సమావేశాలు పెట్టి మమ అనిపించింది. ఘోరమైన తప్పుల విషయంలో కూడా ‘టిడిపి’ ఎందుకు పోరాడలేకపోతోంది.


ఈ విషయంపై పార్టీ వ్యూహకర్తలు ఏమి చేస్తున్నారు..? దీనిపై మేధావులతో సమావేశాలు నిర్వహించి లెక్కలు తేల్వమని డిమాండ్‌ చేయవచ్చు. మేధావులు, తటస్థులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అవకతవకలు, చెల్లించాల్సిన బిల్లులు, గాడి తప్పిన ఆర్థికపరిస్థితిపై సదస్సులు ఏర్పాటు చేసి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టవచ్చు. కానీ ఆ పార్టీలో ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో ‘చంద్రబాబు’ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్నవిషయానికి వైకాపా నానా అల్లరి చేసింది. పట్టిసీమ, పోలవరం, రాజధాని, ఒకేసామాజికవర్గానికి ప్రమోషన్లు ఇచ్చారన్న, బాబాయి హత్య ‘చంద్రబాబు’ చేయించారనే ఆరోపణలు, పింక్‌డైమండ్‌, కోడికత్తి, కాపులకు రిజర్వేషన్ల తదితర విషయాల్లో ఎటువంటి అక్రమాలు జరగకపోయినా నాటి ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా వాటిని ప్రజల్లోకి ఎంతో వేగంగా తీసుకెళ్లింది. తనకు ఉన్న మీడియాతో పాటు, సోషల్‌మీడియాను సమర్థవంతంగా వాడుకుని ‘చంద్రబాబు’ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించగలిగింది. తటస్థులు, మేధావులనబడే ఐవైఆర్‌.కృష్ణారావు, ఇవిఎస్‌ శర్మ, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, తెలకపల్లి రవి, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, మధు, అజయ్‌కల్లం వంటి మాజీ ఐఏఎస్‌ అధికారులతో నిత్యం చంద్రబాబు ప్రభుత్వం విమర్శలు, ఆరోపణలు చేయించి ‘జగన్‌’ సొమ్ముచేసుకున్నారు. నాడు జరగని విషయాలు జరిగాయన్నట్లుగా చిత్రీకరించి వైకాపా ఫలితాలను సాధించగలిగింది. కానీ నేడు కళ్లముందు ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలు కనిపిస్తున్నా ‘చంద్రబాబు’ మాత్రం వాటిని క్యాష్‌ చేసుకోలేకపోతున్నారు. వచ్చిన అవకాశాలతో అధికారపార్టీని ఎండగట్టకుండా, ప్రజలకు అన్నీ తెలుసు అన్నట్లు వ్యవహరిస్తే టిడిపి ఘోరంగా నష్టపోతుంది. ఇప్పటికైనా టిడిపి ఈ విషయాల్లో జోరు చూపించాల్సిన అవసరం ఉంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ