లేటెస్ట్

హఠాత్తుగా ‘ఆంధ్రా’ గవర్నర్‌ బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ‘బిశ్వభూషణ్‌ హరిచందన్‌’ను బదిలీ చేస్తూ ఈ రోజు రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు.  ఆయనను  ‘చత్తీస్‌గడ్‌’ రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ  రాష్ట్రపతి మర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ‘ఆంధ్రప్రదేశ్‌’ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ను నియమించింది. హఠాత్తుగా రాష్ట్రగవర్నర్‌ ‘హరిచందన్‌’ను బదిలీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఎందుకు ఆయనను హఠాత్తుగా మార్చారు, అనే దానిపై రాజకీయవర్గాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. 


ఇటీవల కాలంలో కేంద్రంలోని బిజెపి పెద్దలకు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెడిరదనే వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ బదిలీ రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఇటీవల కాలంలో కేంద్రం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదని, ఆయనను ఇరుకున పెట్టడానికి కేంద్రపెద్దలు ప్రయత్నిస్తూన్నారని, దానిలో భాగంగానే ఆయన స్వంత బాబాయి హత్య కేసును వేగవంతం చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్‌ బాబాయి వై.ఎస్‌.వివేకానందరెడ్డి ఆయన స్వంత ఇంటిలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్యలో ‘కడప’ ఎంపి ‘అవినాష్‌రెడ్డి’ హస్తం ఉందనే ఆరోపణలతో ఆయనను సీబీఐ విచారించింది. అంతే కాకుండా ‘జగన్‌’ ఓఎస్డీ, ఆయన భార్య పిఎ ‘నవీన్‌’కూడా విచారణకు సీబీఐ పిలిచింది. దాదాపు నాలుగేళ్ల తరువాత ఈ హత్య కేసును సీబీఐ వేగవంతం చేయడం వెనుక, కేంద్రానికి, జగన్‌కు చెడడమే కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇదొక్కడే కాదు..రాష్ట్రం అడిగిన ఆర్థిక సహాయాలను నిలిపివేయడం, పోలవరం ప్రాజెక్టు నిధులను చెల్లించకపోవడంతో పాటు, అన్నిరకాలుగా ‘జగన్‌’ను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని, దానికి కొనసాగింపుగా ఇప్పుడు రాష్ట్ర గవర్నర్‌ కూడా బదిలీ చేయించి, ‘జగన్‌’కు మరిన్ని ఇక్కట్లకు గురిచేయాలనే ఆలోచనతో హఠాత్తుగా రాష్ట్ర గవర్నర్‌ను బదిలీ చేసిందనే భావన ఉంది. రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ‘హరిచందన్‌’ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో మంచి సంబంధాలను నెరుపుతున్నారు. ‘జగన్‌’ అనేక అక్రమాలకు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఎన్నోసార్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా, ఆయన ఏనాడూ వాటిని పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసినా గవర్నర్‌ చూస్తూండిపోయారని, రాజ్యాంగ ఉల్లంఘనలకు, పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగినా, ఒక రాజకీయపార్టీ కార్యాలయంపై ‘జగన్‌’ పార్టీ నేతలు దాడులు చేసినా..ఆయన పట్టించుకోలేదని, ఇవే కాకుండా చాలా విషయాల్లోనూ గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుడ్డిగా బలపరిచారనే అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తం మీద ‘జగన్‌’కు పూర్తిగా అనుకూలంగా ఉన్న రాష్ట్ర గవర్నర్‌ను హఠాత్తుగా బదిలీ చేయడం ఒక రకంగా ‘జగన్‌’కు షాక్‌ అనే చెప్పాలి.  

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ