లేటెస్ట్

‘టిడిపి’కి ‘జనసేనాని’ వార్నింగ్‌..!?

టిడిపి, జనసేనల మధ్య పొత్తు ఇక నామమాత్రమేనని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ రెండు పార్టీలు కలిసిపోటీ చేస్తాయని, వారు కలిస్తే..అధికార వైకాపాకు డిపాజిట్లు రావనే విశ్లేషణలు వెలువడుతున్న సమయంలో, అసలు పొత్తే ఉండకపోవచ్చునని గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆంధ్రా’లో పర్యటిస్తున్న జనసేనాని ‘పవన్‌కళ్యాణ్‌’ వివిధ వర్గాలతో సమావేశమవుతున్నారు. నిన్న బీసీ సంఘ సమావేశాలతో సమావేశమైన ఆయన ఈ రోజు ‘కాపు’ సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అయిన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరూ వెయ్యి కోట్లకు కొనలేరని, అటువంటి వ్యాఖ్యలు చేసేవారిని చెప్పుతో కొట్టాలన్నారు. ఇదే సందర్భంలో పొత్తు గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘కాపు’ల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టలేనని, ఏదో 20సీట్లకో..ముప్ప సీట్లకో పరిమితం చేద్దామనుకుంటే కుదరదని, పొత్తు ఆత్మగౌరవానికి భంగం లేకుండా ఉంటేనే ఉంటుందని స్పష్టం చేశారు. తనను విస్మరిస్తే, తనను కించపరిస్తే..ఒంటరిగానైనా పోటీ చేస్తానని ‘పవన్‌’ పరోక్షంగా ‘టిడిపి’కి వార్నింగ్‌ ఇచ్చారని ‘జనసేన’ నాయకులు అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు. హఠాత్తుగా ‘పవన్‌’ ఎందుకు ‘టిడిపి’కి వార్నింగ్‌ ఇస్తున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

‘పవన్‌’కు టిడిపిపై కోపం రావడానికి మూడు కారణాలను చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. దానిలో మొదటిది తన పార్టీలోకి వస్తారని, ఇక రావడమే తరువాయి అన్న బిజెపి మాజీ అధ్యక్షుడు ‘కన్నా లక్ష్మీనారాయణ’ను టిడిపి తన్నుకుపోవడం ఒకటి కాగా..రెండోది..తనకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వెయ్యికోట్ల రూపాయలు ఇవ్వబోయారనే ప్రచారాలు చేయించడం...ఇది ‘టిడిపి’ నుంచే జరిగిందనే అనుమానం మరోటి కాగా..మరో కారణం ఏమిటంటే..నిన్నటి దాకా..తనతో పొత్తు కోసం ఎదురుచూసిన ‘టిడిపి’ ఇప్పుడు స్వంతంగానే పోటీ చేయాలనే తలంపుతో ఉన్నట్లు ఆయనకు అనుమానాలు రావడం మూడోది. తన సామాజికవర్గానికి చెందిన ‘కన్నా’ ‘వంగవీటి రాధా’లను తనకు తెలియకుండా ‘టిడిపి’ తనవైపుకు తిప్పుకోవడం ‘పవన్‌’ను అసంతృప్తికి గురిచేసింది. ఒకవైపు తనతో పొత్తు అంటూనే..మరో వైపు బలమైన ‘కాపు’ నాయకులను ‘టిడిపి’లో చేర్చుకుంటున్నారని, తన పార్టీలో బలమైన నాయకులు లేకుండా చేస్తే తనతో పొత్తు పెట్టుకున్నా..లేకున్నా..‘కాపు’లు టిడిపి వైపే ఉంటారనే ఉద్దేశ్యంతో ‘టిడిపి’ ఇలా చేస్తోందని ఆయన అనుమానిస్తున్నారు. తన పార్టీలో చేరేవారికి ‘టిడిపి’ ఎరవేస్తుందని, ఇలా అయితే..తన పరిస్థితి ఏమిటనే బాధ ఆయనలో వ్యక్తం అవుతోంది. మరో వైపు టిడిపికి అండదండగా ఉంటే ఒక మీడియా సంస్థ ప్రచారం చేసిన ‘వెయ్యికోట్ల’ వార్త తన ప్రతిష్టను దెబ్బతీసిందని, అది టిడిపి అగ్రనేతలకు తెలిసే జరిగిందని, వారే ఈ విధంగా చేయించారని ఆయన సన్నిహితులు ఆయనకు చెబుతున్నారు. ఇది ఆయన కోపానికి మరో కారణం. పొత్తు అంటూ ఎన్నికల దాకా కాలక్షేపం చేసి, చివరకు పొత్తు లేకుండా ‘టిడిపి’ ఒంటరిగా వెళితే తన పరిస్థితి మరోసారి నవ్వుల పాలవుతుందనే భయం మరో కారణం. 

’మంగళగిరి’లో ‘లోకేష్‌’ను మరోసారి ఓడిస్తాం

ఈ కారణాలతో ఆయన టిడిపికి పరోక్షంగా వార్నింగ్‌ ఇస్తున్నారు. అంతే కాదు..తనను కాదని ముందుకు వెళితే ఏమి అవుతుందో చూస్తారు..అంటూ ‘టిడిపి’ జాతీయ ప్రధాన కార్యదర్శి ‘నారా లోకేష్‌’ నియోజకవర్గమైన ‘మంగళగిరి’లో తన పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. దీనిలో భాగంగా ‘బీసీ’ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ‘కోండ్రు కమల’ను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమతో పొత్తు లేకుంటే మరోసారి ‘మంగళగిరి’లో ‘లోకేష్‌’ను ఓడిస్తామని పరోక్షంగా వార్నింగ్‌ ఇస్తున్నారు. దీనిలో భాగంగానే నిన్న జరిగిన ‘బీసీ’ సదస్సుకు ఆమె హాజరయ్యారు. ‘బీసీ’,కాపు కాంబినేషన్‌తో ‘మంగళగిరి’లో ‘లోకేష్‌’ను ఓడిస్తామని, కేవలం ‘మంగళగిరి’లోనే కాదు..దాదాపు 50నియోజకవర్గాల్లో ‘టిడిపి’ గెలుపును తాము..అడ్డుకుంటామని, తద్వారా...టిడిపి మరోసారి ఓడిపోతుందని హెచ్చరిస్తున్నారు. తమతో పొత్తుకావాలనుకుంటే తమ పార్టీలోకి వచ్చే నేతలను ‘టిడిపి’ చేర్చుకోకూడదని, అదే సమయంలో ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలనే షరతును విధిస్తున్నారు. మొత్తం మీద..గతంలో తాను ఒంటరిగా పోటీ చేస్తే ప్రజలు ఓడిరచారని, అందుకే పొత్తులకోసం వెళుతున్నానన్న ‘పవన్‌’ వైఖరిలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, తనను తక్కువ చేయవద్దని, తాను గెలవకున్నా ‘టిడిపి’ని మరోసారి ఓడిస్తానని ఆయన పరోక్షంగా వార్నింగ్‌ ఇస్తున్నారు. మరి ‘పవన్‌’ వార్నింగ్‌లను ‘టిడిపి’ పరిగణలోకి తీసుకుంటుందా..? చూద్దాం ఏమి జరుగుతుందో..?

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ