I&PR అవినీతిపరులు జైలుకెళ్లాల్సిందేనా...!?
గత జగన్ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చెలరేగి అవినీతి, అక్రమాలకు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన రాష్ట్ర సమాచారశాఖలోని అవినీతి అధికారుల పాపం పండబోతోంది. వారి అవినీతి లెక్కల చిట్టాను ఏసీబీ, విజిలెన్స్ బయటకు తీస్తోంది. నాడు జగన్ అండ చూసుకుని చెలరేగిపోయిన నాటి సమాచారశాఖ కమీషనర్ విజయ్కుమార్రెడ్డి, ఆయన అండ చూసుకుని రెచ్చిపోయిన ఉన్నాతాధికారుల అవినీతిపై ఏసీబీ కేసులు నమోదు చేయబోతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర సమాచారశాఖ అవినీతిపై దృష్టిసారించింది. దీనిలోభాగంగా ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేయిస్తోంది. దీనిలో ప్రాధమిక ఆధారాలు లభ్యం కావడంలో, కేసును ఏసీబీకి బదలాయించినట్లు తెలుస్తోంది. దీంతో అప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారంతా ఇప్పుడు కేసులు ఎదుర్కోబోతున్నారు. నాడు శాఖను తన కనుసైగతో శాసించిన అధికారితో పాటు, అంతర్గతంగా అంతా తానే శాఖను నడుపుతానని చెప్పుకుంటోన్న అధికారికి కూడా ఉచ్చు బిగిస్తోంది. ప్రస్తుతానికి ఈ అధికారి తప్పించుకున్నట్లు భావించినా..అంతా ఆ అధికారి చేతుల్లోనే దస్త్రాలు నడిచినందున ఆయనను కూడా కేసులో భాగం చేసి విచారిస్తారు. నాటి కమీషనర్ చేయమందల్లా తాము చేశామని చెబితే చెల్లదు. రూల్స్ను చెత్తబుట్టలో వేసిన అధికారులపై చర్యలు తప్పకుండా ఉంటాయి. కాగా ఇక్కడి నుంచి చెప్పాపెట్టకుండా పారిపోయిన విజయ్కుమార్రెడ్డిని కొలకతా నుండి రప్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏసీబీ కేసు నమోదు అయితే..విజయ్కుమార్రెడ్డిని ఇక్కడకు రప్పిస్తారు. కాగా ఇప్పుడు శాఖలో పనిచేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి సమాచారశాఖ మంత్రి మద్దతు పలికారని ప్రచారం సాగుతోంది. ఆయనను అక్కడే కొనసాగించేందుకు ఆయన తరుపున అవుట్డోర్ యాడ్ ఏజెన్సీకి చెందిన వారు భారీ మొత్తాన్ని ఖర్చుచేశారని తెలుస్తోంది. సదరు అధికారి ఉంటేనే తమ పప్పులు ఉడుకుతాయనే భావనతో వారు ఈ మొత్తాలను ఖర్చుచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శాఖను తన కనుసైగతో శాసించిన అధికారి జీఏడికి అటాచ్ చేయడంతో..ఇప్పుడా అధికారి తనదేమీ లేదని, తాను కేవలం ఏడాదిన్నరపాటు మాత్రమే కీలకంగా పనిచేశానని, గత పదేళ్లలో ఇప్పుడు కీలకంగా పనిచేసే అధికారే..అవినీతి, అక్రమాలకు కారకుడని, ఆయనను తనతో పాటు విచారించాలని సదరు అధికారి విజిలెన్స్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే సదరు అధికారి అప్రూవర్గా మారే అవకాశం ఉంది. అప్పుడు మొత్తం శాఖలో జరిగిన అవినీతి మొత్తం బయటకు వస్తుంది. నాడు జగన్ పత్రికకు వందలకోట్లు ఎలా కట్టబెట్టారు..? ఎలా కట్టబెట్టారనేది సాక్ష్యాలతో బయటకు వస్తుంది. అదే విధంగా అవుట్డోర్ అక్రమాలకు కూడా బయటకు వస్తాయి. మొత్తం మీద..ఏసీబీ కేసు నమోదు అయితే..సదరు అవినీతి అధికారులు ఊచలు లెక్కబెట్టాల్సిందే..!