వాలంటీర్ ‘చంద్రబాబు’...!
వాలంటీర్ అనే ఈ పదం..మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ఇష్టమైన పేరు. 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి 50ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించారు. వారి ద్వారానే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలు చేశారు. ఈ క్రమంలో వారిపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా వారినే కొనసాగించి రాజకీయంగా ప్రయోజనం పొందాలని ఆశించారు. అయితే..ఆయన ఆశలు నెరవేరలేదనుకోండి. ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారా సంక్షేమ పథకాలు అందించడంతో కాస్తాకూస్తో సానుకూలత ఉంది. ఈ అనుకూలత వల్లే చంద్రబాబు తాను గెలిస్తే వారిని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అనుకున్నట్లే ఆయన అధికారంలోకి రావడంతో ఇప్పుడు మళ్లీ వాలంటీర్లపై చర్చసాగుతోంది. అయితే..దీనిపై ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంచాల్సి ఉంది. గతంలో వాలంటీర్ల ద్వారా వీటిని చేసేవారు. అయితే..ఇప్పుడు వాలంటీర్లపై స్పష్టత లేకపోవడంతో..సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంచాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎన్డిఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే రేపు పెంచిన పెన్షన్ను ఇవ్వబోతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక వాలంటీర్గా స్వయంగా ఆయనే పెన్షన్లను పంచబోతున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన పెన్షన్దార్లకు వారి ఫించన్లు ఇవ్వబోతున్నారు. దేశ చరిత్రలోనే ఇటువంటి కార్యక్రమం గతంలో ఎప్పూడూ జరగలేదు. ఒక ముఖ్యమంత్రి వాలంటీర్గా ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందించడం సంక్షేమంపై ఆ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని చాటుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చేసిన అతి ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తోన్న ఈపనితో సమాధానం చెప్పినట్లవుతుంది. మేము అధికారంలోకి రాకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇంటింటికి ఫింఛన్లు ఇవ్వరు..ప్రతివారు క్యూలో నిల్చుని పెన్షన్లు తీసుకోవాల్సి వస్తుందని వైకాపా ప్రచారం చేసింది. అయితే అది నిజం కాదని, ప్రతి ఒక్కరికీ ఇంటింటికి ఫించన్ను అందిస్తామనే భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగారు. తద్వారా వైకాపా ఫేక్ ప్రచారాన్ని ఖండించడం ఒకటైతే..ఇక వాలంటీర్లకు స్వస్తి పలికే కార్యక్రమం రెండోది. మొత్తం మీద చంద్రబాబు వాలంటీర్గా ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. గతంలో హామీ ఇచ్చిన వాలంటీర్లను కొనసాగిస్తారా..లేక రద్దు చేస్తారా..? అనేది ఇప్పట్లో చెప్పలేం. అయితే..వాలంటీర్లు లేకపోయినా..సంక్షేమపథకాలు ఇంటింటికి అందిస్తామనే భరోసాను ప్రభుత్వం ప్రజలకు ఇవ్వబోతోంది.