"రణతుంగ" వ్యాఖ్యలు సరికాదు: శ్రీలంక క్రికెట్ బోర్డు
జూలై 13 నుంచి రాబోయే తెల్లబంతి సిరీస్లో "రెండవ శ్రేణి ఇండియన్ జట్టు" తో ఆడటానికి బోర్డు అంగీకరించిందని విమర్శించిన మాజీ కెప్టెన్ అర్జున రణతుంగపై శ్రీలంక క్రికెట్ శుక్రవారం స్పందించింది. క్రికెట్ బోర్డు రణతుంగ వాదనలను తిరస్కరించింది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు బలమైన జట్టు అని పేర్కొంది. శ్రీలంకకు ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ రణతుంగ శ్రీలంక క్రికెట్ బోర్డుపై విరుచుకుపడ్డాడు. టీవీ మార్కెటింగ్ అవసరాలను తీర్చడానికి భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి పాలకమండలి అంగీకరించిందని, ద్వీపంలో "బలహీనమైన" జట్టుతో ఆడటం అవమానమని అన్నారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్తో జరిగే 5 టెస్టుల సిరీస్కు భారత్ ఒక జట్టును పంపించింది. విరాట్ నేతృత్వంలోని జట్టు మెరుగైన జట్టు అని, ధావన్ కెప్టెన్సీలోని జట్టు రెండవ శ్రేణి జట్టు అని, అటువంటి జట్టుతో శ్రీలంక మ్యాచ్ ఆడడం సరికాదని రణతుంగ పేర్కొన్నారు.
భారత్ రెండవ శ్రేణి జట్టు ఇక్కడకు రావడం మా క్రికెట్ను అవమానించడమే. టెలివిజన్ మార్కెటింగ్ అవసరాల కారణంగా వారితో ఆడటానికి ప్రస్తుత పరిపాలనమండలి అంగీకరించిందని నేను నిందించాను" అని రణతుంగ చెప్పారు. 20 మందితో కూడిన జట్టుతో భారత్ శ్రీలంకలో పర్యటించనుంది. ఈ బృందానికి శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నారు. దీనికి మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరించనున్నారు. కాగా భారత్ నుంచి వచ్చిన 20 మంది ఆటగాళ్లలో 14 మంది అన్ని ఫార్మాట్లలో భారత్ తరఫున ఆడారని, ధావన్ నేతృత్వంలోని జట్టు "బలమైనది" అని శ్రీలంక క్రికెట్ అభిప్రాయపడింది.